భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకున్న దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ అలియాస్ సియాకు, భోపాల్కు చెందిన సమీర్ అనే వ్యక్తితో ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరు పిల్లలున్న సమీర్తో ఏర్పడిన ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. సమీర్పై ఉన్న నమ్మకంతో మూడు నెలల క్రితం సియా తన ఇంటిని విడిచిపెట్టి, భోపాల్లోని కమలా నగర్లో ఉన్న అతని ఇంటికి వచ్చేసింది.
సమీర్ ఇంట్లోనే సియా నివాసం ఉంటుండటంతో, అతని భార్యకు, సియాకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సమీర్ భార్య.. జబల్పూర్లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇసే సమయంలో సియా.. తనను వివాహం చేసుకోవాలని లేదా తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సమీర్పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన సమీర్ ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.
ఈ నేరంలో అతడి తల్లి, సోదరులు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. సియాను హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు నిందితుడు సమీర్ తన కుటుంబ సభ్యుల సహాయంతో సియా మృతదేహాన్ని ఒక ఇనుప పెట్టెలో కుక్కాడు. తరువాత ఆ పెట్టెను ఇంటి సమీపంలోని నిషాత్పురా ప్రాంతంలోని ఒక సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. అయితే గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న పిల్లలు అక్కడి సెప్టిక్ ట్యాంక్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు, లోపల ఏదో ఇనుప పెట్టె తేలుతున్నట్లు గమనించారు.
వెంటనేవారు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్యాంక్ నుండి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సమీర్ పరారీలో ఉండగా, అతడికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు


