సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల టాప్ ర్యాంకర్గా శ్రీజశ్వంత్చంద్ర
55వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన సృజన
జోధ్పూర్ ఎంబీబీఎస్ వైద్యుడు అనూజ్ అగ్నిహోత్రికి ఫస్ట్ ర్యాంక్
చెన్నైకి చెందిన రాజేశ్వరి సువేకు రెండో ర్యాంక్..
ఢిల్లీవాసి ఆకాన్ష్ ధుల్కు మూడో ర్యాంక్
సివిల్స్–2025 తుది ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: సివిల్స్–2025 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏపీలోని కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్చంద్ర ఆలిండియా 23వ ర్యాంక్ సాధించగా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. తెలంగాణకు చెందిన 20 మందికి వెయ్యిలోపు ర్యాంకులు లభించాయి.
ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తోపాటు కేంద్ర ప్రభుత్వ సర్విసుల్లో 1,087 పోస్టులు ఖాళీగా ఉండగా తుది ఫలితాల్లో 659 మంది పురుషులను, 299 మంది మహిళలను కలిపి మొత్తంగా 958 మందిని సివిల్స్ విజేతలుగా యూపీఎస్సీ ప్రకటించింది. టాప్ 25 ర్యాంకులు సాధించిన వారిలో 14 మంది పురుషులు ఉండగా 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అర్హుల్లో 317 మంది జనరల్ కేటగిరీ వారుకాగా 306 మంది ఓబీసీలు, 158 మంది ఎస్సీలు, 73 మంది ఎస్టీలు, ఉన్నారు.
అలాగే ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) విభాగం నుంచి 104 మంది ఈ జాబితాలో స్థానం సంపాదించారు. అలాగే ఐఏఎస్కు 180 మంది, ఐపీఎస్కు 150 మంది, ఐఎఫ్ఎస్కు 55 మంది, కేంద్ర సర్విసుల (గ్రూప్–ఏ)కు 507 మంది, గ్రూప్–బీ సర్విసులకు 195 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ను 5,76,793 మంది రాయగా 14,161 మంది మెయిన్స్కు ఎంపికయ్యారు. వారిలో 2,736 మంది మాత్రమే ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు.]

గతేడాదికన్నా సంఖ్య తగ్గింది
సివిల్స్–2025 ఫలితాల్లో ఏపీ, తెలంగాణ అభ్యర్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. గతేడాది రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు సన్నద్ధత వల్ల అభ్యర్థులు సివిల్స్పై ఎక్కువ దృష్టి సారించలేకపోయారు. విజేతల్లో ఎ క్కువ శాతం మంది ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారు, సివిల్స్ రీ–అటెంప్ట్ చేసిన వారే ఉన్నారు. తొలిసారి పరీక్ష రాసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
అనూజ్ అగ్నిహోత్రి టాపర్
రాజస్తాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయి టాపర్గా నిలిచాడు. అనూజ్ ఎయిమ్స్ జో«ద్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తొలి ప్రయత్నంలో ఢిల్లీ, అండమాన్–నికోబార్ దీవుల సివిల్ సర్వీసు (డీఏఎన్ఐసీఎస్)లకు ఎంపికై ప్రస్తుతం శిక్షణలో ఉన్న అతను తాజాగా మూడో ప్రయత్నంలో ఆలిండియా టాపర్గా సివిల్స్కు ఎంపికయ్యాడు. చెన్నైకి చెందిన రాజేశ్వరి సువే తన రెండో ర్యాంకు సాధించారు.
అన్నా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన ఆమె ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ కామర్స్ గ్రాడ్యుయేట్ ఆకాన్‡్ష ధుల్ మూడో ర్యాంక్ పొందారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ భార్గవ్ ఝన్ఝన్వాలా నాలుగో ర్యాంకు సాధించగా ఢిల్లీ లా యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) చేసిన ఇషాన్ భటా్నగర్ ఐదో ర్యాంకు పొందారు.
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నందుకే ఈ ఫలితం: అనూజ్
సివిల్స్ ఫలితాల విడుదల అనంతరం అనుజ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ విజయం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోంది. గత రెండు ప్రయత్నాల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని అంకిత భావంతో సన్నద్ధం కావడం వల్లే ఈ ఫలితం లభించింది’అని పేర్కొన్నాడు. మరోవైపు ఆలిండియా టాపర్గా నిలిచిన అనుజ్ అగ్నిహోత్రికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, లోక్సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా అభినందనలు తెలిపారు.
ఐపీఎస్ టు ఐఏఎస్..
23వ ర్యాంక్ సాధించిన కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్ చంద్ర ఐఐటీ కాన్పూర్లో బీటెక్ చేశారు. 2018లో బెంగళూరులో శామ్శాంగ్ సంస్థలో మూడేళ్లపాటు ఉద్యోగం చేశారు. సివిల్స్ కోసం ఉద్యోగానికి స్వస్తిపలికి 2020లో తొలి ప్రయత్నంలో ర్యాంక్ రాకపోయినా మరో ప్రయత్నంగా 2021లో రాసి 314వ ర్యాంక్ సాధించి పోస్టల్ శాఖలో ఉద్యోగం పొందారు. 2022లో మరోసారి సివిల్స్ రాసి ఐఆర్ఎంఎస్తోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్విసులోనూ కొలువు సాధించారు.
2023లో సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 162వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఏపీ కేడర్కు ఎంపికయ్యారు. అప్పటి నుంచీ హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతూనే ఐఏఎస్ కోసం 2024లో మళ్లీ పరీక్ష రాశారు. 390వ ర్యాంక్ రావడం, లక్ష్యం నెరవేరకపోవడవంతో మరింత సాధన చేసి 2025లో మరోసారి పరీక్ష రాసి 23వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. శ్రీజశ్వంత్ చంద్ర తండ్రి మాణిక్యాలరావు కుటుంబం పిఠాపురం నుంచి జగ్గంపేట వెళ్లి స్థిరపడింది. తల్లి వరలక్ష్మి ఉపాధ్యాయిని.
సింగరేణి కార్మీకుడి కుమార్తెకు 55వ ర్యాంకు
సివిల్స్ ఫలితాల్లో సింగరేణి కార్మీకుడి కుమార్తె జాతీయ స్థాయిలో 55వ ర్యాంకుతో సత్తా చాటింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నారు గ్రామానికి చెందిన గుడెల్లి రాజేశం–రాణి దంపుతుల కుమార్తె గుడెల్లి సృజన ఆరో ప్రయత్నంలో విజయం సాధించింది. తండ్రి రాజేశం ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ వన్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మంథని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాక.. 2018లో ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంది.
అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే..
‘మేము ముగ్గురం పిల్లలం. ఐఏఎస్ కావాలనే నా కలను అమ్మానాన్నలు వారి కలగా మార్చుకున్నారు. నా ప్రయత్నాలను ప్రోత్సహించారు. గతేడాది ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చా. మరోసారి ప్రతి్నంచాలని ప్రోత్సహించారు. గ్రూప్–1 రాసి డీఎస్పీగా శిక్షణ తీసుకుంటూనే మరోసారి సివిల్స్కి ప్రిపేరయ్యా. అమ్మానాన్నల మాట ఈరోజు నిజమైంది. అప్పటి కరీంనగర్ కలెక్టర్ స్మితాసబర్వాల్ను స్ఫూర్తిగా తీసుకొని సివిల్స్కు ప్రిపేరయ్యా. మహేశ్ ఎం.భగవత్ సర్ సలహాలతో ఈరోజు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించా.’
