మరో రూ.100 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అక్రమ మైనింగ్, బొగ్గు దొంగతనం ఆరోపణలపై మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం రూ.100 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. శాకాంబరీ ఇస్పాత్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ ఫెర్రోటెక్ లిమిటెడ్ కంపెనీలకు చెందిన స్థిరాస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు సీజ్ చేసిన వాటిలో ఉన్నాయంది.
దీంతో, రూ.2,742 కోట్ల మేర అవకతకలు జరిగాయని భావిస్తున్న ఈ కేసులో ఇప్పటి వరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.322.71 కోట్లకు చేరిందని ఈడీ పేర్కొంది. బొగ్గు కుంభకోణం కేసు విచారణలో భాగంగా జనవరి 8వ తేదీన కోల్కతాలోని ఐ–ప్యాక్ అనే ఎన్నికల కన్సల్టెన్సీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్కు చెందిన కార్యాలయాల్లో ఈడీ చేపట్టిన సోదాలు వివాదాస్పదంగా మారాయి. జైన్ ఇంట్లో సోదాలు జరుపుతుండగా సీఎం మమతా బెనర్జీ అక్కడికి వచ్చి కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను తీసు కెళ్లారని ఈడీ ఆరోపించడం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా రావడం తెల్సిందే.


