పెళ్లికి ముందు సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాహానికి ముందే శారీరక సంబంధాలు కొనసాగించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. వివాహం చేసుకుంటానని ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత మరొక మహిళను వివాహం చేసుకున్నాడని నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఈ కేసు చారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న (BV Nagarathna) మాట్లాడుతూ.. ''వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ప్రవేశించే యువత జాగ్రత్త వహించాలని హితవు పలికారు. బహుశా మనం పాతకాలపు వాళ్ళమే కావచ్చు. కానీ వివాహానికి ముందు.. ఒక అబ్బాయి, అమ్మాయి అపరిచితులు. వారి మధ్య ఎంత సఖ్యత ఉన్నా వివాహానికి ముందు వారు శారీరక సంబంధంలో ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. అందుకే ఎవరికి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడద''ని అన్నారు.
ఇక కేసు విషయానికి వస్తే.. 2022లో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వెబ్సైట్ ద్వారా నిందితుడికి బాధితురాలు పరిచయమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడితో సన్నిహితంగా మెలిగింది. వారిద్దరూ దుబాయ్కు కూడా వెళ్లారు. పెళ్లికి ముందే వారిద్దరూ చాలా దూరం వెళ్లిపోయారు. అయితే తాము ఏకాంతంగా కలుసుకున్నప్పుడు తనకు తెలియకుండానే నిందితుడు వీడియో తీసి, తనను బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. తనను మోసం చేసి.. 2024 జనవరిలో పంజాబ్లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని కోర్టుకు తెలిపింది.
కాగా, బాధితురాలు పెళ్లికి ముందే నిందితుడితో దుబాయ్ (Dubai) ఎలా వెళ్లిందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అన్న ఉద్దేశంతో బాధితురాలు అతడితో సన్నిహితంగా మెలిగిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వివాహానికి ముందే తొందరపాటు పనికిరాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వారిద్దరూ ఇష్టపూర్వకంగానే సన్నిహితంగా మెలిగినందున.. ఇది విచాణార్హమైన, దోషులుగా తేల్చదగిన కేసు కాదన్నారు. వారిని మధ్యవర్తిత్వానికి పంపుతామన్నారు. దీనిపై తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


