డ్యూటీ చేయాలేనంటూ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్న వైనం
కండక్టర్దే తప్పంటున్న డీఎం లావణ్య
నారాయణపేట: నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఓ కండక్టర్ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కండక్టర్ జీఆర్రెడ్డి అనార్యోగ రీత్యా తాను కండక్టర్ డ్యూటీ చేయాలేనని, ఓడీ (అదర్ డ్యూటీ) వేయాలని ఆర్టీసీ డీఎం లావణ్య వద్దకు శుక్రవారం ఉదయం 11 గంటల చేరుకుని మొర పెట్టుకున్నారు. అయితే రెండు, మూడు రోజులు విధులు నిర్వహిస్తే ఓడీ అవకాశం కల్పిస్తామని అది కూడా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తేల్చిచెప్పింది.
దీంతో కండక్టర్ డీఎంతో వాదించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన కండక్టర్ తన వద్ద ఉన్న థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకోవడంతో పక్కనే ఉన్న కండక్టర్, డ్రైవర్లు లాక్కున్నారు. కండక్టర్ మింగిన టాబ్లెట్స్ను నీళ్లు తాపి కక్కించడంతో ప్రాణాల ముప్పు నుంచి తప్పించినట్లయింది. ఆ తర్వాత మళ్లీ డీఎం వద్దకు వెళ్లగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే సమస్య పరిష్కారం అవుతుందా అంటూ మందలించారు.
మీడియా ప్రతినిధుల అడ్డగింత..
కండక్టర్ ఆత్మహత్య సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగానే సీన్ రీవర్స్ అయింది. ముందుగా డిపో గేటు వద్దకు చేరుకున్న మీడియాను లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత డీఎం పర్మిషన్ తీసుకొని లోపలికి వదిలారు. కండక్టర్ జీఆర్ రెడ్డితో విలేకరులు మాట్లాడగా అనారోగ్య సమస్యతోనే డ్యూటీ చేయలేకపోతున్నానని చెప్పారు. జీఆర్ రెడ్డి గత రెండేళ్లుగా 8 నెలలు సిక్ లీవులు పెడుతూ.. 8 రోజులు డ్యూటీ చేస్తున్నట్లు డీఎం రికార్డులను విలేకరులకు చూపించారు. అనంతరం డీఎం ఈ విషయాన్ని ఆర్టీసీ ఆర్ఎంకు చెప్పడంతో కండక్టర్ను మందలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కండక్టర్కు న్యాయం చేస్తారా.. మరేమైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచిచూడాల్సిందే మరి.


