టికెట్‌ స్కాన్‌ చేస్తేనే ఎంట్రీ | South Central Railway has launched QR code ticket scanners at Secunderabad station | Sakshi
Sakshi News home page

టికెట్‌ స్కాన్‌ చేస్తేనే ఎంట్రీ

Mar 7 2026 5:36 AM | Updated on Mar 7 2026 5:36 AM

South Central Railway has launched QR code ticket scanners at Secunderabad station

నిర్మాణంలో ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

మెట్రో స్టేషన్‌లలో ఉన్న తరహా విధానం

సెక్యూరిటీ చెకింగ్, లగేజీ స్కానింగ్‌ తప్పనిసరి 

సికింద్రాబాద్‌  రైల్వే స్టేషన్‌లో ఏర్పాటుకు కసరత్తు 

టికెట్‌ లేనివారు, ప్రయాణికులు కానివారికి దుర్భేద్యమే

సాక్షి, హైదరాబాద్‌: రైలు టికెట్‌ను క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేస్తేనే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించగలుగుతారు. మెట్రో రైల్‌ స్టేషన్‌లలో ఉన్న తరహా విధానం త్వరలో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇదే కాదు, విమాన ప్రయాణికుల లగేజీ చెకింగ్, సెక్యూరిటీ చెకింగ్‌ తరహాలో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కూడా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధిలో భాగంగా హై సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు కాబోతోంది.

రాత్రి కాగానే కొందరు నిరాశ్రయులు, ఆగంతకులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి అక్కడ ప్రయాణికులు కూర్చునే బెంచీలపై నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ, వారిని అడ్డుకునేవారుండరు. ఇక అలాంటి వారు స్టేషన్‌లోకి ప్రవేశించలేరు. చివరకు సెక్యూరిటీ చెకింగ్‌ లేకుండా స్వయంగా ప్రయాణికులు కూడా స్టేషన్‌లోకి వెళ్లడం సాధ్యం కాదు. అలాంటి దుర్భేద్య వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించారు.  

వచ్చే నెలలో అందుబాటులోకి పదో నంబరు ప్లాట్‌ఫామ్‌ 
ప్రస్తుతం సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నా యి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అతి కీలక ఎయిర్‌ కాంకోర్స్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరాంతానికి పూర్తిస్థాయిలో అది సిద్ధం కానుంది. ఈలోపు, పదో నంబరు ప్లాట్‌ఫామ్‌ వైపు పనులు దాదాపు ముగిసినందున, వచ్చే నెల నుంచి అక్కడి వసతులను ప్రయాణి కుల వినియోగంలోకి తేనున్నారు. భద్రత వ్యవస్థ మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాకే ప్రారంభం కానుంది. పదేళ్ల క్రితం దేశంలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో, సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బ్యాగేజీ స్కానింగ్‌ వ్యవస్థ ప్రారంభించారు.

కానీ, నిత్యం లక్షన్నర మంది ప్రయాణికులు వచ్చే చోట ఒకటి చొప్పున రెండు వైపులా రెండు చెకింగ్‌ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో ప్రయాణికుల సామర్థ్యాన్ని అది తట్టుకోలేకపోయింది. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే వాటిని మూసేశారు. ఇప్పుడు స్టేషన్‌లోకి ఎలాంటి చెకింగ్‌ లేకుండా ఎవరైనా వెళ్లొచ్చు. రీడెవలప్‌మెంట్‌ పనుల్లో భాగంగా ప్రస్తుతం రూ.740 కోట్ల వ్యయంతో పూర్తిగా ఆధునీకరిస్తున్నందున, విమానాశ్రయ తరహా హంగులద్దుతున్నారు. ప్రయాణికులు, వారి సంబం«దీకులు కలిపి నిత్యం లక్షల మంది స్టేషన్‌కు వస్తున్నారు. దీంతో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్, అటు పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ఉండే రెండు ప్రవేశ మార్గాల్లో దాదాపు ఆరు వరకు భద్రత తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.

ఎలా ఉండబోతోంది?
ప్రయాణికులు ముందుగా లగేజీ స్కానింగ్‌ చేయించుకోవాలి. వెంట తెచ్చే ప్రతి బ్యాగును ఎక్స్‌రే స్కానింగ్‌ చేస్తారు. ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ వేస్తారా? లేదా? అన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. చెక్‌ చేసిన తర్వాతనే లగేజీని లోనికి అనుమతిస్తారు. గంట వ్యవధిలో 30 వేల మంది వచ్చినా సరిపోయే సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.  
ప్రయాణికులకు సెక్యూరిటీ చెకింగ్‌ తప్పనిసరి. లోనికి ప్రవేశించేముందే భద్రత సిబ్బంది స్కానర్ల సాయంతో ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతారు.  

లోనికి ప్రవేశించేముందు క్యూఆర్‌ కోడ్‌ సాయంతో ఆన్‌లైన్‌ టికెట్, ప్రత్యక్ష టికెట్‌లను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల టికెట్‌ లేని వారిని నిరోధించేందుకు వీలవుతుంది. ప్రయాణికుల వెంట వచ్చే సంబం«దీకులు ఇక కచ్చితంగా ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ కొనాల్సిందే.  
పునరాభివృద్ధి తర్వాత భారీ భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నందున, సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచనున్నారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు, ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందిని అదనంగా రిక్రూట్‌ చేసుకోనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement