రూ.3.6 లక్షల కోట్లతో సమీకరణ ప్రతిపాదనకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం
నేరుగా ఫ్రాన్స్ నుంచి ఎగిరిరానున్న 18 విమానాలు
మిగతావి భారత్లో దేశీయంగా తయారీ
దేశీయ రక్షణ రంగ అభివృద్ధికి ఊతం
వివరాలు వెల్లడించిన రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: అధునాతన యుద్ధ విమానాలతో దేశ సరిహద్దులను, గగనతలాలను శత్రు దుర్భేద్యంగా చేసే లక్ష్యంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ అదనంగా 114 రఫేల్ ఫైటర్జెట్లను కొనుగోలుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.3.6 లక్షల కోట్లతో రూపొందించిన కొనుగోలు ప్రతిపాదనలను గురువారం రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోని రక్షణ శాఖ మంత్రి పరిధిలోని ‘రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ)’ఆమోదముద్ర వేసింది.
ఈ ప్రాజెక్ట్లో భాగంగా 18 యుద్ధ విమానాలను ఫ్రాన్స్లోనే తయారుచేసి భారత్కు సరఫరాచేయనున్నారు. మిగతా 96 విమానాలను భారత్లో తయారుచేయనున్నారు. వీటిల్లో సగానికిపైగా విమానాలను దశలవారీగా దేశీయంగా తయారుచేసిన విడిభాగాలతో రూపొందించనున్నారు. ఇందుకోసం దేశీయంగా అనుబంధ కర్మాగారాలను నెలకొల్పడంతో దేశీయ రక్షణరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందనుంది. రఫేల్ విమానాలతో పాటు అత్యంత ఎత్తులో తిరిగే సూడో శాటిలైట్(ఏఎస్–హెచ్ఏపీఎస్)లనూ కొనుగోలుచేయనున్నారు.
సూడో శాటిలైట్లు సౌరఫలకాలతో పనిచేస్తూ నిఘా, పర్యవేక్షణ, కమ్యూనికేషన్ సేవలను అందిస్తాయి. మరో నాలుగురోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన మొదలుకానున్న వేళ ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్తో ఒప్పందం కుదరబోతుండటం విశేషం. దసాల్ట్ సంస్థలో దాదాపు 10 నెలలపాటు విస్తృతస్థాయిలో చర్చలు జరిపాక ఈ ఏడాది చివరిలోపు సమగ్రస్థాయిలో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. విమానాలతోపాటు వాటిలోని విడిభాగాల తయారీకి సంబంధించిన సాంకేతికత బదిలీ వంటి అంశాలపై కూలంకషంగా చర్చిం చాల్సి ఉంది.
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్) ఆమోదం పొందాల్సి ఉంది. ‘‘అదనపు విమానాలతో భారతవాయుసేన.. సరిహద్దుల వంటి ఉద్రిక్త ప్రాంతాల్లో దాడి సామర్థ్యాలు ద్విగుణీకృతమవుతాయి. వీటితోపాటు కొనే శక్తివంత క్షిపణులు సుదూరాల్లోని శత్రు స్థావరాలపై అత్యంత కచి్చతత్వంతో దాడిచేసే సత్తాను పెంచుతాయి. ఒక సూడో ఉపగ్రహాలు అనేవి 30 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటో ఆవరణలో చక్కర్లు కొడుతూ శత్రు స్థావరాలపై నిఘా, పర్యవేక్షణ, ఎలక్ట్రిక్ ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ సేవలను అందిస్తాయి’’అని రక్షణ శాఖ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆనాడు రూ.1.63 లక్షల కోట్లతో మొదలై..
2015లో మోదీ ప్రభుత్వం భారత వాయుసేనలోని స్క్వాడ్రాన్ల సంఖ్య తగ్గిపోతోందని, వీటిని అత్యాధునిక యుద్ధవిమానాలతో భర్తీచేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు భారత్కు 36 రఫేల్ విమానాలను సరఫరాచేసింది. ఇవి ప్రస్తుతం భారత వాయుసేన స్క్వాడ్రాన్లో సేవలందిస్తున్నాయి. గతంలోనూ 114 బహుళ ప్రయోజనకర యుద్ధ విమానాలు(ఎంఆర్ఎఫ్ఏ)లు తమకు అవసరమని భావించి వాయుసేన రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(టెండర్)ను జారీచేసింది.
అప్పట్లో అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల కొనుగోలు ఒప్పంద ప్రతిపాదనల్లో ఒకటిగా రికార్డ్కెక్కింది. ఈ ప్రాజెక్ట్ను దక్కించుకునేందుకు దసాల్ట్ ఏవియేషన్తోపాటు అమెరికాకు చెందిన లాక్హీల్డ్ మార్టిన్, బోయింగ్, యూరోఫైటర్ కంపెనీలు పోటీపడ్డాయి. భారత్కు రఫేల్ విమానాలు విక్రయించేందుకు దసాల్ట్, ఎఫ్–21లను అమ్మేందుకు లాక్హీల్డ్మారి్టన్, టైఫNన్ జెట్లను విక్రయించేందుకు యూరోఫైటర్ సంస్థలు ఆసక్తి చూపించాయి. గరిష్టంగా 42 స్క్వాడ్రాన్లకు అనుమతి ఉండగా 31 స్క్వాడ్రాన్లను కొనుగోలుచేయాలని రక్షణశాఖ భావించింది.
సైన్యం, నేవీ కోసమూ కొనుగోళ్లు..
భారత సైన్యం కోసం దేశీయంగా తయారైన వైభవ్ ట్యాంక్ విధ్వంసక మందుపాతరలు, యుద్ధట్యాంక్లను తరలించే ఆర్మార్డ్ రికవరీ వెహికల్(ఏఆర్వీ), ఉభయచర ఫైటింగ్ వెహికల్(బీఎంపీ–2), టీ–72 ట్యాంక్లనూ కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకూ ‘రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ)’ఆమోదముద్ర వేసింది. భారతనావికాదళం కోసం పీ8ఐ రకం నిఘా, పర్యవేక్షణ విమానంతోపాటు దేశీయంగా తయారుచేసే నాలుగు ఎండబ్ల్యూ మెరైన్ గ్యాస్ టర్బైన్తో పనిచేసే ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ల కొనుగోలు ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపారు.


