ముంబై: గాయం నుంచి కోలుకుంటున్న భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరలోనే మైదానంలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు. రోజు రోజుకి తన ఫిట్నెస్ మెరుగవుతోందని అన్నాడు. ప్రపంచ పికిల్బాల్ లీగ్ కార్యక్రమంలో ముంబై పికిల్ పవర్ సహ యజమాని హోదాలో పాల్గొన్న పంత్ తను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో తిరిగి క్రికెట్ ఆడేందుకు చెమటోడ్చుతున్నట్లు చెప్పాడు.
‘నా ఫిట్నెస్ క్రమంగా మెరుగవుతోంది. త్వరలోనే క్రికెట్ మైదానంలోకి దిగుతాను’ అని 27 ఏళ్ల పంత్ ఆశాభావం వ్యక్తం చేశడు. గత నెల వడోదరలో ప్రాక్టీస్ సెషన్లో అతను గాయపడ్డాడు. క్రికెట్పై తనకున్న ప్రేమే ఎన్ని గాయాలైనా... కష్టనష్టాలెదురైనా కోలుకునే స్థైర్యాన్నిస్తుందని ఈ స్టార్ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. ‘ప్రతి గాయం, పునరాగమనం నాకో పాఠం నేర్పింది’ అని పంత్ తెలిపాడు.


