పరోక్షంగా సీఎం పదవిని ప్రస్తావిస్తూ
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్: ‘ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి. లేదంటే నా టార్గెట్ అదే’ అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి పదవిని ప్రస్తావిస్తూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ మున్సిపల్ అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రాజగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి ఇస్తానంటే ఇంకా ఆగుతానని.. అదే సమయంలో పదవి గురించి తాను బాధపడటం లేదని చెప్పారు. ఇకపై మునుగోడు నియోజకవర్గాన్ని పార్టీ కార్యకర్తలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని తాను చూసుకుంటానన్నారు. సమయం వచ్చి నప్పుడు జెండా ఎగురవేద్దామని వ్యాఖ్యానించారు. ‘సమయం వస్తుంది.. అది కూడా నెరవేరుతుంది’ అని అన్నారు.


