బెంగుళూరు: అనుమానాస్పదంగా సోషల్ మీడియా కార్యకర్త ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన కేరళ– కర్ణాటక సరిహద్దుల్లోని కాసరగోడులో జరిగింది. చిన్న పాప అనే పేరుతో రేష్మా (24) సోషల్ మీడియా కార్యకర్తగా ప్రజాదరణ పొందింది. ఉళియత్తడ్కలో బాడుగ ఇంటిలో నివాసం ఉంటోంది. అదే ఇంటిలో మంగళవారం మధ్యాహ్నం ఆమె ఉరి వేసుకొన్న స్థితిలో ఉండగా, స్థానికులు చూసి కిందికి దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించింది. ప్రజుల్లా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేష్మాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు.
ఇటీవలే విడాకులు
అయితే తీవ్రమైన గొడవలు కావడంతో నెల కిందటే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఒక్కరే జీవిస్తోంది. కొడుకును కాసరగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంచింది. రేష్మా ఇంటికి ఆమె ప్రేమికుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని తెలిసింది. రేష్మా ముబైల్ ఫోన్ను పోలీసులు స్వా«దీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. రేష్మా తల్లిదండ్రులు గంగాధరన్, శైలజ కాగా, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి జీపు డ్రైవరు. ఇన్స్టాలో రేష్మాకు 2 లక్షలకు పైగా ఫోలోయర్లు ఉన్నారు. డ్యాన్సులు, స్కిట్లు వంటి కార్యక్రమాలతో ఆదరణ పొందుతోంది. గ్రామీణ జీవితం, వంటకాల పోస్టులు చేసేది. చిన్నపాప మరణంతో సోషల్ మీడియాలో ఆవేదన, సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. కుటుంబ గొడవలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానాలున్నాయి.


