ముంబై: కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంపై ముంబై రంజీ జట్టుకు... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు చేశాడు. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ముంబై జట్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటకతో తలపడనుంది. ఇప్పటి వరకు ముంబై జట్టు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకోగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుతో ముచ్చటించాడు.
ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్తో సుదీర్ఘంగా సంభాషించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్లో సచిన్ సార్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. విజయ పరంపర కొనసాగించడం, మానసిక దృఢత్వం, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి ఎన్నో అంశాలపై కీలక సూచనలు చేశారు. ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయన మాటలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కీలక సమరాల్లో ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చో చక్కగా వివరించారు. రంజీ ట్రోఫీలో ఆ సూచనలు పాటిస్తూ విజయాలు సాధించాలని భావిస్తున్నాం’ అని ముంబై కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ పేర్కొన్నాడు.


