కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22న భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో కొలువై ఉన్న పరమశివుని ఈ దివ్య క్షేత్రానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. శీతాకాలం విరామం తర్వాత బాబా కేదార్నాథ్ దర్శనం పునఃప్రారంభం కానుండటంతో ఉత్తరాఖండ్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.
ఆలయ కమిటీ నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 22 ఉదయం 8:00 గంటలకు వృషభ లగ్నంలో కేదార్నాథ్ ఆలయ తలుపులు శాస్త్రోక్తంగా తెరుచుకోనున్నాయి. ఉఖిమఠ్లోని శీతాకాల నివాసమైన ఓంకారేశ్వరాలయంలో ఈ ప్రారంభ తేదీ , సమయాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా టీ గంగాధర్ లింగ్ను నియమించారు. ఆలయంలో జరిగే పవిత్ర పూజా కార్యక్రమాలను, ఆచారాలను ఈయన పర్యవేక్షించనున్నారు.
కేదార్నాథ్తో పాటు ఉత్తరాఖండ్లోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల (చార్ ధామ్) ప్రారంభ తేదీలను కూడా అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు 2023, ఏప్రిల్ 23న ఉదయం 6:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో తెరుచుకుంటాయి. అంతకుముందే ఏప్రిల్ 7 నుండి వార్షిక యాత్ర ప్రారంభం కానుంది. అలాగే గంగోత్రి, యమునోత్రి ఆలయాలు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని 2026, ఏప్రిల్ 19న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి.
కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానుండటంతో హిమాలయాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని వేలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులు తమ ప్రయాణం, వసతి, ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాలలో ఉండే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలతో ఆధ్యాత్మిక యాత్రను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా..


