ఐఏఎస్ ఆఫీసర్.. మరో ఐఏఎస్ను పెళ్లాడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న వ్యక్తికి.. మూడో పెళ్లి చేసుకున్న క్రమంలో కూడా ఐఏఎస్ అధికారిణే భార్యగా వస్తే అది అరుదైన విషయంగానే భావించాలి.
చట్టపరంగానే ఇద్దరి భార్యలకు బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు మూడో వివాహం చేసుకున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అయితే అంతకుముందు వివాహం చేసుకున్న ఇద్దరూ భార్యలు ఐఏఎస్ అధికారిణులే గాక, ఇప్పుడు తాజాగా చేసుకున్న ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరే కావడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్ మూడోసారి వివాహం చేసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది.
2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అవి ప్రసాద్. ఇప్పటివరకు వివాహం చేసుకున్న ముగ్గురు భార్యలూ IAS అధికారులే కావడం విశేషం. తాజా వివాహం ఫిబ్రవరి 11న కూనో నేషనల్ పార్క్లో జరిగింది. ఈసారి ఆయన 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అంకిత ధాక్రేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన ఐఏఎస్ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్కి చెందిన అవి ప్రసాద్.. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్లో చేరారు. ఆపై ఏడాదికి అఖిల భారత సర్వీస్లో 13వ ర్యాంకు సాధించి ఐఏఎస్ హోదా పొందారు.


