తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్.. టీవీకే అధినేత విజయ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార DMKకు విజయ్ పార్టే ప్రధాన ప్రతిపక్షం అన్నది విజయ్ అవగాహనా రాహిత్యం అన్నారు. ఇంటిమీద కోడిని పట్టుకోలేనోళ్లు.. ఆకాశం ఎగురుతా అని కలలు కనకూడదని హితవు పలికారు.
తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ తమ అస్త్ర శస్త్రాలు తీసి ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నాయి. విమర్శ, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీకే చీఫ్ విజయ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకేకు గట్టిపోటీ ఇచ్చేది తన పార్టీనేనని తమ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇదే వెల్లడైందన్నారు. అయితే తాజాగా దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ స్పందించారు.
"విజయ్ మాట్లాడిన మాటలు రాజకీయాల్లో ఆయన అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఇంటిపైకెక్కి కోడినిపట్టుకోనోళ్లు.. ఆకాశం పైకి ఎగిరారట. ఆయన ప్రజల్లోకి వస్తే వాస్తవ పరిస్థితులేంటో ఆయనకు అర్థం అవుతోంది. గొప్ప నాయకులతో సంభాషించి రాజకీయం తెలుసుకోవాలి. కుండలో ఏదుంటో గరిటలోకి అదే వస్తుంది" అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే అధికారం సాధించడం కాదు కదా ఒక్క ఓటు కూడా ఆ పార్టీకి రాదన్నారు.
అయితే అంతకు ముందు ఒక ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ టీవీకేకు ఇండియా కూటమితో గాని, బీజేపీతో గాని పొత్తు ఉండదని ఆ పార్టీ ఒంటరిగానే అత్యధిక మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. దీనిపై బీజేపీ లీడర్ కౌంటరిచ్చారు.


