రూ.20 లక్షల విలువైన ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, హార్వెస్టర్ దహనం
మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఘటన
మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు కారణంగా ఆగ్రహంతో మహిళ భర్త, బంధువుల చేతిలో ఒకరికి చెందిన రూ.20 లక్షల విలువగల ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ దహనమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ మండలం గుండాలగడ్డ తండా∙గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోలేదు.
ఆ వివాహిత భర్త, బంధువులు ఆగ్రహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి చెందిన ఇల్లు, ఇంట్లోని వస్తుసామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ (హార్వెస్టర్) విలువైన సామగ్రిని దహనం చేశారు. తండావాసులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


