రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పనితీరుపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెరా సంస్థలు కేవలం బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, కొనుగోలుదారుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయని ధర్మాసనం ఘాటుగా విమర్శించింది.
ఏమిటీ వివాదం?
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర రెరా కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ నోటిఫికేషన్పై స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయిమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ధర్మాసనం ప్రధాన వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ రెరా పనితీరును తప్పుబడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రెరాను ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి. డిఫాల్ట్ అయిన బిల్డర్లకు సహకరించడం తప్ప, ఈ సంస్థల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఇలాంటి సంస్థలను కొనసాగించడం కంటే రద్దు చేయడమే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్డర్ల పట్ల ఈ సంస్థలు చూపిస్తున్న సానుకూల ధోరణిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పు అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని పేర్కొంటూ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కోర్టు ఆదేశాలు
రెరా కార్యాలయాన్ని, అప్పీలేట్ ట్రిబ్యునల్ను సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ అప్పీలేట్ బాడీని కూడా ధర్మశాలకే తరలించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయం తరలింపుపై ఉన్న స్టేను కూడా కోర్టు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. కాగా, గతేడాది జూన్ 13న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న రెరా సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!


