రాజధాని రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా దీనిని తవ్వినట్లు విమర్శలు
ఇది ప్రభుత్వ హత్యేనని దళిత నాయకుల విమర్శ
మంగళగిరి టౌన్: నీటిగుంతలో మునిగి 10వ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. కృష్ణాయపాలేంకు చెందిన కంతేటి ప్రకాష్, విమల దంపతుల కుమారుడు ప్రజ్వల సంతోష్ (15) పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో పెనుమాకలోని ట్యూషన్కు ఆదివారం వెళ్లాడు. ట్యూషన్ అనంతరం ఇంటికి వచ్చే మార్గంలో నీటిగుంతలో ఈతకు దిగి మునిగిపోయాడు. స్థానికులు గమనించి ఒడ్డుకు చేర్చేలోపే సంతోష్ మృతిచెందాడు.
కాగా, రాజధాని రోడ్డు నిర్మాణ పనుల కోసం తవి్వన నీటిగుంతలోనే బాలుడు మృతిచెందినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదం జరిగిన నీటిగుంత వద్ద ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్లే బాలుడు మృతి చెందాడని పలువురు స్థానిక దళితనాయకులు విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనకు ప్రభుత్వం, సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలుడి మృతిని ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నట్లు ఉద్ఘాటించారు. పోలీసులు సుమోటాగా తీసుకుని దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


