తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పడిక్కల్‌ విధ్వంసకర శతకం | Ranji Trophy: In a must win game, Padikkal smashed century for Karnataka | Sakshi
Sakshi News home page

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పడిక్కల్‌ విధ్వంసకర శతకం

Feb 1 2026 6:47 PM | Updated on Feb 1 2026 6:54 PM

Ranji Trophy: In a must win game, Padikkal smashed century for Karnataka

కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దేశవాలీ క్రికెట్‌లో అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్‌ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ ఉగ్రరూపం దాల్చాడు. 

40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ కర్ణాటక కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సహా మ్యాచ్‌ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. 

ఛేదనలో పడిక్కల్‌కు మయాంక్‌ అగర్వాల్‌ (53), శ్రేయస్‌ గోపాల్‌ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్‌ విధ్వంసకర శతక​ంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్‌ బౌలర్లలో అన్మోల్‌జీత్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. సుఖ్‌దీప్‌, ఎమన్‌జోత్‌ చహల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అంతకుముందు పంజాబ​్‌ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఉదమ్‌ సహారన్‌ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో సహారన్‌ మినహా ఎ‍వ్వరూ రాణించలేదు. అన్మోల్‌ప్రీత్‌ (44), అభిజీత్‌ (33), హర్ప్రీత్‌ బ్రార్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్‌ షెట్టి 2, విధ్యాదర్‌ పాటిల్‌, మొహిసిన్‌ ఖాన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ గోపాల్‌ (77), కేఎల్‌ రాహుల్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్‌ అగర్వాల్‌ (32), విధ్యాదర్‌ పాటిల్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ 4, సుఖ్‌దీప్‌ 3, అన్మోల్‌ 2, చహల్‌ ఓ వికెట్‌ తీశారు. 

అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్‌ (81), చహల్‌ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్‌ (44) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్‌ పాటిల్‌ 4, శ్రేయస్‌ గోపాల్‌ 3, మొహిసిన్‌ ఖాన్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement