గచ్చిబౌలి: ఏటీఎంలోని డబ్బుల ట్రంక్ పెట్టెతో పరారైన నిందితుడు అజిత్ కుమార్ను రిమాండ్కు తరలించినట్లు నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం బొమ్మనహాల్కు చెందిన బడిగేరి అజిత్ కుమార్ అలియాస్ శివ (34) సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ వద్ద నివాసం ఉంటూ ఆరు నెలల క్రితం సంగం సెక్యూ రిటీ సొల్యూషన్స్లో డ్రైవర్గా చేరాడు. ఆ సంస్థ యాక్సిస్ బ్యాంక్ల ఏటీఎంల్లో క్యాష్ మెయింటెనెన్స్ చేస్తోంది. ఈ నెల 12న గోపన్పల్లిలో క్యాష్ లోడ్ చేసేందుకు కస్టోడియన్స్ రామకృష్ణ, మాలిక్లు ఏటీఎం లోపలికి, గార్డు పెరుమాళ్ బాత్రూంకు వెళ్లారు. ఇదే అదనుగా అజిత్ కుమార్ డబ్బులున్న వాహనం తీసుకొని ఉడాయించాడు.
టీ తాగుతున్నట్లు నమ్మించి..
బయటకు వచ్చిన సిబ్బంది ఫోన్ చేయగా పక్కనే టీ తాగుతున్నానంటూ అజిత్ కుమార్ నమ్మించాడు. దాదాపు 3 గంటలవుతున్నా అతడి ఆచూకీ లేకపోవడంతో కస్టోడియన్ రామకృష్ణ గచి్చ»ౌలి పోలీసులకు సమాచారం అందించాడు. ట్రంక్ పెట్టెను తీసుకొని వాహనాన్ని తెల్లాపూర్ గద్దర్ క్రాస్ రోడ్డులో వదిలి అజిత్ ఆటోలో పారిపోయాడు. లాడ్జీలో పెట్టెను యాక్సెల్ బ్లేడ్తో కోసి జొమాటో బ్యాగ్లో రూ. 57 లక్షల నగదును సర్దాడు. మియాపూర్లో పుణె వెళ్లే బస్సు ఎక్కాడు. డ్రైవర్ బ్యాగ్ చెక్ చేయాలనడంతో బస్సు దిగి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడి నుంచి మరో బస్సులో అనంతపురం వెళ్లాడు.
వైజాగ్ సబ్బవరంలో ఉండే ప్రేమికురాలికి అజిత్ ఫోన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ యువతిపై ఆరా తీశారు. దీంతో తనను పోలీసులు వెతుకుతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. అనంతపురం నుంచి బళ్లారి, హోస్పేట్ నుంచి బెంగళూర్కు వెళ్లాడు. అనంతరం అక్కడి వెళ్లి పుణె, ముంబైల్లో గడిపాడు. రాత్రి సమయంలో ఖరీదైన మద్యం తాగుతూ.. జల్సాలు చేస్తూ విలాసవంతంగా గడిపాడు. మంగళవారం శంషాబాద్ సమీపంలో బ్యాగ్తో ఉన్న అజిత్ కుమార్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.34,90,000 నగదు, సెల్ ఫోన్ను స్వా«దీనం చేసుకున్నారు. సమావేశంలో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు, డీఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.
జీతం ఇవ్వలేదని కసి పెంచుకుని..
ప్రతి రోజూ లక్షల్లో డబ్బు రవాణా చేసే సెక్యూరిటీ సంస్థ.. నాలుగు నెలలుగా జీతం ఇవ్వక పోవడంతో నిందితుడు అజిత్ కుమార్ కసి పెంచుకున్నాడు. డబ్బు కొట్టేసి విలాసవంతంగా గడపాలకున్నాడు. 20 రోజులుగా అదను కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దాదాపు 11 రోజుల పాటు ఆయా నగరాలు తిరుగుతూ జల్సాలు చేస్తూ సగటున రోజుకు 2.లక్షల చొప్పున రూ.22 లక్షలు ఖర్చు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులను తికమకపెట్టేందుకు దాదాపు ఏడు ఫోన్లు కొనుగోలు చేశాడు. ముంబైలో ఉన్న అజిత్ అనంతపురంలోని తన బావకు ఫోన్ చేసి కేర్ టేకర్గా పని చేసి బాగా సెటిల్ అయ్యానని, కారు కొనుక్కొని విహారయాత్రలకు వెళదామని చెప్పాడు. ఎక్స్యూవీ కారును కొనుగోలు చేద్దామని చెప్పాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.


