రైస్మిల్ యజమాని భార్య ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా: వ్యాపారంలో నష్టం, పెరిగిన అప్పులు, బ్యాంకర్ల వేధింపులతో ఓ రైస్మిల్ యజమాని భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తణుకు సురేశ్, స్వప్న (42) దంపతులకు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్మిల్లు ఉంది. 2021–2022లో కస్టం మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వీరి రైస్మిల్లుకు ధాన్యం కేటాయించింది.
అయితే అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. అలాగే వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. దీంతో బకాయిలు చెల్లించాలని వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుల బాధతో మనస్తాపం చెందిన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లో బాత్రూములోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లుండగా పెద్దకూతురు వివాహం చేశారు. చిన్నకూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సురేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.


