న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేనివారు ఉచిత న్యాయ సహాయం పొందొచ్చు
సాక్షి, అమరావతి: నిందితుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ నిమిత్తం క్రిమినల్ కేసులను విచారించే దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సొంతగా న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేని నిందితులకు లీగల్ ఎయిడ్ కింద ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని నిందితులకు తప్పనిసరిగా తెలియజేయాలని దిగువ కోర్టులను ఆదేశించింది. సాక్షుల విచారణ ప్రారంభం కావడానికి ముందే నిందితులకు న్యాయ సహాయం గురించి చెప్పాలంది.
ఇందుకు నిందితులు ఏం చెప్పారు? న్యాయ సహాయానికి అంగీకరించారా?, న్యాయ సహాయం పొందేందుకు అంగీకరిస్తే అందుకు తీసుకున్న చర్యలు ఏమిటనే విషయాలను రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. అలా రికార్డ్ చేసిన వివరాలను సాక్షుల విచారణ మొదలు కావడానికి ముందే కోర్టు ఉత్తర్వుల్లో పొందుపరచాలని స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలను అన్ని కింది కోర్టులు కచ్చితంగా పాటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వుల నేపథ్యం ఇదీ..
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న రెజీనామేరీ చెల్లమణికి మద్రాస్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. తన తరఫున వాదించేందుకు న్యాయవాది లేకపోవడంతో విచారణ ప్రారంభ దశలో సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేకపోయిన విషయాన్ని నిందితురాలు గుర్తించింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సాక్షులను తిరిగి విచారించాలని పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు అనుమతించిన తర్వాతే.. ఆమెకు సాక్షులను ప్రశ్నించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సొంతగా న్యాయవాదులను నియమించుకునే స్థోమత లేని నిందితులకు, తమ తరఫున వాదించుకోవడానికి న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉందన్న విషయాన్ని వారికి కింది కోర్టులు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది.


