రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా చెప్పిన సంగతి తెలిసిందే.. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరుదేశాల నడుమ జరిగిన చర్చల్లో భారత్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అయితే, ఈ క్రమంలో చమురు కోనుగోలుపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవన్నారు. దేశ ప్రయోజనాలు, ధర, నష్టభయాలను పరిగణనలోకి కుంటామని ఈ విషయంలో భారత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తేల్చి చెప్పారు.
జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న జై శంకర్.. భారత్ తన ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ విధానాన్నే కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇంధన సమస్యల ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి సంక్లిష్టంగా ఉందన్నారు. చమురుతో సహా అన్ని అంశాల్లోనూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని అదే సదస్సు వేదికగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొనడం విశేషం.
‘‘ప్రపంచ చమురు మార్కెట్లు అతి సంక్లిష్టమైనవి. కనుక చమురు కంపెనీలు చాలా అంశాలను మదింపు చేసిన మీదట తమ అత్యుత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరుపుతాయి’’ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగాక ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. అందుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు టారిఫ్లు విధించారు.
మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కీలక ముందడుగు పడ్డ నేపథ్యంలో వాటిని తాజాగా రద్దు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తానని భారత్ స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆ సందర్భంగా ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. రష్యా మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ వచ్చింది. కొనుగోళ్లు నిలిపేస్తామంటూ భారత్ తమకు అధికారికంగా వర్తమానం ఇవ్వలేదని పలుమార్లు స్పష్టం చేసింది. కేంద్రం కూడా ఈ విషయంలో మొదటినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.


