బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన
కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలపై ఉద్యమ కార్యాచరణ
వచ్చే నెల 14న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు ప్లాన్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు వర్క్షాప్నకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 10న హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్, అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాం తదితరులను వక్తలుగా ఆహ్వానించినట్టు తెలిసింది.
ఈ వర్క్షాప్నకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ నిర్వహణ తీరుతెన్నులు, సభా నియమావళితోపాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటిని శాసనసభ సమావేశాల్లో లేవనెత్తాల్సిన తీరు తదితరాలపై నిపుణులు సూచనలు, సలహాలతోపాటు అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాతి దశల్లో కింది స్థాయి నాయకులు, క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది.
‘అంబేడ్కర్ విగ్రహం’పై ఉద్యమం
మూసీ సుందరీకరణ పేరిట భారీ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేసిన భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడంపై ఉద్యమించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 10న ప్రారంభించే ‘అంబేడ్కర్ విగ్రహం’ఉద్యమ కార్యక్రమాన్ని వచ్చే నెల 14న జరిగే అంబేడ్కర్ జయంతి నాటికి తీవ్ర స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహ ప్రాంగణాన్ని మూసివేసి సందర్శకులకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
గ్రామ, మండల, జిల్లా స్థాయి మొదలుకొని దశలవారీగా అవసరమైతే ఢిల్లీ స్థాయికి ఉద్యమం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సాగర హారం తరహాలో ఏప్రిల్ 14న హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ ఆంక్షల నుంచి విముక్తి కల్పించాలనే డిమాండ్తో హుస్సేన్సాగర్ చుట్టూ మానవహారం నిర్వహించే యోచనలో ఉంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగతోపాటు వివిధ దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ నేతలు భేటీ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆంక్షలు విధించడంపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.
‘గ్రేటర్’లో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు
గ్రేటర్ హైదరాబాద్తోపాటు కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్లకు మరో రెండు నెలల్లోపే ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోన్న బీఆర్ఎస్ ఆ లోపే పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని భావిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే గ్రేటర్లో ఇఫ్తార్ విందులు, ఇతర పారీ్టల నుంచి నేతల చేరికలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


