టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్గా పాతుకుపోయాడు.
విధ్వంసకర ఇన్నింగ్స్కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
మొదటి ఐపీఎల్ కోచ్ను నేనే
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ (Ricky Ponting) అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్కు మొదటి ఐపీఎల్ కోచ్ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్స్టార్గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.
కాగా అభిషేక్ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్ ఢిల్లీ కోచ్గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్లోనే అభిషేక్ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్.. అభిషేక్ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్ చేసిందని వెల్లడించాడు.
భవిష్య సూపర్స్టార్.. వద్దని మొత్తుకున్నా వినలేదు
"అతడికి మొదటి ఐపీఎల్ కోచ్ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్ మీదుగా స్ట్రెయిట్గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.
అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్స్టార్ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.
ధావన్ కోసం ట్రేడ్ చేసిన ఢిల్లీ
కాగా శిఖర్ ధావన్ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్ శర్మను సన్రైజర్స్కు ట్రేడ్ చేసింది. ఇక సన్రైజర్స్కు మారిన తర్వాత అభిషేక్ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్లో 162కు పైగా స్ట్రైక్రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్లు ఆడి 1297 రన్స్ రాబట్టిన అభిషేక్ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.
చదవండి: భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా


