కత్తితో దాడి.. ఒకరికి తీవ్రగాయాలు
దుగ్గొండి: పంచాయితీలో మాటామాటా పెరగడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి.. కత్తితో దాడికి పాల్పడడంతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం మండలంలోని జీడికల్లో జరిగింది. గ్రామానికి చెందిన గొర్రె రమేశ్, గొర్రె యుగంధర్కు ఆర్థికపరమైన విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగా మాటామాటా పెరిగింది. దీంతో యుగంధర్ కుమారుడు రాకేశ్.. కత్తితో దాడికి పాల్పడగా రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ తెలిపారు.
కాల్వలో పడి గొర్రెలు
మృత్యువాత
టేకుమట్ల: కాల్వ దాటే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలోని ఆరెపల్లి శివారులో చోటు చేసుకుంది. బాధిత గొర్రెల కాపరి కుర్రె వీరయ్య కథనం ప్రకారం ఎస్సారెస్పీ డీబీఎం–16 సమీపంలో మేపుతున్న క్రమంలో గొర్రెలు కాల్వ దాటుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అందులో మునిగి 52 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కాగా వీరయ్యకు చెందిన 26తో పాటు, మరికొంత మంది కాపరులకు చెందిన 26 గొర్రెలు చనిపోయాయి. వీటి విలువ సుమారు రూ.5లక్షలకు పైగా ఉంటుందని, నష్టపోయిన కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
చిచ్చుపెట్టిన
వివాహేతర సంబంధం
● రూ.20 లక్షల విలువైన ఇల్లు,
వస్తు సామగ్రి, ట్రాక్టర్, హార్వెస్టర్ దహనం
● మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ
తండా గ్రామంలో ఘటన
మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం పెట్టిన చిచ్చు కారణంగా ఆగ్రహంతో మహిళ భర్త, బంధువుల చేతిలో ఒకరికి చెందిన రూ.20 లక్షల విలువగల ఇల్లు, వస్తు సామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ దహనమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గుండాలగడ్డ తండా గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం గుండాలగడ్డ తండా గ్రామానికి చెందిన ఓ వివాహితతో అదే గ్రామానికి చెందిన ఓవ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి పద్ధతి మార్చుకోవాలని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. ఆ వివాహిత భర్త, బంధువులు ఆగ్రహంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తికి చెందిన ఇల్లు, ఇంట్లోని వస్తుసామగ్రి, ట్రాక్టర్, మొక్కజొన్న కోత మిషన్ (హార్వెస్టర్) విలువైన సామగ్రిని దహనం చేశారు. తండావాసులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటంతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్సై దీపిక, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కత్తితో దాడి.. ఒకరికి తీవ్రగాయాలు
కత్తితో దాడి.. ఒకరికి తీవ్రగాయాలు


