మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా | 20 lakh exgratia to families of Samarlakota firework explosion victims | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా

Mar 1 2026 4:45 AM | Updated on Mar 1 2026 4:45 AM

20 lakh exgratia to families of Samarlakota firework explosion victims

సామర్లకోట, కాకినాడలో క్షతగాత్రులకు సీఎం చంద్రబాబు పరామర్శ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్లకోట సీహెచ్‌సీ, కాకినాడ జీజీహెచ్‌లో పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాకినాడ జీజీహెచ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బాణసంచా పేలుడు ఘటన చాలా దురదృష్టకరం. 

హృదయ విదారక ఘటన. ఇప్పటి వరకు 20 మంది చనిపోగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరికి ప్రమాదం తప్పింది’ అని చెప్పారు. 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు బాధితుల్లో ఉన్నారన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

అధికారుల సస్పెన్షన్‌ 
పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజుతోపాటు జిల్లా కార్మిక అధికారి, జిల్లా అగ్నిమాపక అధికారులను సస్పెండ్‌ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు విచ్చలవిడితనానికి అల­వాటు పడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, వారిని అరెస్ట్‌ చేయడమే కాకుండా ప్రాసిక్యూషన్‌ చేస్తామన్నారు. వాళ్ల ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అప్పగిస్తామని వెల్లడించారు. 

ప్రభుత్వ పరంగా ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం చేస్తామని, కేంద్రం రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించిందన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ఆదుకుంటామని, చిన్న పిల్లలుండి, చదువుకునే వారికి రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివిస్తామని, ఇళ్లు లేని వారికి ఇళ్లు నిరి్మస్తామని చెప్పారు. ఎక్స్‌ప్లోజివ్‌ మెటీరియల్‌ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. బాణసంచా కేంద్రాలకు అనుమతులు కఠినతరం చేస్తామని చెప్పారు. 

క్షతగాత్రులకు వైఎస్సార్‌సీపీ పరామర్శ 
సంఘటన స్థలాన్ని వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు, నేతలు సందర్శించారు. సామర్లకోట, కాకినాడ జీజీహెచ్‌లలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement