ఢిల్లీ... ఈసారైనా? | Womens Premier League final match is today | Sakshi
Sakshi News home page

ఢిల్లీ... ఈసారైనా?

Feb 5 2026 3:59 AM | Updated on Feb 5 2026 3:59 AM

Womens Premier League final match is today

టైటిల్‌ గెలిచేందుకు క్యాపిటల్స్‌కు నాలుగో అవకాశం

రెండో ట్రోఫీ వేటలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

నేడు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌ పోరు

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం

వడోదర: ఒకటి కాదు రెండు కాదు...వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు... గత మూడు ప్రయత్నాల్లోనూ తుది మెట్టుపై చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సారైనా తమ తొలి కప్‌ కలను నెరవేర్చుకోవాలని ఒకవైపు పట్టుదలగా ఉంది. మరోవైపు అద్భుత ఫామ్‌తో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు నేరుగా అర్హత సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే టైటిల్‌ పోరులో 2024 చాంపియన్‌ ఆర్‌సీబీతో ఢిల్లీ తలపడనుంది. 

జోరు మీదున్న స్మృతి బృందం 
అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఆర్‌సీబీ లీగ్‌ చరిత్రలో వరుసగా ఐదు విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్‌ స్మృతి మంధాన 290, గ్రేస్‌ హారిస్‌ 228 పరుగులు నమోదు చేశారు. రిచా ఘోష్‌ 150కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో దూకుడును ప్రదర్శించింది. ఆల్‌రౌండర్‌గా డిక్లెర్క్‌ అంచనాలకు మించి రాణించింది. 15 వికెట్లు తీసిన డిక్లెర్క్‌ బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. 

ప్రధాన పేసర్‌ లారెన్‌ బెల్‌ ప్రత్యర్థిని ఆరంభంలోనే కట్టిపడేస్తోంది. ఈ సీజన్‌లో ఆమె ఏకంగా 116 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. స్పిన్నర్‌ శ్రేయాంక కూడా 11 వికెట్లతో రాణించగా, ఎలైస్‌ పెరీ స్థానంలో అనూహ్యంగా జట్టులోకి వచి్చన సయాలీ కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంది. ఇదే జోరును అందరూ కొనసాగిస్తే బెంగళూరుకు మరో విజయం దక్కవచ్చు.   

బ్యాటర్లదే బాధ్యత... 
ఢిల్లీ ఈ సీజన్‌లో సాధించిన ఐదు విజయాలు కూడా ఛేదనలోనే వచ్చాయి. తొలుత బ్యాటింగ్‌కంటే టీమ్‌ ఛేదనకే ఆసక్తి చూపిస్తోంది. అయితే ఫైనల్‌ ఒత్తిడిని ఏమేరకు అధిగమిస్తుందనేది ఆసక్తికరం. గత సీజన్‌ ఫైనల్లో ఢిల్లీ ఛేదనలోనే ఓడిపోయింది. తాజా సీజన్‌లో కొత్త కెపె్టన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ నేతృత్వంలో జట్టు మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన ఉత్సాహంలో ఉన్న జెమీమా నాయకురాలిగా తొలి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంది. 

ఓపెనర్లు షఫాలీ, లిజెల్‌ లీ తొలి వికెట్‌కు కనీసం అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఢిల్లీ గెలిచింది. మూడో స్థానంలో వోల్‌వార్ట్‌ నిలకడగా ఆడుతుండగా, జెమీమా కూడా ఎలిమినేటర్‌లో చక్కటి ఇన్నింగ్స్‌ ఆడింది. బౌలింగ్‌లో మరోసారి శ్రీచరణి (14 వికెట్లు), నందిని శర్మ (16 వికెట్లు), స్నేహ్‌ రాణాలపై జట్టు ఆధారపడుతోంది. పేసర్‌ షినెల్‌ హెన్రీ కూడా ప్రభావం చూపించగలదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement