రూ. 200 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఏఎన్ఎస్సీబీఎల్)లో చోటుచేసుకున్న రూ.500 కోట్ల కుంభకోణానికి సంబంధించి రూ.200 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. హోటళ్లు, రిసార్టులు, భూములు తదితర 51 స్థిరాస్తులున్నా యని, వీటికి ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధముందని పేర్కొంది.
ఇవన్నీ నిందితులు, వారి కుటుంబీకులు, సన్నిహితులు, కంపెనీలు, సంస్థల పేర్లతో ఉన్నట్లు వివరించింది. అయితే, ఇవన్నీ ఎవరి ఆస్తులనే విషయాన్ని మాత్రం ఈడీ స్పష్టం చేయలేదు. అండమాన్ నికోబార్ పోలీసులు స్థానిక ఎంపీ, కాంగ్రెస్ నేత కుల్దీప్ రాయ్ శర్మ, బ్యాంకు ఎండీ కె.మురుగన్, బ్యాంకు అధికారి కె.కలైవానన్, హోటల్ యజమాని సంజయ్ లాల్ తదితరులపై దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వీరంతా నిబంధనలను ఉల్లంఘిస్తూ తప్పుడు పేర్లతో పెద్ద మొత్తాల్లో వందకు పైగా రుణాలను పొందినట్లు ఆరోపణలున్నాయి.


