ముంబై: స్వదేశంలో జరుగుతున్న ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఆరుగురు ప్లేయర్లు తొలి రౌండ్లోనే వెనుదిరగ్గా... డబుల్స్ విభాగంలోనూ నిరాశే మిగిలింది. తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–అంకిత రైనా... ప్రార్థన తొంబారే (భారత్)–అలెవిత్నా ఇబ్రాగిమోవా (రష్యా)... రుతుజా భోస్లే (భారత్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) జోడీలు ఓటమి పాలయ్యాయి.
రష్మిక–అంకిత 4–6, 2–6తో లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్)–నయీమా కరామోకో (స్విట్జర్లాండ్) చేతిలో... ప్రార్థన–అలెవిత్నా 1–6, 1–6తో పొలీనా ఇటాసెంకో–ఎలీనా ప్రిడాంకినా (రష్యా) చేతిలో... రుతుజా–పీంగ్టార్న్ 6–4, 1–6, 9–11తో నికోల్ హ్యుర్గో (అర్జెంటీనా)–మనన్చాయ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు.
తొలి రౌండ్లో ఓడిపోయిన జోడీలకు 2,000 డాలర్ల () చొప్పున ప్రైజ్మనీ లభించింది. సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి అంకిత, సహజ యామలపల్లి, శ్రీవల్లి రష్మిక, మాయ రాజేశ్వరన్, వైదేహి, వైష్ణవి బరిలోకి దిగినా ఒక్కరు కూడా రెండో రౌండ్కు చేరుకోలేకపోయారు.


