కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
అగ్ర రాజ్యానికి పూర్తిగా లొంగిపోయింది
వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో నిప్పులు
మోదీ సర్కారుకు కాస్తయినా సిగ్గుగా లేదా?
ఒప్పందాన్ని ఎలా సమరి్థంచుకుంటుంది?
ప్రధానిని అమెరికా మెడలు పట్టి వంచేసింది
ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ కేసు ఒత్తిళ్లకు లొంగారు
బీజేపీ ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేశారు
అందుకే అన్ని రంగాలనూ అప్పగించేశారు
మన రైతు ప్రయోజనాలూ పణంగా పెట్టారు
బడ్జెట్పై చర్చలో తూర్పారబట్టిన రాహుల్
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై మోదీ సర్కారును విపక్ష నేత రాహుల్గాంధీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఒప్పందం పేరిట మన తల్లి భరతమాతనే అమెరికాకు అమ్మేశారంటూ నిప్పులు చెరిగారు. ‘‘వ్యవసాయం, ఇంధనంతో సహా అన్ని రంగాలనూ అమెరికా చేతికి అప్పగించేశారు. ఆ దేశానికి పూర్తిస్థాయి లొంగిపోయారు. దేశాన్ని ఇలా అడ్డంగా అమ్మేసినందుకు మీకు కనీసం సిగ్గుగా అనిపించడం లేదా?’’అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
బుధవారం లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో రాహుల్ ప్రసంగించారు. అమెరికాతో ఏకపక్ష ఒప్పందాన్ని మోదీ సర్కారు ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. ‘‘పలు విషయాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా నేరుగా విపరీతమైన ఒత్తిడి పెట్టింది. పూర్తిగా ఆయన మెడలు వంచి నొక్కిపట్టింది. అందుకే దేశాన్ని మోదీ అమెరికాకు అమ్మేశారు.
కేవలం అధికారం కాపాడుకోవడానికి జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారు. లేదంటే ఇలాంటి ఏకపక్ష ఒప్పందానికి ఆయనే కాదు, ఏ భారత ప్రధానీ అంగీకరించబోడు’’అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యర్థి మెడను దొరకబుచ్చుకున్నాక దాన్ని గట్టిగా నొక్కిపడతారు. దాంతో అతను అల్లాడిపోతాడు. లొంగిపోయానంటూ చేతులెత్తేస్తాడు. మోదీ చేసింది సరిగ్గా అదే’’అంటూ ఎద్దేవా చేశారు. ‘‘వాణిజ్య ఒప్పందం ద్వారా మన రైతుల ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తిగా రాజీ పడింది. జౌళి రంగాన్ని నేలమట్టం చేశారు.
మన డేటాను, రైతులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, మన శక్తియుక్తులను, చిన్న, మధ్యతరహా వ్యాపారాలనూ అమ్మేశారు. ఇంధన భద్రతను గాలికొదిలేశారు. ఇకపై మనం ఎవరి నుంచి చమురు కొనుగోలు చేయాలో నిర్ణయించేది అమెరికాయే తప్ప మన ప్రధాని కాదు! పైగా ఆ కొనుగోళ్లను అగ్ర రాజ్యమే నిత్యం పర్యవేక్షిస్తుంటుంది. వారు చెప్పిన వాళ్ల దగ్గర కొనకపోతే మనపై మళ్లీ 50 శాతం టారిఫ్లు బాదుతారు. మన ఆర్థిక, ఇంధన రంగాలను మనపైకే ఆయుధాలుగా గురి పెట్టేందుకు అమెరికాను కేంద్రం అనుమతించింది’’అంటూ నిప్పులు చెరిగారు.
బీజేపీ ప్రయోజనాల కోసమే...
వాణిజ్య ఒప్పందం పేరుతో మోదీ సర్కారు అమెరికాకు దాసోహమన్న తీరు చాలా విషాదకరమని రాహుల్ అన్నారు. ‘‘మోదీ కేవలం తాను మాత్రమే లొంగిపోలేదు. 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తునే అమెరికాకు అప్పగించేశారు. అధికార బీజేపీ ఆర్థిక ఆయువుపట్లలో ఒకరిపై అమెరికాలో కేసు నడుస్తుండటమే ఇందుకు కారణం. సొంత పార్టీ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికే దేశాన్ని అగ్ర రాజ్యానికి మోదీ అమ్మకం పెట్టారు’’అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘డిజిటల్ వాణిజ్య నిబంధనలపై నియంత్రణను కేంద్రం పూర్తిగా అమెరికాకు వదిలేసుకుంది. డేటా లోకలైజేషన్ను తొలగించేసింది. అమెరికా నుంచి డేటా వరదకు గేట్లెత్తేందుకు ఒప్పుకుంది. బడా టెక్ కంపెనీలకు 20 ఏళ్ల ట్యాక్స్ హాలిడేలు ప్రకటించేసింది. మొదట్లో మనపై కేవలం 3 శాతంగా ఉండే అమెరికా టారిఫ్లు ఇప్పుడు 18 శాతానికి పెరిగాయి. అమెరికా వస్తూత్పత్తులపై భారత టారిఫ్లు మాత్రం 16 శాతం నుంచి ఎకాయెకి సున్నాకు పడిపోయాయి.
అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 146 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి’’అంటూ రాహుల్ మండిపడ్డారు. ‘‘కేంద్రం మన వ్యవసాయ రంగాన్ని అమెరికాకు బార్లా తెరిచేసింది. దాంతో అక్కడి వ్యవసాయోత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా మన రైతులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మోదీకి ముందు ఏ ప్రధానీ ఇలాంటి సిగ్గుచేటైన పని చేయలేదు. ఇకముందు మరే ప్రధానీ చేయబోడు’’అన్నారు. అధికార పక్ష సభ్యులు పదేపదే లేచి రాహుల్ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆయన నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చేతనైతే వాటికి రుజువులు చూపాలని సవాలు చేయగా అందుకు తాను సిద్ధమేనని రాహుల్ బదులిచ్చారు.
మేమైతే ఇలా చేసేవాళ్లం
‘‘యుద్ధాల శకం ముగిసిందని మోదీ అంటున్నారు. కానీ నిజానికి మనమున్నదే యుద్ధాల శకంలో! ఇలాంటప్పుడు మన బలాలేమిటో అవగాహన ఉండాలి. ప్రజలే మన నిజమైన బలం’’అని రాహుల్ అన్నారు. ‘‘ఇండియా కూటమే గనుక అధికారంలో ఉంటే వాణిజ్య ఒప్పందం విషయంలో పూర్తిగా భిన్నంగా వ్యవహరించేది. డేటా మన అతి పెద్ద ఆస్తి.
అది అమెరికాకు అందుబాటు ఉండాలంటే భారత్ను అమెరికా సేవకునిలా గాక సమాన భాగస్వామిగా పరిగణించాలని ట్రంప్కు కుండబద్దలు కొట్టేవాళ్లం. ఆ హోదాలోనే చర్చలు జరిపేవాళ్లం. దేశ ఇంధన భద్రతపై, మన రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని, వాటిపై చర్చలకు తావు లేదని ఆయన ముఖం మీదే చెప్పేవాళ్లం. పాక్ ఆర్మీ చీఫ్తో ట్రంప్ అల్పాహార భేటీ వంటి ఉదంతాలపై కచి్చతంగా అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్లం’’అని చెప్పుకొచ్చారు.
ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ, పురీ
అమెరికాతో పాటు పలు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం టేపుల్లో కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.


