మేడారం గద్దెల ప్రాంగణం నుంచి సారలమ్మను కన్నెపల్లికి తీసుకెళ్తున్న పూజారులు
వనంలోకి జన దేవతలు
అడవిలోకి తరలిన సమ్మక్క, సారలమ్మ
ఉద్విగ్నంగా సాగిన ఘట్టం
ఆఖరి రోజు కూడా తరలివచ్చిన భక్తులు
ముగిసిన మేడారం మహాజాతర
1.50 కోట్ల మంది దర్శించుకున్నట్లు ప్రకటన
సాక్షి ప్రతినిధి, వరంగల్: వెదురు కర్రలే దైవాలుగా.. గద్దెలే గర్భగుడులుగా.. లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న వనదేవతల వనప్రవేశం శనివారం ఆదివాసీ గిరిజన సంప్రదాయాల మధ్యన జరిగింది. వనదేవత.. మన దేవత.. జనదేవత అంటూ అపారవిశ్వాసంతో భక్తుల హృదయాలను ఏకం చేసిన సమ్మక్క–సారలమ్మ మళ్లీ వస్తా మంటూ వనానికేగారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం నుంచి మొక్కులు స్వీకరించిన తల్లులు వారిని మెచ్చి దీవెనలిచ్చి అశేష జనం వీడ్కోలుతో వనప్రవేశం చేశారు. దీంతో పసుపు–కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీర ముక్క–రైక బట్టలే సారెలు గా తల్లులకు సమర్పించే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం ముగిసింది. ఫిబ్రవరి 4న బుధవారం తిరుగువారం పండుగతో రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది.
ఆదివాసీ సంప్రదాయలతో...
పూజారులు ఆదివాసీ సంప్రదాయలతో వన దేవతలను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం కార్యక్రమం ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవతల వనప్రవేశం కార్యక్రమం శనివారం సాయంత్రం పూజలతో మొదలైంది. ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెపైకి చేరుకుని పూజలు చేశారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీరసారె, బంగారం, పసుపు కుంకుమను మేడారం ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు, గిరిజనేతర భక్తులు తీసుకున్నారు. ప్రసాదాన్ని (బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం అంతా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం మొదలైంది.
దేవతల వనప్రవేశం ఇలా..
శనివారం సాయంత్రం 5 గంటలకు దేవతల వనప్రవేశం ప్రక్రియ మొదలైంది. మొదట గోవిందరాజులును దబ్బగట్ల గోవర్ధన్, పెనక వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి సరిగ్గా రాత్రి 7.35 గంటలకు తరలించింది. ఏటూరునాగారం మండలం కొండాయికి అర్ధరాత్రి చేరుకున్నారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును 7.37 గంటలకు పెనక బుచ్చిరాములు నేతృత్యంలో పూజారుల బృందం మేడారం నుంచి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. మధ్యలో నిద్రచేసి ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు.
మేడారం గద్దెపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిíÙ్ఠంచిన మెంటె (వెదురుబుట్ట)ను 7.48 గంటలకు తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. అనంతరం 7.58 గంటలకు సమ్మక్కను గద్దె నుంచి పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దె వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించారు. అక్కడి నుంచి సమ్మక్కను చిలుకలగుట్టకు చేర్చారు. మహా జాతర సందర్భంగా 1.50 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ట్రాఫిక్జామ్తో ఇబ్బందులు..
శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మేడారం–తాడ్వాయి, మేడారం–గోవిందరావుపేట వయా నార్లాపూర్ రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు సుమారు 14 గంటలపాటు నిలిచిపోయాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్తోపాటు ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం సాయంత్రం వాహనాల్లో బయలుదేరిన భక్తులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఆలస్యంగా చేరుకున్న వారు దేవతల వనప్రవేశం తర్వాత సైతం మొక్కులు చెల్లించుకున్నారు.


