తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి బంధం ఎగతాళి అయ్యింది.. భార్య అక్రమ సంబంధానికి మూడుముళ్లు వేసిన భర్తే బలైపోవాల్సి వచ్చింది.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను, ప్రియుడు దారుణంగా హత్యచేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంటకు చెందిన బక్కా నాగేంద్ర (32) భార్య వీరలక్ష్మితో రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన తోరాటి శివ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర, వీరలక్ష్మి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన భార్య వీరలక్ష్మితో కలసి శివ ఉండటాన్ని నాగేంద్ర చూశాడు.
ఆగ్రహానికి గురైన నాగేంద్ర.. శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి గొడవ పడుతూ పక్కనే ఉన్న పంట బోదె వరకూ వచ్చేశారు. ఈ నేపథ్యంలో శివ బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక భార్య వీరలక్ష్మి, అత్త హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సీఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా విచారిస్తున్నామని సీఐ తెలిపారు. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.
ఎన్నడూ లేని విధంగా హత్యలు, దాడులు : మాజీ ఎమ్మెల్యే
పెద్ద దొడ్డిగుంట గ్రామంలో హత్య జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన క్షణం నుంచే హత్యలు, దాడులు, మానభంగాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఇటీవల పందలపాక, రంగాపురంలలో మహిళల హత్య, అదే గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం, ఇప్పుడు దొడ్డిగుంటలో హత్య.. ఇవన్నీ కూటమి పాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండ ఉందన్న ధైర్యం పెరిగిందని, నేరస్తులకు స్టేషన్ బెయిల్లు, బాధితులకు శిక్షలు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు.
నిందితుడు తోరాటి శివను, అతని బైకును రంగంపేట పోలీస్ స్టేషన్కు హత్యకు గురైన బక్క నాగేంద్ర అప్పగించినప్పటికీ, ఎస్సై కేసు నమోదు చేయకుండా అతనిని విడిచిపెట్టారని, అదే నిర్లక్ష్యం ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని అని సూర్యనారాయణరెడ్డి అన్నారు. బిక్కవోలు, రంగంపేట మండలాల ఎస్సైలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారని అన్నారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట ఎస్సై శివప్రసాద్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో నేరస్తులకు రాజకీయ అండ, పోలీసుల నిర్లక్ష్యం పెరిగి, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అన్నారు.
ఎస్సైపై చర్యలకు డిమాండ్
వివాహేతర సంబంధంపై ఈ నెల 6న రంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మృతుడి నాగేంద్ర తండ్రి బక్కా వెంకటేశులు, తల్లి లక్ష్మి, చిన్నాన్న బక్కా వీర్రాజు, చిన్నమ్మ మంగ, సోదరుడు వీరబాబు తెలిపారు. ఫిర్యాదు చేయడంతో పాటు అక్రమ సంబంధం నడుపుతున్న తోరాటి శివకు సంబంధించిన బైక్ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించి న్యాయం చేయమని ఎస్సై శివప్రసాద్ను వేడుకున్నామన్నారు. అయినా ఎస్సై పట్టించుకోలేదని, నిందితుడు శివ వద్ద లంచం తీసుకుని తాము అప్పగించిన బైక్ను కూడా ఇచ్చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మరింత రెచ్చిపోయిన శివ విచ్చలవిడిగా వీరలక్ష్మి వద్దకు వచ్చేవాడని, తాము ఫిర్యాదు చేసినప్పుడే శివపై చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని వాపోయారు. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సీఐ సుమంత్, డీఎస్పీ విద్య వద్ద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి ఎస్సై శివప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని వారికి సీఐ, డీఎస్పీ హామీ ఇచ్చారు.


