చంద్రకిరణ్ కోల్డ్స్టోరేజీలో అమ్మోనియా లీక్
వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్ సమీపంలోని చంద్రకిరణ్ కోల్డ్స్టోరేజీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో సుందరయ్యనగర్, ఎన్టీఆర్నగర్కు చెందిన 10 కుటుంబాలు అస్వస్థతకు గురయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో గ్యాస్ వాసన వచ్చింది. ఎక్కడ నుంచి వాసన వస్తున్న విషయం తెలియక కోల్డ్స్టోరేజీ పక్కనే ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొంతమంది చంద్రకిరణ్ కోల్డ్స్టోరేజీ వద్దకు వెళ్లి పరిశీలించి పైపుల నుంచి అమ్మోనియా గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఏనుమాముల పోలీసు ఇన్స్పెక్టర్ జివ్వాజి సురేశ్, ఎస్సై రాజుతో అక్కడకు చేరుకున్నారు. కోల్డ్స్టోరేజీ నిర్వాహకులతో మాట్లాడి సంబంధిత టెక్నీషియన్తో గ్యాస్ బంద్ చేయించగా లీకేజీ నిలిచిపోయింది. ప్రథమ చికిత్స అందించడంతో అమ్మోనియా గ్యాస్ లీక్తో అస్వస్థతకు గురైన కుటుంబాలకు ఎలాంటి ప్రమాదం లేదని సీఐ సురేశ్ తెలిపారు. కాంగ్రెస్ 14వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ వచ్చి కోల్డ్స్టోరేజీలు, పత్తి మిల్లులతో వస్తున్న దుమ్ముధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అస్వస్థతకు గురైన 10 కుటుంబాలు
ప్రమాదం తప్పిందన్న పోలీసులు


