మహాశివరాత్రి.. కోట్లాది మంది భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ పవిత్ర సమయంలో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, మహా శివునికి అభిషేకాలు చేస్తారు. జాగరణ చేస్తూ ఆ పరమశివుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. ఆధ్యాత్మిక రాజధాని కాశీలో విశ్వేశ్వరునికి గంగాజలం, బిల్వపత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తారు.

హిమాచల్ ప్రదేశ్లోని మండిలో జరిగే ‘శివరాత్రి మేళా’లో దేవతలు పల్లకీల్లో భూత్ నాథ్ ఆలయానికి తరలిరావడం ఒక అద్భుత ఘట్టం. ఇక కశ్మీరీ పండిట్లు ‘హేరత్’ పేరుతో శివరాత్రిని పండుగను జరుపుకుంటారు, అక్కడ నిర్వహించే ‘వటుక్ పూజ’ ప్రత్యేక వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కర్ణాటకలోని జోగ్ ఫాల్స్ వద్ద ‘వీరగాసె’ నృత్య ప్రదర్శనలు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో 14 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణ భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తాయి.
శివారాధన కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేపాల్లోని ప్రసిద్ధ పశుపతినాథ్ దేవాలయం వేలాది సాధువుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. మారిషస్లో హిందూ భక్తులు ‘గంగా తలావ్’ అనే పవిత్ర సరస్సు వరకు పాదయాత్ర చేస్తారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ‘మెలుకత్’ అనే ఆత్మశుద్ధి ప్రక్రియ ద్వారా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ధ్యానముద్రలో శివరాత్రిని గడుపుతారు. కరీబియన్ దేశమైన ట్రినిడాడ్, టొబాగోలో కూడా భారతీయ సంతతి వారు రాత్రంతా శివ నామస్మరణతో ఆలయాల్లో జాగరణ చేస్తారు.


