హోం మంత్రి అమిత్ షా విమర్శ
బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్
గాంధీనగర్: అమెరికా, యూకే, ఈయూతో వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తీవ్రంగా ఖండించారు. రాహుల్ రైతులను తప్పుదోవ పట్టించడంతో పాటు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చా వేదికను ఆయనే నిర్ణయించుకోవచ్చన్నారు.
మన రైతులు, డెయిరీ ఉత్ప త్తులకు కేంద్రం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ‘‘వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు హాని చేస్తాయన్న కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదం. ప్రజలను తప్పుదోవపట్టించడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు. నిజానికి యూపీఏ హయాంలో కుదుర్చుకున్న పలు ఒప్పందాలు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాటిలోని ప్రమాదకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం రాగానే తొలగించింది’’ అని అమిత్ షా చెప్పారు.