ఐఎఫ్ఎస్ వచ్చినా ఐఏఎస్పై గురి
103వ ర్యాంకు సాధించిన బిపుల్ గుప్తా విశాఖవాసి. ఆయన తండ్రి విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ గుప్తా. 2024 సివిల్స్ పరీక్షల్లో బిపుల్కు 368వ ర్యాంకు రావడంతో ఐఎఫ్ఎస్ అధికారిగా ఏపీ కేడర్లో చేరారు. ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. అయినా ఐఏఎస్ లక్ష్యంగా మళ్లీ సివిల్స్ రాసి ఇప్పుడు 103వ ర్యాంకు సాధించారు. బిపుల్ 2022లో ఐఐటీ మద్రాస్లో బీటెక్ పూర్తి చేశారు. తైక్వాండోలో బ్లాక్బెల్ట్ సాధించిన బిపుల్ గుప్తా తల్లి డాక్టర్ దీప గుప్త ప్రముఖ యూట్యూబర్. ఈసారి ఐఏఎస్ లభించే అవకాశం ఉందని బిపుల్ తెలిపారు.
నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు
సివిల్స్లో మూడుసార్లు విఫలమైనా పట్టుదలతో చదివి నాలుగో ప్రయత్నంలో 393వ ర్యాంకు సాధించారు తిరుపతికి చెందిన యారాశి తుషారికరెడ్డి. ఆమె తండ్రి వై.ఎం. గురువారెడ్డి తిరుపతి బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి మల్లీశ్వరి టీటీడీలో సూపరింటెండెంట్. తుషారిక చెన్నైలోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ చేశారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ లేదా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పోస్టు రావచ్చని ఆమె అంచనా వేస్తున్నారు.
గ్రూప్–2తో మురిసి.. సివిల్స్లో మెరిసి
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్లో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ వ్యవసాయ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోగా.. తల్లి కష్టపడి కుమారుడిని చదవించారు. ఆయన ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ పూర్తి చేశారు. గత నెలలో గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో ర్యాంకు కొట్టారు.
నాలుగో యత్నంలో 573వ ర్యాంకు
విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎల్ఎంఎం విభాగంలో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్న రాజబాబు, విజయలక్ష్మి దంపతుల రెండో కుమార్తె శ్వేత ఐఐటీ హైదరాబాద్లో పూర్తి చేశారు. అనంతరం రెండుసార్లు సివిల్స్ ప్రిలిమ్స్లో విఫలమైన ఆమె మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా అనుకున్న ఫలితం రాలేదు. నాలుగో ప్రయత్నంలో 573 ర్యాంక్ సాధించారు. ప్రజాసేవ చేయాలన్నదే తన లక్ష్యమని శ్వేత పేర్కొన్నారు.
⇒ ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన గోగుళ్ల రాజశేఖర్కు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైనా సివిల్ సర్విసెస్లో 920వ ర్యాంకు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఐఐటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ చదివారు. నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనా కుంగిపోకుండా ఐదోసారి పరీక్షలు రాసి విజయం సాధించారు.
⇒ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన ప్రమోద్విష్ణు సత్తా చాటారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 640వ ర్యాంకు సాధించారు. ఆయన విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
⇒ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన రాఘవేందర్ పదుకొనె, మమత దంపతుల కూతురు ఇంద్రార్చిత సివిల్స్లో 627 ర్యాంకు సాధించారు.
నాలుగో ప్రయత్నంలో 178వ ర్యాంకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన బానోతు లక్ష్మీరచన సివిల్స్ ఫలితాల్లో 178వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి బానోతు వెంకటరమణ విప్రోలో ఉద్యోగి కాగా తల్లి తులశమ్మ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ తర్వాత బజాజ్ సంస్థలో అసోసియేట్ సైంటిస్ట్గా పనిచేస్తూ సివిల్స్ సాధించాలని మూడుసార్లు ప్రయతి్నంచింది. చివరకు నాలుగో ప్రయత్నంలో లక్ష్మీరచన 178వ ర్యాంకు సాధించింది. ఐఐటీ ఇండోర్లో ఆమె చదివింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్స్ సాధించాలన్న తన తండ్రి కోరిక నెరవేరలేదని.. దాంతో తనను సివిల్స్ రాయమన్నారని.. ఇప్పుడు తన తండ్రి కల నెరవేర్చినట్లయిందన్నారు.
ఎంపీడీఓకు 472వ ర్యాంకు
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల అభివృద్ధి అధికారి బేతి విక్రమ్ సివిల్స్లో 472 ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విక్రమ్ మాట్లాడుతూ సాధించాలనే కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదని, తాను ఐఏఎస్ కోసం చాలా కష్ట పడ్డానన్నారు. తన కల సాకారమైందన్నారు.
డిప్యూటీ కలెక్టర్కు 358వ ర్యాంకు
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ సివిల్స్లో 358వ ర్యాంకు సాధించారు. గతేడాది ఫలితాల్లో ఆయనకు 700వ ర్యాంకు వచ్చింది. గ్రూప్–1లోనూ సత్తా చాటిన వెంకటేశ్.. ప్రస్తుతం నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణలో ఉన్నారు. ఆయన తండ్రి సత్యయ్య ట్రాన్స్కో ఏఈగా పనిచేస్తున్నారు. తల్లి యశోద గృహిణి. ఈసారి ఐఏఎస్ రాకపోతే మరోసారి ప్రయతి్నంచి లక్ష్యాన్ని చేరుకుంటానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.
రెండో ప్రయత్నంలో...
హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన ఆర్మీ విశ్రాంత అధికారి కల్నల్ శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయిని బిందుల కుమారుడు డి.ఎస్.కె ప్రచేత్ సివిల్స్లో 193వ ర్యాంకు సాధించాడు. రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
మూడో ప్రయత్నంలో 259వ ర్యాంకు
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి సివిల్స్లో 259వ ర్యాంక్ సాధించారు. వర్షిత్ హైదరాబాద్లోని బిట్స్ క్యాంపస్లో 2023లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కస్టమ్స్ విభాగంలో జీఎస్టీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా గతేడాది ఉద్యోగం సాధించి ప్రస్తుతం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్లో ర్యాంక్ సాధించారు. ఆయన తండ్రి శనిగరం నవీన్రెడ్డి వ్యాపారవేత్త, తల్లి కవితరెడ్డి.
అటెండర్ కొడుకుకు 768వ ర్యాంకు
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి శ్రవణ్కుమార్ సివిల్స్లో 768 ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి కుమ్మరి యాదగిరి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తుండగా తల్లి జ్యోతి ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రూప్–1లో ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికై ఉద్యోగ శిక్షణ ఉంటూనే సివిల్స్ కోసం ప్రయతి్నంచి 6వ ప్రయత్నంలో శ్రవణ్కుమార్ లక్ష్యం చేరుకున్నాడు. లక్ష్యం పెట్టుకొని చదివానని.. సమాజంలో విద్యాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పాడు.
సివిల్స్లో అన్నదమ్ములకు ర్యాంకు
నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన అంజిరెడ్డి, ఆలివేలు దంపతుల కుమారులు వేలిమినేటి విక్రమసింçహారెడ్డి, విజయసింçహారెడ్డి సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. విక్రమసింçహారెడ్డి 541 ర్యాంకు, విజయసింçహారెడ్డి 682 ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోదరులిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్–1 పరీక్షల్లో విక్రమ్సింçహారెడ్డి 208 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగంలో చేరగా విజయసింహారెడ్డి గ్రూప్–1లో 340 ర్యాంక్ సాధించి మహబూబ్నగర్లో ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.
అమ్మానాన్న ప్రోత్సాహంతోనే..
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సివిల్స్లో ర్యాంక్ సాధించానని 748వ ర్యాంకర్ పూదరి రాహుల్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన పూదరి గంగలక్షి్మ–మల్లేశం దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రాజశ్రీకి వివాహం కాగా, పెద్దకుమారుడు రవితేజ సివిల్ సర్జన్గా శిక్షణ పొందుతున్నారు. చిన్నకుమారుడు రాహుల్ సివిల్స్లో 748వ ర్యాంక్ సాధించారు.


