T20 WC 2026: ‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది’ | IND vs PAK Will 100 Percent Happen: Ashwin T20 WC Prediction PCB Boycott | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది’

Feb 4 2026 7:08 PM | Updated on Feb 4 2026 7:31 PM

IND vs PAK Will 100 Percent Happen: Ashwin T20 WC Prediction PCB Boycott

భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్‌ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.

ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్‌- పాక్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ భారత్‌లో జరుగుతుండగా.. పాక్‌ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడనుంది.

పాక్‌ ఓవరాక్షన్‌
అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.

వందకు వంద శాతం జరుగుతుంది
‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్‌ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.

ఈ మ్యాచ్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్‌ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్‌కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.

ఇతర బోర్డులకూ నష్టమే
పాక్‌ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్‌కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.

అయినా ఈసారి పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు.  ఈసారి పాక్‌ తటస్థవేదిక మీదే పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్‌ను బహిష్కరించడం టెక్నికల్‌గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.

ఇప్పటికే బంగ్లా అవుట్‌
కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్‌ ఐసీసీని కోరింది. 

అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్‌ బంగ్లాదేశ్‌కు వంతపాడుతూ భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి:  T20 WC 2026: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement