ఏడాదిలో 4000 కోట్ల స్పామ్‌ కాల్స్‌! | Truecaller Report 2025 Indians bombarded 4000 cr spam calls last year | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 4000 కోట్ల స్పామ్‌ కాల్స్‌!

Feb 12 2026 2:24 PM | Updated on Feb 12 2026 2:45 PM

Truecaller Report 2025 Indians bombarded 4000 cr spam calls last year

భారత్‌ డిజిటల్ విప్లవం దిశగా దూసుకుపోతున్న వేళ స్పామ్ కాల్స్, సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. 2025 సంవత్సరంలో భారతీయులకు ఏకంగా 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ వచ్చినట్లు ‘ట్రూకాలర్ ఇండియా ఇన్‌సైట్స్‌ రిపోర్ట్ 2025’ కొన్ని విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. వికసిత్ భారత్ విజన్‌లో భాగంగా దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై నమ్మకం చాలా కీలకమన్నారు. ‘ఈ రోజుల్లో మోసం అనేది కేవలం సాంకేతిక సమస్య కాదు, అది మానవ బలహీనతలతో ఆడుకునే ప్రక్రియ. భయం, అత్యవసరం, అనిశ్చితిని పెట్టుబడిగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. ప్రతి భారతీయుడికి డిజిటల్‌ భద్రత కల్పించాలన్నదే మా లక్ష్యం’ అన్నారు.

నివేదిక ప్రకారం, గడిచిన ఏడాదిలో నమోదైన స్పామ్ కాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:

మొత్తం స్పామ్ కాల్స్: 4,168 కోట్లు.

బ్లాక్ చేసిన కాల్స్: 1,189 కోట్లు (యూజర్లకు చేరకముందే సాంకేతికతతో నిరోధించినవి).

మోసపూరిత కాల్స్: సుమారు 770 కోట్లు. ఇవి ప్రధానంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల పేరుతో వచ్చాయి.

స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు: ఏడాది పొడవునా 12,903 కోట్ల స్పామ్ సందేశాలు నమోదయ్యాయి.

స్పామ్ కాల్స్ నిరోధించడం వల్ల కేవలం మోసాలు తగ్గడమే కాకుండా ప్రజల విలువైన సమయం కూడా ఆదా అవుతోంది. కమ్యూనిటీ రిపోర్టింగ్ ద్వారా భారతీయులకు రోజుకు సుమారు 21.7 లక్షల గంటల సమయం ఆదా అవుతోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల అనవసరపు ఒత్తిడి తగ్గడమే కాకుండా హడావుడిలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.

2026లో పొంచి ఉన్న ముప్పు

రాబోయే రోజుల్లో మోసగాళ్లు మరింత అధునాతన పద్ధతులను అవలంబిస్తారని నివేదిక హెచ్చరించింది. అందులో ఏఐ సృష్టించిన వాయిస్ స్కామ్స్, కాల్స్, మెసేజ్‌లతో చేసే మోసాలు ఉండనున్నాయి. ఇతరుల పేర్లతో డిజిటల్ ఐడెంటిటీని దొంగిలించడం వంటి మోసాలు ఎక్కువగా జరగవచ్చని అంచనా.

జాగ్రత్తలు

అత్యవసరమని వచ్చే కాల్స్‌ను వెంటనే నమ్మకుండా ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. నమ్మకమైన కాలర్ ఐడీ సాధనాలను ఉపయోగించాలి. డిజిటల్ సాధికారత సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటమే అసలైన రక్షణ అని గుర్తించాలి.

ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement