ర్యాండమ్ మ్యాపింగ్ ఆధారంగా అంచనా వేసిన ఎన్నికల సంఘం
హైదరాబాద్లో 30 శాతం, జిల్లాల్లో 65 శాతం మ్యాపింగ్
హైదరాబాద్లో దాదాపు 20 లక్షలు.. గ్రామీణ ప్రాంతంలో 30 లక్షల వరకు తగ్గే చాన్స్
డూప్లికేట్, చనిపోయిన, రెండు చోట్ల ఉన్న ఓట్లు, విదేశాల్లోని తెలంగాణ వారి ఓట్లు పోయే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో భారీగా ఓటర్లు తగ్గిపోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ‘సర్’లో ఏకంగా 50 లక్షల వరకు ఓటర్లు తగ్గిపోతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఈ సంఖ్య 2.75 కోట్ల నుంచి 2.80 కోట్ల మధ్య ఓటర్లు ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2002 ఓటర్ల జాబితాతో ర్యాండమ్ మ్యాపింగ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, శివార్లలో దాదాపు 87 లక్షల ఓటర్లు ఉంటే.. అందులో దాదాపు 15 నుంచి 20 లక్షల ఓటర్లు, గ్రామీణ జిల్లాల్లో దాదాపు 30 లక్షల వరకు ఓటర్లు తగ్గుతారని ఎన్నికల సంఘం వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఎన్నికల సంఘం రూపొందించిన ‘డెమోగ్రఫీ సిమిలర్ ఎంట్రీస్’సాఫ్ట్వేర్ ఆధారంగా బోగస్ లేదా డూప్లికేట్ ఓట్లను తొలగిస్తారు. దేశంలో ఎక్కడైనా సరే రెండో ఓటు ఉంటే..ఈ సాఫ్ట్వేర్తో తొలగించే వీలుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా హైదరాబాద్లో ఎక్కువగా జిల్లాల నుంచి వచ్చి స్థిరపడినవారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చి.. ఇక్కడ కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తమ స్వస్థలాల్లోనూ ఓటర్లుగా నమోదై ఉన్నారు. అలా రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వారందరి ఓట్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగిస్తారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎస్ఐఆర్ సందర్భంగా బీఎల్ఓ ఇంటింటికి సర్వేకు వచ్చిన సమయంలో ఓటర్లు తప్పనిసరిగా భౌతికంగా ఉండాలని, ఒకవేళ లేని పక్షంలో కుటుంబ యజమాని సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని ఆధారాలను (ప్రూఫ్స్) చూపించి సంతకం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉండే వారి ఓట్లు కనుమరుగయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న వారికి, రోహింగ్యాలకు ఇక్కడ ఓటు హక్కు కల్పించరు. అవసరమైతే ఎన్యుమరేటర్లు రెండుమూడుసార్లు వచ్చి మరీ తనిఖీలు చేసిన తర్వాతనే తుది జాబితాను రూపొందిస్తారు.
ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రతీ ఓటరు వివరాలు సేకరించి.. ఎన్యుమరేటర్ ఫామ్లో నింపిన తర్వాత ఒక ఓటరు రిసిప్ట్ కాపీ ఇస్తారని, అదే కాపీని సంబంధిత సిబ్బంది డిజిటల్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారని అధికారులు చెబుతున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒకే ఓటరు రెండుచోట్ల ఓట్లు వేసే పద్ధతిని ఈ ఎస్ఐఆర్ ద్వారా అరికట్టడానికి వీలవుతుందని, వాస్తవంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారన్న విషయంలో పూర్తి స్పష్టత వస్తుందని, డూప్లికేషన్కు ఆస్కారం ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మూడో దశలో తెలంగాణ...
దేశవ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల్లో పలు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. మూడో దశలో తెలంగాణలో చేపట్టనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానున్నట్టు సమాచారం. 2002 ఎన్నికల జాబితాతో అనుసంధానం చేసిన మ్యాపింగ్ ప్రక్రియ చేస్తోంది. ఈ సమయంలో ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం 4 భాగాలుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం, ముసాయిదా జాబితా ముద్రణ, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణతో ఈ ప్రకియ పూర్తవుతుంది. ప్రతి ఇంటికీ నాలుగైదుసార్లు వెళ్లి వివరాలు సేకరించడం ద్వారా బీఎల్ఓలు ఎన్యుమరేషన్లో కీలక భూమిక పోషించనున్నారు.
పాస్పోర్టు, రేషన్, ఆధార్ వంటి గుర్తింపు కార్డులను పరిశీలించి నిజమైన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతారు. తద్వారా డూప్లికేట్, చనిపోయిన, ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్లిన వారు, బోగస్ ఓటర్లు జాబితా నుంచి తొలగించి, వాస్తవ ఓటర్లకు మాత్రమే ఓటుహక్కు ఉండేలా ఈ ప్రక్రియను కొనసాగించాలని ఎన్నికల సంఘం ఉద్దేశం. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్నది రానున్న కాలంలో తెలియాల్సిందే.


