ప్రేమకు దారితీసిన మేడారం జాతరలో పరిచయం
యువతిని పెళ్లి చేసుకున్న ట్రాఫిక్ హోంగార్డు
రక్షణ కల్పించాంటూ పోలీసుల వద్దకు వాసుదేవరావు
హైదరాబాద్: ఇటీవల జరిగిన మేడారం జాతరకు విధులపై వెళ్లిన ముగ్గురు పిల్లలున్న ట్రాఫిక్ హోం గార్డు అక్కడ ఓ యువతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడమే కాకుండా రక్షణ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివీ... శ్రీకాకుళంకు చెందిన పొంగూరు వాసుదేవరావు(38) అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు ఇదివరకే వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లను తీసుకొని భార్య ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లింది. ఏడేళ్ల కొడుకుతో వాసుదేవరావు జగద్గిరిగుట్టలో అద్దెకుంటూ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు.
మేడారం జాతరకు విధులపై వెళ్లాడు. అక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని తన తల్లి కనిపించడం లేదంటూ వాసుదేవరావు కూర్చున్న ట్రాఫిక్ బూత్ను ఆశ్రయించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగగా గంట వ్యవధిలోనే ఆమె తల్లిని కనుగొని అప్పగించాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత తరచూ ఇద్దరూ కలుసుకునే వారు. గత నెల 25వ తేదీన వాసుదేవరావు ప్రేమించిన యువతి(25)ను అమీర్పేట్లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మొదటి భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు.
తరచూ తన కూతురు బయటికి వెళ్తుండటాన్ని గమనించిన యువతి తండ్రి ఆరా తీయగా వాసుదేవరావును ఆమె పెళ్లి చేసుకున్నట్లుగా తేలింది. ఈ విషయంలోనే తమకు రక్షణ కావాలంటూ తాను వివాహం చేసుకున్న యువతిని తీసుకొని వాసుదేవరావు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటన వివరాలు ఆరా తీసి విచారణ చేపట్టి ఆ యువతి మేజర్ కావడంతో హోంగార్డుతో పంపించారు. ఈ విషయంపై మొదటి భార్య నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


