చరిత్ర సృష్టించిన భారత్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా | India Script World Record Aaron Vaibhav Led Ind U19 WC Final Win vs Afg | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Feb 4 2026 9:37 PM | Updated on Feb 4 2026 10:16 PM

India Script World Record Aaron Vaibhav Led Ind U19 WC Final Win vs Afg

భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్‌ వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్‌ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్‌.. అఫ్గనిస్తాన్‌తో తలపడింది. హరారేలో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.

కొండంత లక్ష్యం 
కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన యువ భారత్‌ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు).. వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే  కూడా హాఫ్‌ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.

ఇదే అత్యధిక లక్ష్య ఛేదన
వీరికి తోడు విహాన్‌ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్‌ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్‌ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్‌ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఆరోన్‌కు లభించింది. కాగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.

ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్‌ ఐర్లాండ్‌ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్‌ను ఫినిష్‌ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ భారత్‌
మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో  ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement