breaking news
Mahabubabad District News
-
అప్రెంటిస్ జాబ్మేళాను వినియోగించుకోవాలి
● ఇంటర్ విద్య ఆర్జేడీ గోపాల్ విద్యారణ్యపురి : ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 13న నిర్వహించనున్న అప్రెంటిస్ జాబ్మేళాను వినియోగించుకోవాలని ఇంటర్ విద్య ఆర్జేడీ ఎ. గోపాల్ కోరారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్, హైదరాబాద్ ఆర్డీఎస్డీఈ సంయుక్త ఆధ్వర్యంలో 2023 నుంచి 2026 విద్యాసంవత్సరాల్లో ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హనుమకొండలోని ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాలలో అప్రెంటిస్ జాబ్మేళా నిర్వహించబోతున్నామన్నారు. ఈ మేరకు గురువారం ఈ కళాశాలలో అప్రెంటిస్ జాబ్మేళా సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ సంఖ్యలో ఆయా విద్యార్థులు అప్రెంటిస్ జాబ్మేళాకు హాజరయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ జాబ్మేళాలో ఎంపికై న వారికి ఆర్డీఎస్డీఈ వారు నెలకు రూ. 9,600 స్టైఫండ్ కూడా చెల్లిస్తారన్నారు. పారామెడికల్, ఇంజనీరింగ్, కామర్స్, కంప్యూటర్, హోమ్సైన్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బి. వెంకన్న, ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్రీధర్, వివిధ జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆర్. శ్రీనివాస్రావు, కె. మాధవరావు, బి.కవిత, భగవద్గీత, ఎం. మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
తేమశాతం ఉన్నప్పుడే విత్తుకోవాలి
మహబూబాబాద్ రూరల్: భూమిలో తగినంత తేమశాతం ఉన్నప్పుడే విత్తనాలను విత్తుకోవాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల, కంబాలపల్లి, సికింద్రాబాద్ తండా, మాధవాపురం, ఇస్లావత్ తండాల్లో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులు వానాకాలంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి తగిన సలహాలు, సూచనలు అందజేశారు. ఏడీఏ మాట్లాడుతూ.. రైతులు తగినంత తేమశాతం ఉన్నప్పుడే పత్తి, మొక్కజొన్న విత్తనాలను విత్తుకుంటే అవి మంచిగా మొలకేత్తేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులు దళారుల దగ్గర నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలని సూచించారు. అధిక ధరలకు ఎరువులు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. బంద్ను విజయవంతం చేయాలి మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న తలపెట్టిన విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మునగాల మహేష్, జ్యోతిబసు, మాగం లోకేష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పీడీఎస్యూ కార్యాలయంలో గురువారం విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని ఆరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. యూనివర్సిటీలో మెస్ బకాయిలు రద్దు చేయాలని, నర్సింగ్ విద్యార్థులకు ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇంజనీరింగ్ విద్యలో డొనేషన్ ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లతో బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, విజయవంతం చేయాలన్నారు. -
నేడు ఓరుగల్లు పీఠకాపరిగా విజయపాల్రెడ్డికి పట్టాభిషేకం
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమానగర్ కేథిడ్రల్ క్యాంపస్లో రోమ్ 14వ పోప్లియో నియమించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దుగ్గింపుడి విజయపాల్రెడ్డికి శుక్రవారం ఓరుగల్లు మేత్రాసనం 4వ పీఠకాపరిగా పట్టాభిషేకం జరగనుందని మీడియా ఇన్చార్జ్ ఫాదర్ ఎం.జయపాల్ గురువారం తెలిపారు. ఉదయం 9: 00 గంటలకు ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోమ్ పోప్లియో దూత, అగ్రపీఠాధిపతులు, ఫాదర్లు, మఠాధిపతులు, మఠకన్యలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.. విజయపాల్రెడ్డిని పీఠకాపరిగా అభిషేకిస్తారని చెప్పారు. పట్టాభిషేకానికి తరలొచ్చే వారి కోసం ఫాతిమానగర్ కేథిడ్రల్ చర్చి ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన బిషప్స్ హౌస్ ప్రారంభం.. ఫాతిమానగర్ కేథిడ్రల్ క్యాంపస్ ప్రాంగణంలో ఓరుగల్లు మేత్రాసనం పరిపాలనా సౌలభ్యం కోసం అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బిషప్స్ హౌస్ను ప్రారంభించనున్నట్లు మీడియా ఇన్చార్జ్ ఎం.జయపాల్ తెలిపారు. -
బంగారం దొరికిన ఘటనలో కూలీల విచారణ
● వస్తువులు స్వాఽధీనం చేసుకున్న తహసీల్దార్ చెన్నారావుపేట: వరంగల్జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని కోపాకుల పాడు వ్యవసాయ భూముల్లో కౌలు రైతులు, కూలీలకు బంగారం దొ రికిందన్న చర్చ వారం రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తహసీల్దార్ గత మంగళవారం( గత నెల 30వ తేదీ) ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఆ వ్యవసాయ భూమిలో గత శుక్రవారం(గత నెల 26వ తేదీ) పనులకు వెళ్లిన కూలీలు, భూమి కౌలుకు చేస్తున్న రైతును తహసీల్ కార్యాలయానికి పిలిచారు. తహసీల్దార్ అబీద్అలీ సమక్షంలో ఎస్సై రాజేశ్ రెడ్డి ఆ కూలీల నుంచి వాగ్మూలం సేకరించారు. ఆ రోజు ఎంత మంది పనికి వెళ్లారు? ఎవరెవరికి బంగారం దొరికింది? ఏఏ వస్తువులు దొరికాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నివేదికను కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారులు తెలిపారు. బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్ .. విచారణ అనంతరం కూలీల నుంచి బంగారు వస్తువులు పుస్తె, హారంలో నిధిగా భావిస్తున్న బిల్ల, గుండు, రేకు వస్తువులను తహసీల్దార్ అబీద్అలీ స్వాధీనం చేసుకున్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
తొర్రూరు: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. గురువారం డివిజన్ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలని, ఎలాంటి తప్పు డు పనులు చేసినా ఆస్పత్రులను సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు. మరిపెడ ఏడీఏగా పి.మురళి బాధ్యతలు మరిపెడ రూరల్: మరిపెడ ఏడీఏగా పి.మురళి గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఏగా విధులు నిర్వర్తించిన ఆయనను మరిపెడ పూర్తి స్థాయి ఏడీఏగా బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరిపెడ ఏఓ బోడ వీరసింగ్, ఏఈఓలు మురళిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. మున్సిపల్ భవనం కోసం స్థల పరిశీలన డోర్నకల్: డోర్నకల్ మున్సిపల్ కార్యాలయ భవనం కోసం గురువారం మున్సిపల్ కమిషనర్ నాగరాజు స్థల పరిశీలన చేశారు. సుమారు రూ. 3.5కోట్ల నిధులతో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థానిక సెయింట్ ఆగ్నేస్ పాఠశాల ఎదురుగా ఉన్న మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని పరిశీలించారు. పరిపాలనపరమైన అనుమతులు వచ్చిన తర్వాత భవన నిర్మాణంకోసం అవసరమైన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో టీపీఎస్ సంతోష్కుమార్, కౌన్సిలర్ గారె రమేష్, కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్, ఎల్లావుల హరికృష్ణ, దారావత్ కృష్ణ పాల్గొన్నారు. కాడెద్దుగా మారిన రైతు గంగారం : మండలంలోని పూనుగొండ్ల గ్రామానికి చెందిన రైతు పెనక ప్రవీణ్కు చెందిన జత దుక్కిటెద్దుల్లో ఒకటి ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కాగా, మరోటి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో గురువారం ఒకవైపు కాడెద్దు.. మరోవైపు రైతు భుజాలపై కాడిని మోస్తూ దుక్కులు దున్నడం కలిచివేసింది. ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నైవేద్యం సమర్పించి.. ప్రాణం కోల్పోయింది
మా అవ్వ చంద్రమ్మ సంక్రాంతి రోజున పరమాన్నం వండి దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించింది. పూజా కార్యక్రమాలు ముగిశాక చాపపై నిద్రించింది. కొద్ది సేపటికే ఏదో కరిచినట్లు అనిపించడంతో మాకు చెప్పింది. ఇల్లంతా వెతికినా ఏమీ కనిపించలేదు. పు రుగు కుట్టి ఉంటుందనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ గంట తర్వాత ఇంట్లో పాము కనిపించింది. అప్పటికే విషం మా అవ్వ శరీరమంతా వ్యాపించి అస్వస్థతకు గురైంది. వెంటనే అంబులెన్స్లో ఆస్పతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పండుగ రోజు మా ఇంట్లో తీరని విషాదం అలుముకుంది. –బల్ల రాజు, రేలకుంట, నల్లబెల్లి మండలం -
అదుపు తప్పిన బైక్..
● కాల్వలో పడి యువకుడి మృతి ● గుండేడు శివారులో ఘటన కమలాపూర్: బైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుండేడుకు చెందిన దాసి వెంకటేష్ (27) తన తండ్రి సాంబయ్యతో కలిసి జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను దర్శించుకుని అక్కడి నుంచి బైక్పై గుండేడుకు వస్తున్నాడు. మార్గమధ్యలో తన తండ్రిని దింపి ఒంటరిగా వస్తున్నాడు. ఈ క్రమంలో గుండేడు శివారులో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కెనాల్లో పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. ప్రేమ వివాహం చేసుకుందని.. హసన్పర్తి : చెల్లి ప్రేమ వివాహం చేసుకుందనే ఆ గ్రహంతో అబ్బాయిని చంపుతామని బెదిరించడమే కాకుండా అతడి ఇంటికి నిప్పు అంటించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి గురువారం నిందితులను అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన సౌరం విష్ణువర్ధన్, గుండ్లసింగారానికి చెందిన గాదె కరిష్మా గత నెల 24న ఓ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించలేదు. చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న అమ్మాయి సోదరుడు గాదె పాల్.. తన స్నేహితుడు మహబూబాబాద్ జిల్లా పూరి తండాకు చెందిన గుగులోత్ మనోజ్తో కలిసి జూన్ 24న కత్తులతో దాడికి చేయడానికి విష్ణు వర్ధన్ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మర్నాడు తెల్ల వారుజామున బాధితుడి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో ఇంట్లో ఉన్న వారు తృటిలో ప్రాణాలతో తిప్పించుకున్నారు. నిందితుల నుంచి తల్వార్, కత్తిపాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు.● అబ్బాయి ఇంటికి నిప్పు..ఆపై బెదిరింపు ● నిందితుల అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పోలీసులు -
నాణ్యమైన విద్య అందించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ గార్ల: కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్య బోధించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం గార్లలోని కేజీబీవీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ తనిఖీ సమయంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ లేకపోవడంతో, ఆమైపె చర్య తీసుకోవాలని డీఈఓ సత్యనారాయణమూర్తిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినుల విద్యా ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. పాఠశాలలోని వంటగది, వసతిగృహం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లను పరిశీలించి విద్యార్థినులకు నాణ్యమైన రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగుల వార్డులను పరిశీలించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలు సుకున్నారు. వైద్యులు విధుల్లో సమయపాలన పాటిస్తూ, రోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, గైనకాలజిస్ట్ను కేటాయించాలని సీపీఎం మండల కార్యదర్శి అలువాల సత్యవతి కలెక్టర్ను కోరగా, గూడూరు సీహెచ్సీ నుంచి డిప్యుటేషన్పై నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. డీఈఓ సత్యనారాయణమూర్తి, డీసీహెచ్ఎస్ చింత రమేష్, కేజీబీవీ జిల్లా స్పెషల్ ఆఫీసర్ గాయత్రి, ఎంఈఓ వీరభద్రం, సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం, తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, స్పెషలిస్ట్ వైద్యులు బాలునాయక్, సతీష్ పాల్గొన్నారు. -
భూముల రీ సర్వే..
సాక్షి, మహబూబాబాద్: నిజాంకాలం కన్నా ముందు రూపొందించిన భూ రికార్డులు కావడంతో సర్వే నంబర్లు, భూ విస్తీర్ణం, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల హద్దుల నిర్ధారణలో అనేక అవకతవకలు ఉన్నాయి. దీని వల్ల జిల్లాలో భూ పంచాయితీ లేని గ్రామం లేదు. కాగా, భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వినూత్నంగా ఆలోచింది. ప్రతీ గ్రామంలోని భూమిని సర్వేచేసి హద్దులు నిర్ధారించాలని భావించింది. అయితే ముందుగా జిల్లాలోని 70 గ్రామాల్లో ఉన్న మొత్తం భూమిని సర్వే చేసేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో భూముల రీ సర్వేకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. 70 గ్రామాల ఎంపిక.. జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 288 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భూ తగాదాలు ఉన్నవి.. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న గ్రామాలను ఎంపిక చేశారు. ఇలా 70 గ్రామాల్లో రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇనుగుర్తి, చిన్నగూడూరు వంటి చిన్న మండలాల్లో ఒకటి, రెండు గ్రామాలు, పెద్ద మండలాల్లో ఐదు గ్రామాల చొప్పున అన్ని మండలాలు కవర్ అయ్యే విధంగా గెజిట్లో గ్రామాలను పేర్కొన్నారు. ముందస్తు ప్రచారం.. అధికారులు ఏం చేస్తున్నారో తెలియకుండా వస్తే గొడవలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ముందుగా రీ సర్వే ముఖ్య ఉద్దేశం ఏమిటనే విషయంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను సమన్వయం చేసి ఈనెల 15 తర్వాత రీ సర్వే మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. అధునాతన పరికరాలతో సర్వే.. జిల్లాలోని 70 గ్రామాల్లో నిర్వహించే భూముల రీ సర్వే కోసం అధునాతన పరికరాలు, పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఒక్కొక్కటి రూ. 5లక్షల విలువచేసే 19 రోవర్లు సిద్ధం చేశారు. అవసరాలకు అనుగుణంగా నూతన రోవర్లు కొనుగోలు చేసేందుకు ఎస్టిమేషన్ వేస్తున్నారు. గ్రా మాల మధ్య సరిహద్దుల నిర్ధారణ, గ్రామంలోని మొత్తం భూమి, అందులో ప్రభుత్వ భూములు, గుట్టలు, చెరువులు, సాగు భూమి సర్వే నంబర్ల వారీగా విభజన చేసి సర్వే చేస్తారు. ప్రతీ గ్రామానికి, ప్రతీ రైతుకు ఎల్పీఎం(ల్యాండ్పార్సిల్ మ్యాప్) అందజేస్తారు. జీపీఎస్ సిస్టమ్కు అనుసంధానం చేయడంతో మరోసారి తప్పులు జరగకుండా ఉంటుందని అధికారులు అంటున్నారు. భూ సమస్యలకు చెక్ పెట్టేందుకే.. ప్రతీ గ్రామంలో ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టి, గొడవలు లేకుండా చూసేందుకే భూముల రీసర్వే ప్రక్రియ జరుగుతుంది. ఈ సర్వేపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. గ్రామాల వారీగా భూముల మ్యాప్లు, రైతుల వారీగా సరిహద్దులు పెట్టుకోవాలి. –అనిల్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) ధరణి, భూమాత తప్పిదాల వెలికితీత ప్రతీ భూమి సర్వేచేసి హద్దుల నిర్ధారణ జిల్లాలో 70 గ్రామాల్లో సర్వేకు గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం అవగాహన కల్పించే పనిలో అధికార యంత్రాంగంజిల్లాలో సర్వే చేసే గ్రామాల వివరాలు మండలం గ్రామాలు బయ్యారం సింగారం, గంధంపల్లి, కొత్తపేట, మొట్లతిమ్మాపురం, గురిమెళ్ల డోర్నకల్ బూర్గంపహాడ్, గుర్రాలకుంట, రావిగూడెం, ముల్కలపల్లి గంగారం పందెం, కోమట్లగూడెం, కాటినగరం గార్ల కన్నాయిగూడెం, గోపాలపురం, చంద్రగిరి, రాంపురం, బుద్దారం గూడూరు భూపతిపేట, మదనాపురం, గాజులగట్టు, గోవిందాపురం, కొల్లాపురం ఇనుగుర్తి కోమటిపల్లి కేసముద్రం ఉప్పరపల్లి, అన్నారం, రంగాపురం, ఇంటికన్నె, అర్పణపల్లి కురవి కంచర్లగూడెం, తిరుమలాపురం, తట్టుపల్లి, నారాయణపురం, అయ్యగారిపల్లి కొత్తగూడ పెగడపల్లి, గోవిందాపురం, మోకాళ్లపల్లి, కుందనపల్లి, బక్కచింతలపాడు మహబూబాబాద్ సింగారం, పర్వతగిరి, జంగిలిగొండ సీరోలు తాళ్లసంకీస చిన్నగూడూరు ఉగ్గంపల్లి దంతాలపల్లి కాల్వపల్లి, రామవరం, ఆగపేట, రేపోణి, బొడ్లాడ మరిపెడ బీచురాజుపల్లి, ఉల్లెపల్లి, గిరిపురం, ఎడ్జర్ల, బురహాన్పురం నర్సింహులపేట అక్కిరాల, బొజ్జన్నపేట, కౌసల్యదేవిపల్లి, వంతడపల నెల్లికుదురు రామానుజాపురం, కాచికల్లు, రావిరాల పెద్దవంగర పోచంపల్లి, కొరిపల్లి, బొమ్మకల్లు, పోచారం తొర్రూరు జమస్తాన్పురం, ఖానాపురం, వెంకటాపూర్, కర్కాల, గోపాలగిరి, బొంతుపల్లి -
రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేయొద్దు
మహబూబాబాద్: రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ వినోద్కుమార్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం రోడ్డు వరకు ఆక్రణ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది పొక్లెయినర్తో తొలగించారు. ఈసందర్భంగా కమిషనర్ వినోద్కుమార్ మాట్లాడుతూ.. రోడ్లపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, బోర్డులు, వ్యాపార సామగ్రిని తొలగించామన్నారు. వ్యాపారులు వారి స్థలాల్లోనే సర్దుబాటు చేసుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలతో సమస్యలు జఠిలమవుతున్నాయని, వ్యాపారులు అర్థం చేసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీఓ సాయిరాం, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, టీపీఎస్ వెంకటరమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, పుష్పరాజ్, తల్లు, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
పాస్పుస్తకమున్నా బెదిరింపులు..
హసన్పర్తి : హసన్పర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ కబ్జాదారులకు సహకరిస్తూ పట్టాదారులైన తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం హసన్పర్తి మండలం అన్నాసాగరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి మాట్లాడారు. అన్నాసాగరం శివారులోని సర్వే నంబర్ 74/బీ, 73/ఏ/1,77/ఏ/1,78/బీలో సుమారు 4.03ఎకరాల భూమి ఉందన్నారు. ఈభూమికి సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకం పొంది రైతుభరోసా డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఇందులో 1.06 ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి కబ్జా చేశాడని ఆరోపించారు. ఈవిషయమై పోలీస్స్టేషన్ను ఆశ్రయిస్తే ఇన్స్పెక్టర్ మహేందర్ తమనే బెదిరింపులకు గురిచేస్తూ కోర్టుకు వెళ్లమని హుకుం జారీచేస్తున్నాడని తెలిపారు. తమ వద్ద రెవెన్యూ అధికారులు సర్వే చేసిన మ్యాప్తో పాటు పట్టాదారుపాస్ పుస్తకాలు ఉన్నాయని చూపిస్తే.. క్షేత్రస్థాయికి వెళ్లినట్లయితే కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. భూమి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి తమకు ప్రాణభయం ఉందని చెప్పారు. ఇలాగే పోలీస్ ఇన్స్పెక్టర్ వేధింపులకు గురి చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్, పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి తెలిపారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రాణభయం విలేకరుల సమావేశంలో రైతుల ఆవేదన -
పాము కాటు.. కుటుంబాలకు చేటు
నర్సంపేట: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఒక వైపు సీజనల్ వ్యాధులు. మరో వైపు పాములు, తేళ్లు, విష పురుగుల కాటులతో పలు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వీటి బారిన పడుతున్నారు. అప్పటి వరకు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నుంచి ప్రధానంగా పాము కాటు వేస్తే ప్రాణాలు పోవడంతోపాటు అనారోగ్యానికి గురవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమవుతోంది. ఇంటి పరిసరాలు చెట్లతో కూడి ఉండడంతో పాములు వాటి కింద ఉంటూ ఆ వైపు వెళ్లిన వారిని కాటు వేయడం, చేలల్లో పనుల సమయంలో కాటు వేస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ జిల్లాలోని అటవీ ప్రాంత గ్రామాల్లో పాములు అత్యధికంగా సంచరిస్తుంటాయి. ఇలా చేస్తే కొంత నయం.. ● పాము కాటుకు గురి కాకుండా ఇంటి పరిసరాల్లో పొదలు లేకుండా చూసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో ఆరుబయట నిద్రించకుండా ఉండడం మేలు. ● రైతులు మార్కెట్లో లభిస్తున్న కాళ్ల బూట్లు ధరిస్తూ చేతి కర్రతో పంట పొలాల్లో వెళ్తే ఎంతో మేలు. ● పాము కాటు వేసిన అరగంట సమయంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్తే పెద్ద ప్రమాదం ఉండని పరిస్థితి ఉంటుంది. రోజురోజుకూ పెరుగుతున్న పాము, తేలు కాటు బాధితుల సంఖ్య వరంగల్ జిల్లాలో పాము, తేలు కాటుకు గురైన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లాలోని గ్రామాలు 80శాతం అటవీ ప్రాంతాలతో కూడి ఉండడంతో పాములకు ఆవాసాలుగా నిలిచాయి. జిల్లా ఆస్పత్రిగా పేరొందిన నర్సంపేట ప్రభుత్వ దవాఖానాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 126 మంది పాము కాటుకు, 84మంది తేటు కాలు కాటుకు గురై వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇవే కాకుండా మిగతా ఆస్పత్రులలో చికిత్స పొంది ఉంటారు. ఆరు నెలల్లో 126 మందిని కరిచిన పాములు చనిపోయిన వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుల వేడుకోలు -
నేటి నుంచి ఆర్ట్ చాలెంజ్
హన్మకొండ చౌరస్తా: జాతీయ స్థాయి ఆర్ట్ చాలెంజ్ శుక్రవారం నుంచి 14 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు సాగంటి మంజుల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు శేష బ్రహ్మం కళా యజ్ఞ స్ఫూర్తితో ‘కళాయజ్ఞ మినీ’ అనే పేరుతో జాతీయ స్థాయిలో 7 అంశాలపై ఆర్ట్ చాలెంజ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి ప్రతీ రెండు రోజులకు ఓ సారి ఒక సరికొత్త అంశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో అద్భుత ప్రతిభ కనబరిచిన చిత్రకారుల చిత్రాలను హైదరాబాద్లో ఆగస్టులో జరిగే చిత్ర కళా ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇందులో 50 మంది ప్రముఖ చిత్రకారులు పాల్గొంటున్నారని, వారు వేసిన పెయింటింగ్స్ సైతం పొందుపరచనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 81436 43337 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని.. ● మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం వజినపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి సునీల్ (26) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా రాకపోవడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేశ్కుమార్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో తాపీమేసీ్త్ర మృతి గూడూరు: అనుమానాస్పద స్థి తిలో ఓ తాపీమేసీ్త్ర మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని గొల్లగూడెం బీరన్న గుడి ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని చెంద్రుగూడేనికి చెందిన తాపీ మేసీ్త్ర ఎం.డీ హుస్సేన్ (46) బుధవారం సాయంత్రం వారాంతపు సంతలో కూరగాయలు తీసుకొస్తానని బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. దీంతో భార్య సైదాబి గురువారం తెల్లవారుజామున తన భర్త ఇంటికి రాలేదని బంధువులకు చెప్పడంతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో గొల్లెగూడెం సమీప బీరన్న గుడి పక్కన బహిర్భూమికి వెళ్లిన స్థితిలో వాంతులు చేసుకున్నట్లు, చెవులు, నోటి ద్వారా రక్తం కనిపించి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఏదైనా విష పురుగు కుట్టి చనిపోయాడా? లేదా ఇతర మరేదైనా ప్రమాదంతో మృతి చెందాడా అనే అంశంపై మృతుడి భార్య సైదాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో గురువారం భూ భారతి, భూముల రీ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులకు రైతులు సహకరించాలని, అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయని, భవిష్యత్లో ఎలాంటి సమస్యలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని భూములను సర్వే చేసి భూధార్ కార్డులు ఇస్తారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివరాలను భూధార్ కార్డు ద్వారా పొందుపరుస్తామని తెలిపారు. పకడ్బందీగా భూముల వివరాలను నమోదు చేసి నిజమైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమ్ల తండా, పర్వతగిరి, లక్ష్మతండా సర్పంచులు ఇస్లావత్ సుజాతబాలాజీ, అనితవెంకన్న, గుగులోత్ ఈశ్వరిరవి నాయక్, ఆర్డీఓ రాజేశ్వరి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాస్, మండల సర్వేయర్ లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు. -
గుండెల్లో నిలుపుకుంటారు
వరంగల్ పోలీసులు అధికారులనువరంగల్ క్రైం : వరంగల్ పోలీసులు తమతో కలిసి పనిచేసిన అధికారులను గుండెల్లో నిలుపుకుంటారని పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ అయిన సన్ ప్రీత్ సింగ్కు గురువారం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరించిన వాహనంపై సన్ ప్రీత్ సింగ్ను నిలబెట్టి పోలీస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ తమ అభిమానం, గౌరవం చాటుతూ భావోద్వేగ వీడ్కోలు పలికారు. అనంతరం సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 15 నెలలపాటు విధులు నిర్వర్తించిన కాలంలో ప్రతీ అధికారి, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఇక్కడి అధికారులు, సిబ్బంది, ప్రజల ప్రేమ, ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. భవిష్యత్లో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీసీపీలు ధార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ -
నియామకానికి ఇంటర్వ్యూలు
నేటి నుంచి పార్ట్టైం అధ్యాపకుల కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి ఈనెల 3(శుక్రవారం) నుంచి 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి –మార్చిలో 20 విభాగాల్లో 99 మంది పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరించారు. 601 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత 16 విభాగాల్లో 69 మంది అధ్యాపకుల నియామకానికి ఈనెల 3 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు రోస్టర్ ప్రకారం షార్ట్లిస్టు చేసి కొందరికే ఫోన్ద్వారా సమాచారం అందించారు. విభాగాల వారీగా ఇంటర్వ్యూల తేదీలు.. జూలై 3న ‘లా’, సోషియాలజీ, లైబ్రరీ సైన్స్, సైకాలజీ అభ్యర్థులకు, 4న కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కామర్స్, 6న బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, 7న బాటనీ, జువాలజీ, తెలుగు, 8న పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్, మ్యాథ్మెటిక్స్, ఫార్మసీ విభాగాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచినట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం తెలిపారు. వంద మార్కులు.. ఆయా విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి వంద మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ, నెట్,సెట్, పబ్లికేషన్స్, టీచింగ్ అనుభవానికి సంబంధించి 80 మార్కుల వరకు కేటాయించారు.10 మార్కులు డెమోన్స్ట్రేషన్,10 మార్కులు ఇంటర్వ్యూలకు కేటాయించారు. ఈ విభాగాలకు తర్వాతే.. కేయూలోని మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు దరఖాస్తులు స్వీకరించినా ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. తర్వాత నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. 269 మంది అభ్యర్థులకు పిలుపు 16 విభాగాల్లో 69 మందిని ఎంపిక చేయనున్న అధికారులు ఆయా విభాగాలన్నీ కలిపి దరఖాస్తులు చేసిన అభ్యర్థుల్లో షార్ట్ లిస్టుగా రూపొందించి 269 మంది అభ్యర్థులను డెమో, ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇందులో 69 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాగా, 248 మంది అభ్యర్థుల దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ెపద్దవంగర : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామచంద్రు తండాలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. తండాకు చెందిన బాదావత్ రవి (45) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడు తల్లి సోనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రూ. 4.70 లక్షల గంజాయి పట్టివేత
సంగెం : సంగెం మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం సంగెం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ వివరాలు వెల్లడించారు. సంగెం మండలం చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో మంగళవారం ఎస్సై వంశీకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా డు. దీంతో అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 10 ప్యాకెట్లలో 9.418 కిలోల సుమారు రూ. 4,70,900 విలువైన ఎండుగంజాయి లభించింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన షోయబ్ఖాన్ మరో వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సంగెం–గీసుకొండ మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచినట్లు తెలిపారు. కాగా, ఎస్సై వంశీకృష్ణ, హెడ్కానిస్టేబుల్ బాబు, కానిస్టేబుళ్లు శ్రవణ్, నవీన్, పాష, వీరన్న, రాజును సీఐ అభినందించారు. వ్యక్తి అరెస్ట్, రిమాండ్ -
కరుణించని వరుణుడు
బయ్యారం/ మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ఇప్పటి వరకు ఆశించినస్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో చెరువులు, కుంటలు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన నీటి నరులైన బయ్యారం, గార్ల పెద్దచెరువులతో పాటు కంబాలపల్లి చెరువు, తులారాం ప్రాజెక్టులోకి కొత్తనీరు చేరని పరిస్థితి ఉంది. దీంతో పంటల సాగు గణనీయంగా తగ్గింది. బోర్లు, బావుల కిందే సాగు మొదలు.. జిల్లాలోని 18 మండలాల పరిధిలోని చెరువులు, కుంటల్లో నీరు చేరకపోవడంతో వాటి ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది పంటల సాగు మొదలు కాలేదు. బోర్లు, బావుల ఆధారం ఉన్న రైతులు ఇప్పటికే వరినారు పోయగా పత్తి, మొక్కజొన్న, పసుపు తదితర పంటల సాగును రైతులు ప్రారంభించారు. అప్పుడప్పుడు పడుతున్న వర్షాలకు చెరువులు, కుంటల పరిధిలో భూములు ఉన్న రైతులు వరినారు పోసేందుకు సిద్ధమవుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో నీరు చేరితేనే వరి నాట్లు అయ్యే పరిస్థితి ఉంది. జిల్లాలో జాడలేని వర్షాలు నీరు లేక వెలవెలబోతున్న చెరువులు, కుంటలు జిల్లాలో గణనీయంగా తగ్గిన పంటల సాగుజిల్లాలో జూన్లో నమోదైన వర్షపాతం(మిల్లీమీటర్లలో..) మండలం కురిసింది సాధారణం కొత్తగూడ 117.5 178.3 గంగారం 117.4 169.4 బయ్యారం 162 142.6 గార్ల 178.7 142.9 డోర్నకల్ 147.6 129.8 కురవి 95.3 133.7 మహబూబాబాద్ 96.7 142.3 గూడూరు 86.2 184.2 కేసముద్రం 48.1 145 నెల్లికుదురు 73.8 123.8 నర్సింహులపేట 96.4 112.6 చిన్నగూడూరు 67.3 133.4 మరిపెడ 189.6 136.9 దంతాలపల్లి 90.3 118.2 తొర్రూరు 118.5 139.2 పెద్దవంగర 167.9 118.9 సీరోలు 113.3 132.1 ఇనుగుర్తి 36.9 132.2 జిల్లా మొత్తం 111.6 139.8 -
ఇంటి నంబర్లు, పట్టాలు ఇవ్వాలి
మహబూబాబాద్: పేదల ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని, 80 గజాలలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో వినూత్న ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసారథిరెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదన్నారు. రియల్టర్లు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ధరణి, భూభారతిల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాట్లు చేసి విక్రయించి కోట్లలాది రూపాయలు సంపాదించారన్నారు. పేదలు 80గజాల్లో గుడిసెలు వేస్తే వాటిని తొలగించి కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. గుడిసెవాసులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఇంటి నంబర్ల కోసం సుమారు పది వేలమంది దరఖాస్తు చేసుకుంటే.. 600 మందికి మాత్రమే ఇచ్చారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పట్టాలు, ఇంటి నంబర్లు ఇవ్వాలని, లేని యెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సుమారు 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అజయ్సారథిరెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీనివాస్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, పాండు రంగాచారి, సందీప్, శ్రావణ్, వీరన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, పీఆర్సీ సాధిస్తామని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్లో బుధవారం పీఆర్టీయూ టీఎస్ జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రేషనలెజేషన్ మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు, కేజీబీవీ ఉపాధ్యాయుల జీతాల పెంపు కోసం ప్రభుత్వంతో చర్చించామన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలలో టైమ్టేబుల్ మార్పు అంశంపై చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ప్రతీ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పీఆర్టీయూ సభ్యుత్వం తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్కు కృషి చేస్తున్నామని, మెడికల్ బిల్లుల క్లియరెన్స్ వేగవంతంగా చేస్తామన్నారు. 2003 డీఎస్ ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 1నుంచి ఓపీఎస్ అమలు దిశగా చర్యలు జరుగుతున్నాయని, సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయించే వరకు పీఆర్టీయూ పోరాటం కొనసాగిస్తుందన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఏఐఎఫ్టీఓ జాతీయ ఉపాధ్యక్షురాలు గీత, నాయకులు శ్రీనివాస్రెడ్డి, బద్రినారాయణ, హాల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
చెట్ల కొమ్మలు నరకడం ఇక సులువు
హన్మకొండ: చెట్ల కొమ్మలు నరకడం ఇక నుంచి సులువు కానుందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. చెట్ల కొమ్మలు నరకడం కోసం సమకూర్చిన హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ వాహనాన్ని బుధవారం హనుమకొండ బాలసముద్రంలో ప్రారంభించారు. అనంతరం ల్యాడర్ ద్వారా కొమ్మల నరికివేతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ లైన్ల పైకి చెట్ల కొమ్మలు విస్తరించి తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. సులువుగా, వేగంగా చెట్ల కొమ్మలు తొలగించేందుకు ఈ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం హనుమకొండ సర్కిల్కు సమకూర్చామని, వరుసగా అన్ని సర్కిళ్లకు విస్తరిస్తామన్నారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా అన్ని బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, హనుమకొండ ఎస్ఈ బి.సామ్యనాయక్, డీఈలు జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, అనిల్కుమార్, భాస్కర్, ఏడీఈ రాజు, ఏఈ ప్రవీణ్, లైన్మెన్ మల్లికార్జున్, సిబ్బంది శౌర్య, సదానందం, వంశీధర్, సిద్ధిరెడ్డి, రాంరెడ్డి, వినయ్, నరేశ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ సేవలకు శ్రీకారం -
అల్పాహారం తయారీకి స్థల పరిశీలన
మహబూబాబాద్ రూరల్ : కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం తయారీలో భాగంగా బుధవారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలించారు. విద్యార్థుల అవసరాల మేరకు అల్పాహారం వండి అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, నిల్వలకు మాత్రమే సరిపోతుందని మార్కెట్ సెక్రటరీ సుజన్ బాబు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఉన్నారు. కులాల పేర్లు మార్పుమహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ–ఏ కేటగిరీలోని కులాల పేర్లను మార్పు చేసిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సాయి శ్రీజ బుధవారం తెలిపారు. సంబంధిత కులాల ప్రతినిధుల వినతులు, సామాజిక పరిస్థితులు, గౌరవప్రదమైన గుర్తింపు అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. బుడబుక్కల కులాన్ని శివక్షత్రియగా, దొమ్మరను గదవంశీయగా, పెన్నార్ను దోభీగా, చాకలిని రజకులుగా, పిచ్చిగుంట్లను వంశరాజ్గా, వీరముష్టిని నెట్టికోట కులాలుగా పేర్లు మార్పు చేసినట్లు చెప్పారు. ఇప్పటి నుంచి ప్రభుత్వ రికార్డులు, సర్టిఫికెట్లు, సంక్షేమ పథకాల్లో ఈ కొత్త కులాల పేర్లనే నమోదు చేయాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపక పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయ కర్త ఉమామహేశ్వరీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ స్టేడియం రహదారిలో ఉన్న గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అభ్యర్థులకు డెమో కాస్లులు ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తామన్నారు. వీబీ జీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలి మహబూబాబాద్: మోదీ తీసుకొచ్చిన వీబీ జీ రామ్జీ పథకాన్ని రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు డిమాండ్ చేశారు. సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలన్నారు. వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టం రద్దుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల విషయం కొత్త చట్టంలో లేదన్నారు. కూలీల పని హక్కును హరించే కొత్త చట్టాన్ని రద్దు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సోమయ్య, హేమ, నాగన్న, సీతారాం, రాజు, శ్రీను, రాంమూర్తి, భాగ్యమ్మ, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. జర్మనీ వర్సిటీలతో కేయూ ఎంఓయూకేయూ క్యాంపస్: ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్ స్టడీ టూర్కు జర్మనీ వెళ్లారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్, రూసా కేయూ నోడల్ అధికారి ఆర్.మల్లికార్జున్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు
● ఇన్చార్జ్ డీఐజీగా ప్రవీణ్కుమార్, నూతన డీఆర్గా సుబ్బలక్ష్మి కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో రెండేళ్లలోపే బదిలీలు షురూ అయ్యాయి. 2024 జూలై 25న అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు బదిలీ అయ్యారు. 2026 జూన్ 30న డీఐజీ, డీఆర్ బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుకుంది. కాగా, ఈసారి పూర్తిస్థాయి జిల్లా రిజిస్ట్రార్ వరంగల్కు వచ్చారు. బదిలీల్లో ఇలా.. వరంగల్ డీఐజీగా విధులు నిర్వర్తిన్న సుభాషిణి రెండేళ్లలోపే రంగారెడ్డి డీఐజీగా బదిలీ కాగా.. ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఎఫ్ఏసీ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ కరీంనగర్ జిల్లాకు డీఐజీగా, ఎఫ్ఏసీగా వరంగల్ జిల్లా డీఐజీగా నియమితులయ్యారు. జిల్లా రిజిస్ట్రార్గా 2024లో బదిలీపై వచ్చిన ఫణీందర్ ఏడాదిలోపే హైదరాబాద్కు డిప్యుటేషన్పై వెళ్లారు. ప్రవీణ్కుమార్ ఎఫ్ఏసీ డీఆర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్ జిల్లా రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్గా బదిలీపై వచ్చారు. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాస్ వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ అండ్ ఆడిటింగ్ విభాగానికి పదోన్నతిపై వచ్చారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్లే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు 2024లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా, ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడి వరంగల్కు వచ్చారు. ఏడాదిలోపే 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని 8 మంది తిరిగి డిప్యుటేషన్ పేరిట ఖమ్మం జిల్లాకు, కొందరు లాంగ్ లీవ్ పేరుతో వెళ్లారు. దీంతో 13 సబ్ రిజిస్ట్రార్కార్యాలయాల్లో ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లు, మిగతా వాటిల్లో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ, డీఆర్ బదిలీల తర్వాత సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఈసారి బదిలీలతోనైనా పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లు వచ్చేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. -
‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
మహబూబాబాద్ రూరల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్ఓలు ఓటర్లకు ఫారా ల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలన్నారు. ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని సరైన సమాచారం అందించాలని కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని, అధికారులు, బీఎల్ఓలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, షెడ్యూలు ప్రకారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు నిర్వహించి పూర్తి సమాచారం అందించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కట్టంచంద్ర రాజేశ్వర్ రావు, బీఎల్ఓ సూపర్వైజర్ కవిత, బీఎల్ఓ కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ బీఎల్ఓల ఇంటింటి ఫారాల పంపిణీ పరిశీలన -
ఓరుగల్లు మేత్రాసనం అభివృద్ధే లక్ష్యం
కాజీపేట రూరల్ : ఓరుగల్లు మేత్రాసనం కేంద్రంగా విశ్వాస ఆధ్మాతిక, విద్య, వైద్య, సాంఘింక రంగాల అభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేయనున్నట్లు ఓరుగల్లు మేత్రాసనం నూతన పీఠాధిపతి బిషప్ దుగ్గింపుడి విజయపాల్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్ గ్రీన్హౌజ్లో మీడియా ఇన్చార్జ్ ఫాదర్ ఎం.జయపాల్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిషప్ విజయపాల్రెడ్డి మాట్లాడారు. ఓరుగల్లు మేత్రాసనం పరిధిలోని 12 జిల్లాల్లో కులమతాలు, ప్రాంతాలు, వర్గాలకతీతంగా ఫాతిమామాత ఆశీర్వాదంతో సకల జనుల ప్రయోజనాలే ధ్యేయంగా పని చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత ఓరుగల్లు మేత్రాసనం విశిష్టమైందని, రోమ్ 14వ లియోపోమ్ తనను 4వ పీఠాధిపతిగా నియమించారని చెప్పారు. 1952లో ఓరుగల్లు మేత్రాసనం ఏర్పడిందని, మొదటి బిషప్గా అల్పోన్స్ బిషప్ బెరెట్టా, 2వ బిషప్గా తుమ్మబాల, 3వ బిషప్గా ఉడుములబాల, 4వ బిషప్గా తాను ఈ నెల 3వ తేదీన పట్టాభిషేకంతోపాటు నూతన వరంగల్ బిషప్స్ హౌజ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్లు తాటికొండ జోసెఫ్, కాసుమర్రెడ్డి, వై.కిరణ్, బాలరాజ్, బ్రదర్ జార్ట్, టామీ, మథ్యాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాత ఆశీర్వాదంతో సకల జనులకు సేవలు బిషప్ విజయపాల్రెడ్డి -
వాగు వద్ద భద్రత పెంచాలి
జంపన్న వాగు పవి త్రంగా భావించి వేలా ది మంది భక్తులు పు ణ్యస్నానాలు ఆచరి స్తారు. భక్తుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉంది. వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగులోకి దిగకుండా భక్తులను మైకుల ద్వారా అప్రమత్తం చే యాలి. భక్తులు కూడా నీటి లోతు తెలియని ప్రాంతాల్లో స్నానాలకు దిగకుండా జాగ్రత్తలు పాటించాలి. అధికారులు భద్రతా ఏర్పా ట్లు కల్పిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చు. – సిద్ధబోయిన స్వామి, సమ్మక్క పూజారి, మేడారం -
శాంతి భద్రతలను పరిరక్షించాలి
మరిపెడ: శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ శబరీష్ పోలీసు అధికారులను ఆదేశించారు. మరిపెడ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు సేవల నాణ్యత, దర్యాప్తు విధానం స్టేషన్ నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్ రికార్డులు, సీడీ ఫైళ్లు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, వివిధ విభాగాల పనితీరు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతను క్షణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ అధికారులతో సమావేశమై పెండింగ్ కేసులు, విచారణ నివేదికల తయారీ, దర్యాప్తు నాణ్యత, సమయపాలనపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ కేసులో చట్టపరమైన విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో సంబంధాలు కొనసాగించాలని సూచించారు. నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, మరిపెడ సీఐ పవన్, ఎస్సై గండ్రాతి సతీష్, అదనపు ఎస్సై మహిబూబి సిబ్బంది పాల్గొన్నారు. -
జంపన్న వాగులో భద్రతేది?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని జంపన్న వాగులో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతీ వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ పుణ్యస్నానాల కోసం వాగులోకి దిగుతున్న భక్తులు నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతీ ఏడాది ఏదో ఒక చోట మునిగి పలువురు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శాశ్వత భద్రతా చర్యలు మాత్రం కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం, సెలవు రోజులు, వారాంతంలో మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది కుటుంబ సమేతంగా జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తుంటారు. వాగులో లోతైన గుంతలు, వేగవంతమైన వరద ప్ర వాహం గురించి అవగాహన లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు సు మారు ఆరుగురు భక్తులు జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు వాగు వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కోరుతున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో మైకుల ద్వారా భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జంపన్న వాగు పవిత్రతతో పాటు భక్తుల ప్రాణ భద్రత కూడా అంతే ముఖ్యమని, ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలే శాశ్వత పరిష్కారమని వారు అభిప్రాయపడుతున్నారు. లోతు తెలియక మునిగి పలువురు భక్తుల మృతి హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి -
మాజీ ఉప సర్పంచ్ దారుణ హత్య
మహబూబాబాద్ రూరల్ : కుటుంబ తగాదాలతో మాజీ ఉప సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ ఎన్.అంజలి తెలిపిన వివరాల ప్రకారం.. సింగారం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్య (57) కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. యాకయ్య కుమారుడు, కుమార్తె హైదరాబాద్లో ఉంటుండగా యాకయ్య మరో మహిళతో విహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య యశోద, ఆయనకు తగాదాలు జరిగాయి. దీంతో నాలుగేళ్లుగా యాకయ్య, యశోద వేర్వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఏం జరిగిందేమో కానీ బుధవారం తెల్లవారుజామున యాకయ్య తన ఇంటి ఆవరణలో నిద్రించి ఉన్న మంచంపై దారుణ హత్యకు గురై కనిపించాడు. దుండగులు మారణాయుధాలతో యాకయ్య ముఖం, తల భాగంలో బలంగా కొట్టి గాయపరచడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సోమయ్య తన కుమారుడు యాకయ్య మృతికి కోడలు యశోద, మరికొంతమంది కారణమని ఆరోపిస్తూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి రూరల్ ఎస్సై రాజు, సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. దర్యాప్తు అనంతరం నిందితుల వివరాలు వెల్లడిస్తామని రూరల్ సీఐ అంజలి తెలిపారు. గ్రామంలో భారీ బందోబస్తు.. యాకయ్య దారుణ హత్యకు గురైన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి యాకయ్య అంత్యక్రియలు పూర్తయ్యే వరకు గస్తీ నిర్వహించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కుటుంబ తగాదాలే కారణం.. సింగారం గ్రామంలో ఘటన వివరాలు వెల్లడించిన పోలీసులు -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
మల్హర్(కాటారం) : మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గత నెల 29 తేదీన జరిగిన భార్య హత్య కేసులో భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిచారు. ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన సత్యంకు రాజమణితో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు రవళి, కుమారుడు మాన్విత్ ఉన్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతుందని ఆగ్రహంతో సత్యం కత్తితో భార్య మెడపై కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, హత్య చేసిన రోజు ధరించిన దుస్తులను పడేసిందుకు బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారి వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులను చూసి పరిగెడుతుండగా సీఐ నాగార్జునారావు, సిబ్బంది పట్టుకున్నారు. కత్తి, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా, హత్య కేసును త్వరగా ఛేదించిన సీఐ నాగార్జునారావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ -
తెగిన ఓహెచ్ఈ వైరు.. ఆలస్యంగా నడిచిన రైళ్లు
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని సిగ్నల్తండా సమీపంలో అప్ లైన్లో ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎక్యూప్మెంట్) లైన్ తెగిపడింది. బుధవారం తెల్ల వారుజామున ఓహెచ్ఈ వైరు తెగి డౌన్లైన్పై పడడంతో రెండు మార్గాల్లో విద్యుత్ సరఫరా నిలిచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మహబూబాబాద్, డోర్నకల్, భద్రాచలం రోడ్ మార్గంలో పలు ఎక్స్ప్రెస్తో పాటు గూడ్సు రైళ్లు నిలిచాయి. ఓహెచ్ఈ సిబ్బంది స్పందించి మొదట డౌన్లైన్ మార్గంలో ఓహెచ్ఈ కేబుల్కు మరమ్మతులు చేసిన అనంతరం 50 నిమిషాల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. అనంతరం అప్లైన్లో సుమారు 3.30 గంటలపాటు శ్రమించి కేబుల్కు మరమ్మతులు చేసి ఉదయం 7.30 గంటలకు రైళ్లను పునరుద్ధరించారు. ఓహెచ్సీ కేబుల్ తెగి విద్యుత్ సరఫరా నిలిచి ఎక్కడి రైళ్లు అక్కడ నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక కోర్టులు● సీజీఆర్ఎఫ్ వరంగల్ చైర్మన్ నాగ ప్రసాద్ హన్మకొండ: విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక కోర్టులు నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ వరంగల్ చైర్మన్ నాగప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత రోజున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల3న మహబూబాబాద్ జిల్లా మరిపెడ డివిజన్ 33/11 కేవీ కొత్తపేట సబ్స్టేషన్లో కొత్తపేట, కురవి, డోర్నకల్, గార్ల, సీరోల్ మండలాలు, 7న హనుమకొండ రూరల్ డివిజన్ పరకాల రూరల్ 33/11 కేవీ సబ్స్టేషన్లో పరకాల రూరల్, ఆత్మకూరు, దామెర, శాయంపేట, పరకాల టౌన్, 9న భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ కొయ్యూరు 33/11 కేవీ సబ్ స్టేషన్లో కొయ్యూరు, కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, పలిమెల, 14న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ డివిజన్ కాల్వ శ్రీరాంపూర్ సబ్డివిజన్లోని శ్రీరాంపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్లో శ్రీరాంపూర్, పోత్కపల్లి, ఓదెల, 17న ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ డివిజన్, కూసుమంచి సబ్ డివిజన్లోని రాజేశ్వరాపురం 33/11 కేవీ సబ్ స్టేషన్లో రాజేశ్వరాపురం, పాలేరు, నేలకొండపల్లి, కూసుమంచి, బచోడు సెక్షన్ పరిధిలోని వినియోగదారులు ఈ లోకల్ కోర్టులో ఫిర్యాదులు సమర్పించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. బాలుడిపై పోక్సో కేసు నమోదు ఖిలా వరంగల్ : బాలికపై లైంగిక దాడికి పా ల్పడిన ఓ బాలుడిపై పోక్సో నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. వరంగల్ ఏనుమాముల పీ ఎస్ పరిధిలో గత నెల 26న మధ్యాహ్నం ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఓ బాలుడు వెళ్లాడు. అనంతరం సదురు బాలిక చెల్లికి డబ్బు ఇచ్చి కిరాణం పంపించా డు. దుకాణం నుంచి వచ్చిన చెల్లి ఈ ఘటనను చూసి కేకలు వేయడంతో సదరు బాలుడు అ క్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బా ధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పో క్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో పరారీలో ఉన్న బాలుడు బుధవారం పోలీసులకు చిక్కాడు. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
దూరవిద్య డిగ్రీ , పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ)లో 2026–2027 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్లాల్ బుధవారం తెలిపారు. ఈనెల 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీవరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కేయూ దూరవిద్య వెబ్సైట్లో కోర్సులు, వ్యవధి, విద్యార్హతలు, బోధనామాధ్యమం, అర్హతలు, ఫీజుల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో నిర్ణీత ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు. చిరుత పులి అడుగుల ఆనవాళ్ల పరిశీలన గూడూరు: గూడూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తోటదస్రుతండా సమీప మామిడితోటలోకి మంగళవారం రాత్రి చిరుత పులి వచ్చినట్లు ప్రచారమైంది. దీంతో బుధవారం ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు సిబ్బందితో వెళ్లి మామిడితోటలో చిరుతపులి అడుగుల ఆనవాళ్లను పరిశీలించారు. రాత్రి మోస్తరు వర్షం కారణంగా ఆనవాళ్లు సరిగా కనిపించడం లేద ని, మొత్తానికి చిరుత రావొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి ఒంటరిగా వె ళ్లొద్దన్నారు. ఎక్కడైనా చిరుత కనిపిస్తే తమకు సమాచారం అందించాలని ఎఫ్ఆర్వో కోరారు. -
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి కురవి: విద్యార్థుల హాజరుశాతం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి సూచించారు. బుధవారం మండలంలోని రాజోలు జెడ్పీ హైస్కూ ల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, అన్ని తరగతి గదులను సందర్శించి పరిశీలించారు. అన్ని రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై సూచనలు, సలహాలు అందజేశారు. ప్రతీ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు..
● వ్యక్తి మృతి..దొడ్లగడ్డతండాలో ఘటన నర్మెట: బైక్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జనగామ జిల్లా నర్మెట మండలం హ న్మంతాపురం శివారు దొడ్లగడ్డతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన హేమ్లానాయక్ (55) బైక్పై తండాలోని బంధువుల ఇంటికెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా సిద్దిపేట జిలా మద్దూరు మండలం లద్నూర్కు చెందిన రాపాక రాజు తనకారులో నర్మెట నుంచి జనగామ వెళ్తూ బైక్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హేమ్లానాయక్ను స్థానికులు, కుటుంబీకులు నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నైనాల నగేశ్ తెలిపారు. -
అంగన్వాడీలా
సాక్షి, మహబూబాబాద్: బాలికా సంరక్షణ, మాతా,శిశుసంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ప్రధానంగా పిల్లలను కిడ్స్ సెంటర్లకు పంపించడంతో అంగన్వాడీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దీంతో గర్భిణులు, బాలింతల నమోదుతోనే కేంద్రాలు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ప్రీ స్కూల్స్ ప్రారంభిస్తే అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు ఉండడం కష్టమే అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తగ్గుతున్న పిల్లలు.. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్లడం.. మూడు సంవత్సరాల నిండక ముందే పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. దీంతో ఏటేటా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తుగ్గుతోంది. మూడు సంవత్సరాల క్రితం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 40వేలకు పైగా ఉండేవారు. కానీ, ఇప్పుడు 34,012 మంది మాత్రమే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ లెక్కలో కూడా మరో రెండు, మూడు వేలు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 1,437 సెంటర్లు ఉండగా ఇందులో.. ఐదు సెంటర్లు పిల ్లలు లేనివి ఉన్నాయి. ఐదుగురు పిల్లల వరకు ఉన్న కేంద్రాలు 24, పదిలోపు మంది పిల్లలు ఉన్నవి 79 ఉండగా, 15 మంది లోపు ఉన్నవి 198 సెంటర్లు, 20 మందిలోపు పిల్లలు ఉన్న సెంటర్లు 164 ఉన్నాయి. ప్రీ స్కూల్స్ వస్తే... ఇప్పుడే ఇలా ఉంటే ప్రీస్కూల్స్ ఏర్పాటు చేస్తే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య మరింత పడిపోతుంది. సెంటర్లు నడవడం ప్రశ్నార్థకంగా మారుతుందని అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సెంటర్లనే ప్రీ స్కూల్స్గా మార్చాలని, ప్రస్తుతం బోధిస్తున్న టీచర్లకే బాధ్యతలు అప్పగించాలని ఉద్యో గ సంఘాల ఆద్వర్యంలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్ అర్హతతో ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు జిల్లాలో 76 ప్రీ స్కూల్స్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావొస్తుంది. ఇందులో పనిచేందుకు డిగ్రీ, డీఈడీ, బీఈడీ, పీజీలతోపాటు, ఇంజనీరింగ్ చదివిన వారు కూడా పోటీ పడడం గమనార్హం. పిల్లలు సెంటర్లు11-15 19806-10 7916-20 16405 2420కి పైగా 968రెండు సెంటర్లు ఒకేచోట నడుస్తున్న తుమ్మల చెరువుతండా అంగన్వాడీ సెంటర్అంగన్వాడీ సెంటర్లలో తగ్గుతున్న పిల్లల నమోదు గర్భిణులు, బాలింతలతోనే సెంటర్ల కొనసాగింపు ప్రీ స్కూల్స్ ప్రారంభిస్తే మరింత ప్రభావం ఉంటుందని టీచర్ల ఆందోళనపిల్లల వివరాలుపిల్లల సంఖ్యకు అనుగుణంగా సెంటర్లుఅంగన్వాడీ సెంటర్లలో పిల్లల సంఖ్య తగ్గుతున్న విషయం వాస్తవమే. అయితే పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకొని సెంటర్ల నిర్వహణ ఉంటుంది. తక్కువ మంది పిల్లలు ఉన్న సెంటర్లను సమీపంలోని ఉన్న సెంటర్లో కలిపి అందరు కలిసి బోధించేలా చర్యలు తీసుకుంటున్నాం. సెంటర్కు సెంటర్కు మధ్య దూరం ఎక్కువగా ఉంటే పిల్లలు లేకపోయినా గర్భిణులు, బాలింతలకోసం సెంటర్ నిర్వహిస్తున్నాం. – శిరీష, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ -
రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం..
రైలు పట్టాల వెంట నిఘా పెట్టాం. రైలుపై రాళ్లు విసిరితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. పట్టాల సమీప కాలనీల ప్రజలు నిరంతరం రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పశువులను వదిలేయడం, రైలు ట్రాక్ నుంచి మరో ట్రాక్పై వెళ్లినా, పట్టాలపై చిన్నపిల్లలు ఆటలు ఆడటం అత్యంత ప్రమాదకరం. వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నాం. రైలు భద్రత ప్రయాణికులు, ప్రజల భద్రత అని అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీనివాస్గౌడ్ ఇన్స్పెక్టర్ ఆర్పీఎఫ్ వరంగల్ -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
పసరగొండ క్రాస్ వద్ద.. దామెర: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన పెండ్లి అనుదీప్ (18) తన మిత్రుడు హరీశ్తో కలిసి బైక్పై హనుమకొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో పసరగొండ క్రాస్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఆటోను సడన్గా ఆపడంతో బైక్ ఆటోను ఢీ కొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు కిందపడ్డారు. అనుదీప్ తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అనుదీప్ అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఆటో డ్రైవర్ మాల్లారెడ్డి అనిల్ రెడ్డి రోడ్డు భద్రత సూచనలు పాటించకపోవడంతో ప్రమాదం జరిగిందని, మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో హరీశ్కు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా మృతుడి తండ్రి ప్రభాకర్ మూడు నెలల క్రితం కెనాల్లో పడి మృతిచెందాడు. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మేక పిల్ల కోసం వెళ్లి మహిళ.. బచ్చన్నపేట : మేతకు తోలుకుపోయిన మేక పిల్ల నీటి కొలనులో పడగా రక్షించడానికి వెళ్లిన కాపరి ప్రమాదవశాత్తు అదే కొలనులో పడి మృతి చెందిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్నరామన్చర్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నరామన్చర్ల గ్రామానికి చెందిన గుండా ఉపేందర్ భార్య వాణి (33) తమ మేకలను మేతకు తీసుకెళ్లింది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన గుర్రాల నర్సిరెడ్డి వ్యవసాయ భూమిలోని ఫారం ఫండ్ నీటిలో మేక పిల్ల పడింది. గమనించిన వాణి మేక పిల్లను రక్షించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మృతి చెందింది. గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. గ్రామంలో నీటి గుంతను తవ్విన గుర్రాల నర్సిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల నాయకుడు రామగళ్ల అశోక్ డిమాండ్ చేశారు. గుంత చుట్టూ ఫెన్సింగ్ వేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. టిప్పర్, బైక్ ఢీ.. ఒకరు.. నెక్కొండ: ఎదురెదురుగా వస్తున్న టిప్పర్, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెంది సంఘటన మండలంలోని వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, 6వ వార్డు సభ్యురాలు శ్యామల భర్త సొల్లేటి సునీల్ (40) ఉదయం నెక్కొండకు పనినిమిత్తం వచ్చి, తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అప్పల్రావుపేట ఊర చెరువు మీద నుంచి వెళ్తున్న క్రమంలో మూలమలుపు వద్ద టిప్పర్ అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నెక్కొండ సీఐ శ్రీనివాస్, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని నర్సంపేటలోని మార్చరీకి తరలించారు. సునీల్కు భార్య శ్యామల, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని ఎస్సై పేర్కొన్నారు. -
మేడారం హుండీ ఆదాయం రూ.63,70,531
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీల ద్వారా 99 రోజుల్లో రూ.63,70,531 ఆదాయం సమకూరినట్లు మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి జూన్ 30 వరకు గద్దెలపై ఉంచిన మొత్తం 40 హుండీల్లోని కానుకలను మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ డార్మెటరీ భవనంలో పూజారుల సమక్షంలో లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీ ఆదాయం రూ.34,05,959, సారలమ్మ హుండీ ఆదాయం రూ.25,59,430, గోవిందరాజు హుండీ ఆదాయం రూ.2,26,266, పగిడిద్దరాజు హుండీ ఆదాయం రూ.1,78,876 వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతి, ఇన్స్పెక్టర్ అనిల్, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, సారయ్య, మునీందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. ‘భద్రకాళి’ ఆదాయం రూ.85,03,997 హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలోని హుండీల్లోని కానుకలను లెక్కించగా.. రూ.85,03,997 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. మూడు నెలల ఆరు రోజుల్లోలకు సంబంధించి కానుకను మంగళవారం యూనియన్ బ్యాంక్లో జమ చేసినట్లు తెలిపారు. 200 యూఎస్ఏ డాలర్లు, 260 కెనడా డాలర్లు, 30 యూఏఈ దిరమ్స్, 30 ఇంగ్లండ్ పౌండ్స్, 300 ఓమన్, 2 సింగపూర్ డాలర్లు భక్తులు హుండీల్లో వేసినట్లు గుర్తించామని తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షాణాధికారిగా దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ ఉప కమిషనర్ కార్యాలయ పర్యవేక్షకులు గౌరీశంకర్ వ్యవహరించారు. అర్చకులు భద్రకాళిశేషుతోపాటు ఆలయసిబ్బంది, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి జి.నవీన్, 200 మంది సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
మహబూబాబాద్ అర్బన్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మదర్థెరిస్సా సెంటర్లో మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకులు కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలలో చెలగాటమాడుతుందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 పేపర్లు లీకై నట్లు ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోయారని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు, రాష్ట్ర నాయకులు దాసుగాని సుమ, జిల్లా నాయకులు రాకేష్, వీరేందర్, ఉదయ్, మహేష్, ఆకాష్, చందు, పవన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
రైలింజన్లో సాంకేతిక లోపం
● పలు స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు డోర్నకల్: రైలింజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచాయి. వివరాలిలా ఉన్నాయి. నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్(20809) రైలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుండ్రాతిమడుగు స్టేషన్ సమీపించగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు స్టేషన్లో నిలిచింది. దీంతో మనర్గుడి–జోద్పూర్ ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు–దానాపూర్ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లలో సుమారు 40 నిమిషాల పాటు నిలిచాయి. భద్రాచలంరోడ్–సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్ డోర్నకల్ సమీపంలోని బ్రాంచ్లైన్లో గంట సేపు నిలవగా, తమిళనాడు, సహారా, ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లు పలు స్టేషన్లలో నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామను బాత్రూంలో నిర్బంధించిన కోడలు● కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం నర్సంపేట రూరల్: స్నానం కోసం బాత్రూంకు వెళ్లిన మామ బయటకు రాకుండా కోడలు గడియపెట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేటలోని వరంగల్ రోడ్డులో రంగారెడ్డి నివసిస్తున్నాడు. అయితే, ఆయనకు తన కోడలు డాక్టర్ నవతతో ఆస్తి, కుటుంబ తగాదాలున్నాయి. స్నానానికి బాత్రూంకు ఆ యన వెళ్లగా కోడలు బయట గడియపెట్టి నిర్బంధించింది. దీంతో రెండు గంటలు బయటకు రాలేకపోయాడు. ఆయన అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి రంగారెడ్డిని బాత్రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. ఒక విద్యార్థిని.. ఒక ఉపాధ్యాయుడుబయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి పంచా యతీ పరిధిలోని కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విచిత్ర సన్నివేశం కనిపించింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఆ పాఠశాలలో ఈ ఏడాది ఇద్దరు విద్యార్థులు మాత్రమే పేరు నమో దు చేసుకున్నారు. వీరిలో రెండో తరగతి విద్యార్థిని మాత్రమే పాఠశాలకు హాజరుకాగా.. పక్కనే ఉన్న అంగన్వాడీ చిన్నారితో కలిపి ఉపాధ్యాయుడు బోధించారు. వ్యక్తి మృతికి కారణమైనవారి అరెస్ట్ చిట్యాల: మానేరు వాగులో విద్యుత్ వైర్తో చేపలు పడుతూ ఇటీవల మేకల రాజు అనే వ్యక్తి మృతి చెందిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మల్లేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వెళ్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 28 మండలంలోని కాల్వపల్లికి చెందిన మనబోతుల రఘుపతి, భూక్యా సమ్మయ్యలతోపాటు మరో ఇద్దరు మైనర్లు చేపలు పట్టేందుకు వెళ్తూ మేకల రాజును తీసుకెళ్లారు. ఈ క్రమంలో వ్యవసాయ మోటార్ స్టార్టర్ నుంచి అక్రమంగా విద్యుత్ సరఫరా తీసుకుని నీటిలో తీగ సాయంతో కరెంట్ షాక్ పెట్టి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంలో రాజు మృతి చెందాడు. ఈ మేరకు నలుగురు నిందితులు కలిసి మంగళవారం గిద్దెముత్తారం సమీపంలో బెయిల్ కోసం ప్రయత్నించేందుకు వెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితుల నుంచి విద్యుత్ వైర్ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గూడూరు రేంజ్ అడవిలో చిరుత గూడూరు: వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధి గ్రామాల్లో సంచరిస్తున్న చిరుతపులి మంగళవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలోనికి వచ్చినట్లు ఎస్సై బి.గిరిధర్రెడ్డి, ఎఫ్ఆర్వో జి.ప్రసాదరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఖానాపురం మండలం రాగంపేట సమీపంలో సంచరించిన చిరుత మంగళవారం రాత్రి గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు తోటదస్రు తండా, మర్రిమిట్ట జీపీ, గూడూరు ప్రాంతాల్లోకి చేరుకున్నట్లు తెలిపారు. తోటదస్రు తండా సమీపంలోని ఓ మామిడి తోటలో చిరుత సంచారంతో కుక్కలు అరిచాయని, చిరుత రోడ్డు దాటుతుండగా చూసిన ఓ వ్యక్తి సమాచారంతో చిరుత ఆ ప్రాంతంలో ఆనవాళ్లు గుర్తించడానికి వెళ్లగా వర్షం కారణంగా గుర్తులు కనిపించలేదని ఎఫ్ఆర్వో ప్రసాదరావు తెలిపారు. కాశిబుగ్గ: డాక్టర్స్ డే సందర్భంగా వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో నగరానికి చెందిన 10 మంది ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేశారు. వరంగల్ ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు వారిని సన్మానించి ఉత్త మ డాక్టర్ అవార్డులు అందజేయనున్నారు. ఎస్.గోపినాఽథ్, ఎ.అప్ప య్య, బి.రాధాకృష్ణ, ఎం.పుల్లారెడ్డి, జి.చంద్రశేఖర్, బేతి కవిత, పి.అశోక్కుమార్, జలగం మాధవి, అజిత్ మహ్మద్, జలగం కావ్యారావు ఉత్తమ డాక్టర్ అవార్డులు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాద్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్, ఎంజీఎం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి, డీఎంహెచ్ఓలు డాక్టర్ ఎస్డీ రాంకుమార్, డాక్టర్ బి.సాంబశివరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి పాల్గొంటారు. -
రూ.277.61కోట్ల నిధులు జమ
● 2,28,887మంది రైతులకు లబ్ధి ● రైతు భరోసా సదస్సులో ఎమ్మెలే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలోని 2,28,887మంది రైతులకు రూ.277.61కోట్ల నిధులు జమ అవుతాయని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు సదస్సు మాట్లాడారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మానుకోట రైతు వేదిక నుంచి ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, డీఏఓ విజయచంద్ర, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, ఏడీఏ శ్రీనివాసరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, ఏఓ తిరుపతిరెడ్డి వీక్షించారు. ఏటా ప్రతీ రైతుకు ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బొల్లు రాజు, చిదిరాల అరుణజ్ఞానేశ్వర్, గాడిపల్లి లావణ్యచరణ్, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ఉద్యాన అధికారులు, సెరీకల్చర్ అధికారులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. -
పల్స్పోలియో విజయవంతం
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: జిల్లాలో మూడు రోజుల పాటు చేపట్టిన పల్స్పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్పోలియో చుక్కలు వేశామన్నారు. 77,355 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు. మొదటి రోజు 469 కేంద్రాల్లో 73,570 మందికి, రెండో రోజు ఇంటింటి సర్వే ద్వారా 2,456మందికి, మూడో రోజు 1,329 మంది చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్లు కె.స్వామి, ఏ.పురుషోత్తం, శ్రీనివాస్, ఎల్డీ కంప్యూటర్ అరుణ్, రాజ్యలక్ష్మి, రాజ్కుమార్, లింగారెడ్డి పాల్గొన్నారు. -
ఏరు.. కన్నీరు
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026జిల్లాలోని ఆనకట్టలు, చెక్ డ్యామ్ల వివరాలువాగు ఆనకట్టలు చెక్డ్యామ్లు ఆకేరు 02 12 మున్నేరు 03 15 పాలేరు 04 20 మొత్తం 09 47సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఆకేరు, మున్నేరు, పాలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. వీటితోపాటు చెరువులు, కాల్వల ద్వారా మొత్తం 1,52,222 ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే ఇందులో తొమ్మిది ఆనకట్టల పరిధిలో 6,508 ఎకరాలు, 47 చెక్డ్యామ్ల పరిధిలో 6,950 ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు జిల్లాలోని కొమ్ములవంచ, ఉగ్గంపల్లి ఆనకట్టలు, అమ్మపాలెం, కొమ్ములవంచ, జయపురం, ముంగిమడుగు, ఉగ్గంపల్లి చెక్డ్యామ్ల్లో కొన్ని తెగిపోవడం, మరికొన్ని మరమ్మతులకు గురికా వడం, గేట్లు పాడవ్వడంతో నీరు నిల్వడం లేదు. వీటితోపాటు కొత్తగా మరికొన్ని కొత్త చెక్డ్యామ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ. 170కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇందులో కొన్నింటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించగా.. మరికొన్నింటిని మాత్రం పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. దీంతో వేసవిలో ఎస్సారెస్పీ నుంచిజలాలు విడుదల చేసినా తెగిన చెక్డ్యామ్లలో నిల్వ లేదు. ఇసుక కోసమే జాప్యమా.. జిల్లాకు మణిహారంగా ఉన్న ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల నుంచి ఇసుక విరివిగా లభిస్తుంది. ఎగువ భాగంలో కురిసిన నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంచేందుకు విరివిగా చెక్ డ్యామ్లు నిర్మించారు. అయితే తెగిన చెక్డ్యామ్లు, ఆనకట్టల మరమ్మతులు చేస్తే నీరు నిల్వ ఉంటుంది. ఆనకట్టలు, చెక్డ్యామ్ల పరిధిలోని ఆయకట్టే కాకుండా.. చుట్టూ కిలోమీటరు పరిధి వరకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. వీటి ఆధారంగా వేలాది ఎకరాల భూములు బోర్లు, బావుల ద్వారా సాగు చేసుకుంటారు. అయితే సంవత్సరాల తరబడి తెగిన చెక్ డ్యామ్లు, ఆనకట్టలు మరమ్మతులు చేయకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ లభించే ఇసుక అని ఆరోపణలు వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల అనుచరులు ఇసుక దందా చేయడం పరిపాటి. ఇందుకోసమే చెక్డ్యామ్లు, ఆనకట్టలు మరమ్మతులు చేస్తే నీరు నిలిచి ఇసుక తీసేందుకు అవకాశం ఉండదు. అందుకోసమే మరమ్మతులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తెగిన ఆనకట్టలు, చెక్డ్యామ్ల మరమ్మతులు చేయాలని, రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆనకట్ట మరమ్మతులు చేయాలి నాకు ఆకేరువాగు పక్కనే మూడెకరాల పొలం ఉంది. ప్రతీ ఏడాది వానాకాలం, యాసంగి పంటలు పండేవి. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగుకు వరద పోటెత్తి కుడి ఆనకట్టకు గండిపడి నీరంతా వృథాగా పోతోంది. వాగులో నీళ్లు లేకపోవడంతో భూగర్భజలాలు పడిపోయి బావులు, బోర్లు అడుగంటుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెక్ డ్యామ్ కుడి ఆనకట్టకు మరమ్మతులు చేయాలి. అప్పుడే పంటలు పండుతాయి. –జుజ్జూరి వెంకన్న, రైతు, ఉగ్గంపల్లి తెగిన ఆనకట్టలు, చెక్డ్యామ్లకు మరమ్మతులు కరువు ఎస్సారెస్పీ, వర్షపు నీరు గంగపాలు నీరు లేక ఎడారిని తలపిస్తున్న ఆకేరువాగు భూగర్భజలాలు ఇంకిపోవడంతో రైతుల ఆందోళన నాయకులు స్పందించాలని వేడుకోలునాడు జలకళ.. నేడు వెలవెల బయ్యారం మండలంలోని అల్లిగూడెం–భీమ్లాతండా మధ్య ఉన్న పందిపంపుల వాగు ఇది. గంగారం మండల పరిధిలో వర్షం కురిస్తే ఈ వాగు ద్వారా వరదనీరు బయ్యారం పెద్ద చెరువులోకి చేరుతుంది. కాగా, గత ఏడాది జూన్ నెలలో నిండా నీటితో వాగు ప్రవహించగా.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల వాగు వెలవెలబోయి కనిపిస్తోంది. –బయ్యారం బావులు ఎండిపోయాయి.. ఆకేరు వాగు పక్కన ముంగిమడుగులో రెండు ఎకరాల భూమి ఉంది. చెక్డ్యామ్ తెగిపోవడంతో వాగులో నీరు నిల్వకపోవడంతో బావిలో నీళ్లు లేవు. నారు పోసుకోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. తెగిన చెక్ డ్యామ్కు మరమ్మతులు చేయడం మర్చిపోయారు. మరమ్మతులు చేస్తేనే మా వ్యవసాయ సాగుతుంది. లేకపోతే ఇబ్బందులే. –గుగులోత్ పోట్యా నాయక్, పకీర తండా -
మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
వరంగల్ అర్బన్: వేధింపులు తాళలేక ఓ మహిళా ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. ఏడాది క్రితం నర్సంపేట మున్సిపాలిటీ నుంచి శాశ్వత ఉద్యోగి శ్రుతి వరంగల్ బల్దియాకు బదిలీపై వచ్చి డిప్యుటేషన్పై ఇన్వార్డు సెక్షన్లో విధులు నిర్వర్తిస్తోంది. ఇన్వార్డులో నమోదవుతున్న ఫైళ్లను సకాలంలో ఆయా విభాగాలకు పంపించకపోవడంతో అదనపు కమిషన్ ఇసంపల్లి జోనా, సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్.. ఇన్వార్డు సెక్షన్ సిబ్బందిని సోమవారం పిలిచి క్లాస్ తీసుకున్నారు. కొత్త కమిషనర్ ఫైళ్లపై సమీక్షిస్తే ఏం సమాధానం చెబుతారని మందలించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రుతి నర్సంపేట మండలంలోని తన ఇంటికి వెళ్లి అల్లోపతి మాత్రలను మింగింది. కుటుంబ సభ్యులు ఆమెను నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఓ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కింది. తాను మాత్రమే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నానని, అక్కడి నుంచి అంతర్గత బదిలీ చేస్తామంటూ బెదరింపులకు పాల్పడడంతో ఇంట్లో ఉన్న అల్లోపతి మాత్రలను మింగినట్లు వెల్లడించింది. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్, అటెండర్ చందన తనపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం శ్రుతి ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్లు తెలిసింది. ఈ విషయంపై బల్దియా కమిషనర్ వెంకన్న మంగళవారం ఆరా తీశారు. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్ వివరణ సమర్పించినట్లు తెలిసింది. ఈ ఘటనపై అడిషనల్ జోనా, సూపరింటెండెంట్ ఆనంద్ను వివరణ కోరగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం తగదని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించినట్లు తెలిపారు. ఇదేకాకుండా సీ–1 సెక్షన్ సూపరింటెండెంట్ ఆనంద్ తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఇటీవల తొర్రూరు మున్సిలిటీ హెల్త్ అసిస్టెంట్ వాయిస్ రికార్డు చేసిన సంఘటన వైరల్గా మారింది. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలి ● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకేయూ క్యాంపస్: సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అండర్ స్టాండింగ్ డ్రవిడియన్ సొసైటీ అండ్ పాలిటిక్స్’ అనే పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఏడాది మే 9, 10 తేదీల్లో నిర్వహించిన సదస్సుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను పుస్తకం రూపంలోనికి తీసుకురావడం ఎంతో ప్రయోజనకరమన్నారు. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ కృష్ణయ్య, పీవీ నర్సింహారావు నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాలాకుల కొమురయ్య, ద్రవిడ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు, ఉపాధ్యక్షుడు సోమలింగం, సహాయ కార్యదర్శి నరేష్కుమార్, కోశాదికారి డాక్టర్ ప్రశాంత్, కార్యవర్గసభ్యులు సురేష్, లీలావతి, పరిశోధక విద్యార్థిని రుబీనా పాల్గొన్నారు. -
టాస్క్ సెంటర్కు అడుగులు
మహబూబాబాద్: నిరుద్యోగ యువతలో నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలో భవనాల పరిశీలన పూర్తి చేశారు. ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి పలు కంపెనీలు ఇంటర్వ్యూలు ద్వారా చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో టాస్క్ సెంటర్లు కొనసాగుతున్నాయి. త్వరలో మానుకోటలో ఏర్పాటవుతుంది. భవనాల పరిశీలన.. జిల్లా కేంద్రంలో టాస్క్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తొర్రూరురు రోడ్డులో, ఈదులపూసపల్లి రోడ్డులోని రెండు భవనాలను టాస్క్ రీజినల్ మేనేజర్ సునీల్ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి పరిశీలించారు. కలెక్టర్ స్నేహశబరీష్ ఫైనల్ చేయనున్నట్లు వారు తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ, ఉపాధి కల్పనశాఖ సమన్వయంతో పని చేస్తుంది. జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇప్పటికే 6,536 మంది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేంద్రంలో ఇచ్చే శిక్షణలు.. కేంద్రంలో సెంటర్ మేనేజర్, ట్రైనర్ ఉంటారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. శిక్షణ ఇచ్చే కోర్సులు వారం నుంచి ఆరు నెలల వరకు ఉంటాయి. బ్యాంకింగ్, ఐసెట్, నెట్ వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్, ఐటీ కోర్సు, కమ్యూనికేషన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఎంఎస్ ఆఫీస్ డెవలప్మెంట్, పరిశ్రమల అవసరాలు తదితర వాటిపై శిక్షణ ఇస్తారు. యువత నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా టాస్క్ పని చేస్తుంది. ఆర్గనైజేషన్ అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఉపాధి అవకాశాలు.. ఆసెంటర్ ద్వారా శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్స్ ఇస్తారు. అలాగే హైదరాబాద్లోని పలు కంపెనీలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్లేస్మెంట్ ఇప్పించి భరోసా కల్పిస్తారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. యువత సద్వినియోగం చేసుకోవాలి యువత టాస్క్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే దరఖాస్తుల సంఖ్య బట్టి కేంద్రంలో ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు ఉండగా మానుకోటలో మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణతో పాటు ఉపాధి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. – శ్రీమన్నారాయణరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జిల్లాలో ఏర్పాటుకు కసరత్తు భవనాల పరిశీలన పూర్తి యువతకు నైపుణ్యాలపై శిక్షణ.. ఉపాధి అవకాశాలు టాస్క్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహణ -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు, రక్షణే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆపరేషన్ ముస్కాన్ 12వ విడత పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఒక చిన్నారిని రక్షించడమంటే ఒక కుటుంబంలో మళ్లీ వెలుగులు నింపినట్లే అన్నారు. నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ఇటుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న బాలలను, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షించి వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వద్దకు చేర్చడమే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో బాలకార్మికులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్స్టేషన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఎస్.నాగవాణి, డీఎస్పీ గండ్రతి మోహన్, సీఐ హతీరాం, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆదివాసీ చరిత్రపై పరిశోధనలు కొనసాగిస్తాం’
ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీ జాతి అస్తిత్వం, చరిత్ర పరిరక్షణకు పురావస్తు ఆనవాళ్లు, రాతి చిత్రాలు, పురాతన కట్టడాలు, కోయ, నాయక్పోడు, గోండు తెగల ఇలవేల్పులపై పరిశోధనలు నిరంతరం కొనసాగిస్తామని సమ్మక్క–సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ బుగ్గ కోటేశ్వరరావు తెలిపారు. మండల పరిధిలోని కామారంలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న పరిశోధనలకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆసక్తి వ్యక్తం చేసిందని తెలిపారు. కోయ తెగ ఇలవేల్పుల చరిత్రకు సంబంధించిన వివరాలను తమ సంస్థ నుంచి అధికారికంగా పంపించాలని కోరినట్లు వెల్లడించారు. అలాగే సింధు నాగరికత, కోయ సమాజ సాంస్కృతిక చిహ్నాలపై తాము సమర్పించిన నివేదిక ఆధారంగా మరింత అధ్యయనం చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలో ఏఎస్ఐ బృందం మేడారం సందర్శించి సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడంతో పాటు తమ పరిశోధన బృందంతో సింధు లిపిపై చర్చించే అవకాశం ఉందన్నారు. కోయ జాతి చరిత్ర అత్యంత ప్రాచీనమైందనే అంశాన్ని పరిశోధనల ద్వారా వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ సమావేశంలో పరిశోధన కేంద్రం కోఆర్డినేటర్ సోడే శ్రీరామ్, ఆలం సుధీర్, కలివేటి పవన్, పోలెపోయిన దిలీప్, గొంది రాకేశ్, గట్టుపల్లి అర్జున్, కుంజ కృష్ణప్రసాద్, కొమరం రవి పాల్గొన్నారు. -
కురవి రోడ్డులో గుంతల పూడ్చివేత
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని రోడ్లు కొద్దిపాటి వర్షానికే చిత్తడవుతున్నాయి. రోడ్లు గుంతలమయం కావడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను ప్రస్తావిస్తూ సాక్షి దినపత్రికలో ఈనెల 29న ‘చినుకు పడితే చిత్తడే..’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎన్హెచ్ అధికారులు స్పదించారు. మంగళవారం కురవి రోడ్డులో జాతీయ రహదారిపై గుంతలను పూడ్చివేశారు. గిరిజనులకు బీజేపీ చేసింది శూన్యం మహబూబాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గిరిజనుల అభివృద్ధికి కృషి చేసినట్లు మాట్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు చేసింది శూన్యమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీ, కాంగ్రెస్కు లేదన్నారు. దేశ రాజధానిలో సేవాలాల్ భవన్ నిర్మాణం చేసి అధికారికంగా జయంతిని నిర్వహించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ గిరిజనులను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు యాత్రలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన గార్ల: గార్ల సమీపంలోని పాకాల ఏటిపై నిర్మించే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆర్అండ్బీ డీఈ కృష్ణమోహన్ మంగళవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. వర్షాలు పడి ఏరు వచ్చే లోపే బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లా అటవీ అధికారిగా లావణ్య మహబూబాబాద్ రూరల్: జిల్లా అటవీ శాఖ అధికారిగా భూక్య లావణ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న విశాల్ బత్తుల వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ శాఖ అధికారిగా పనిచేస్తున్న భూక్య లావణ్య బదిలీపై రానున్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2026–27విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఏఓ సత్యనారాయణమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, నేటి నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు మండలంలోని ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. మహాగ్రంథం భగవద్గీత హన్మకొండ కల్చరల్ : భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదని విలువలతో జీవించడానికి మార్గదర్శకమైన మహాగ్రంథమని అభయ హిందూ సేన అధ్యక్షుడు శ్రీశ్రీ రాధామనోహర్ దాస్ ఉద్భోదించారు. మంగళవారం రాత్రి వేయిస్తంభాల దేవాలయాన్ని రాధామనోహర్ దాస్ సందర్శించారు. -
రైళ్లతో ఆటలొద్దు.. జాగ్రత్త
ఖిలా వరంగల్: రైలు ప్రయాణాన్ని మరింత సురక్షి తం చేయడానికి, వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవారి ఆగడాలను నియంత్రించడానికి వరంగల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థతో చెలగాటమాడినా, రైలు పట్టాలపై పశువులను నిర్లక్ష్యంగా వదిలేసినా, రైలు పట్టాల వెంట పిల్లలు, ప్రయాణికులపై రాళ్లు రువ్వినా, కాలనీల ప్రజలు అజాగ్రత్తగా దాటేందు కు ప్రయత్నించినా, అనవసరంగా అలారం గొలు సు లాగినా, చట్టపరంగా కఠిన చర్యలుంటాయని తాజాగా వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు. సిగ్నల్ వ్యవస్థ సున్నితం.. రైళ్ల రాకపోకలను నియంత్రించే సిగ్నల్ వ్యవస్థ అత్యంత సున్నితమైంది. కొన్నిచోట్లా కొంతమంది ఆకతాయిలు, దుండగులు తెలిసీతెలియక తీగలను ధ్వంసం చేస్తారు. దీంతో లోకో పైలట్లకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. దీని వల్ల రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చే ప్రమాదం ఉంది. అలా చేయడం వందలాది మంది ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని అంటున్నారు. అనవసరంగా చైన్ లాగితే నేరం.. ప్రయాణ సమయంలో రైలును అత్యవసరం వేళ ఆపడానికి ప్రతి బోగీలోనూ అలారం చైన్ ఉంటుంది. దీనిని అనవసరంగా లాగితే జరిమానాతోపాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్యలు ఇలా.. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం తొలిసారి నేరం చేస్తే రూ.వెయ్యి వరకు జరిమానా, ఏడాదిపాటు జైలు శిక్ష, పదే పదే అదే తప్పుచేస్తే జరిమానాతోపాటు శిక్ష తీవ్రత పెరుగుతుంది. రైలు ఆగి, కదలడానికి అవసరమైన వ్యయాన్ని వసూలు చేస్తారు. ఇతర రైళ్లు తీవ్ర ప్రభావానికి గురైతే బాధ్యుడిపై అదనపు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష విధిస్తారు. చైన్ ఎప్పుడు లాగొచ్చంటే.. ప్రయాణికుల్లో ఎవరికై నా గుండెపోటు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఎవరైనా ప్రయాణికుడికి సమీపంలోని ఏదైనా స్టేషన్లో తక్షణ చికిత్స, మందులు లేదా ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం వంటి వైద్య సాయం అవసరమైనప్పుడు, ప్రయాణికులు ముప్పులో ఉన్నప్పుడు, మంటలు, పేలుళ్లు చెలరేగినప్పుడు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు రైలెక్కేటప్పుడు అది కదిలితే, దొంగతనాలు, దోపిడీదారులు దుశ్చర్యలకు పాల్పడినప్పుడు చైన్ లాగాలి. రైలు భద్రత అందరి బాధ్యత పట్టాలపై ఆటలు, పశువులను వదలొద్దు -
శిక్ష పడుతుందనే భయం కలగాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నిందితులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలను కోర్టులో నిరూపించి నేరస్తులకు శిక్ష పడటంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు దర్యాప్తు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సీపీ అభినందిస్తూ మంగళవారం ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. గతేడాది నుంచి నేటివరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 41 కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలకు కోర్టులో శిక్షలు అమలయ్యాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లోను అధికారులు అత్యధిక కేసులను పరిష్కరించారని, ఇదే రీతిలో రాబోయే రోజుల్లో మరిన్ని కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమములో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాము, ఏసీపీలు డేవిడ్రాజు, సతీష్బాబు, సదయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీనివాస్, సంతోషి, రవి కిరణ్, హరిచంద్ర ప్రసాద్, బృందా దేవి, దుర్గాబాయి, రాజమల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ రావు, కిరణ్ కుమార్, నీజర, ఇన్స్పెక్టర్లు సంజీవ్ రావు, మల్లయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అవగాహనతో సైబర్ నేరాల కట్టడి
● ఎస్పీ శబరీష్ తొర్రూరు రూరల్: అవగాహనతో సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని ఎస్పీ శబరీష్ అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ.. గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు, మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మధ్వాహ్నం, రాత్రి సమయాల్లో ఇంటి వద్ద లేకుంటే పక్క ఇంటివారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు, దొంగతనాలు, గుర్తు తెలియని ఫోన్కాల్స్, ఓటీపీలు, తమ బ్యాంక్ వివరాలపై చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గంజాయి, గుట్కా, గుడుంబా నిర్మూలనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐ గణేష్, ఎస్సైలు మహేందర్రెడ్డి, ఖాదర్పాషా, సర్పంచ్ ఈనెపల్లి భద్రమ్మ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
డోర్నకల్లో ట్రా‘ఫికర్’
● రోడ్డెక్కిన దుకాణాలు ● రహదారిపైనే వాహనాల పార్కింగ్ డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. చాలా కాలంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ఏకై క ప్రధాన రహదారి రైల్వే స్టేషన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు విస్తరించి ఉంది. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ రోడ్డు, గాంధీ సెంటర్, బ్యాంక్స్ట్రీట్లో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గాంధీసెంటర్లో రద్దీ.. పట్టణంలోని గాంధీసెంటర్లో కూరగాయల మార్కెట్, మసీదు, పాఠశాలలకు వెళ్లే మార్గాలు, గార్లకు వెళ్లే దారి ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. బ్యాంకు స్ట్రీట్లో నాలుగు ప్రధాన బ్యాంకులు, 10 వరకు ఎరువుల దుకాణాలతో పాటు ఇతర దుకాణాలు ఉన్నాయి. గాంధీ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో అన్ని రకాల దుకాణాలు, హోటళ్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో పాటు రైల్వే స్టేషన్కు వెళ్లే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ట్రాన్స్పోర్టు వాహనాలు సైతం గంటల తరబడి రోడ్లపై నిలుపుతున్నారు. రోడ్డెక్కిన దుకాణాలు.. రైల్వే స్టేషన్ రోడ్డు, గాంధీ సెంటర్, బ్యాంకు స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే ఇష్టారాజ్యంగా దుకాణాలను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూరగాయ ల మార్కెట్ భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో దుకాణాలను రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. చేప ల మార్కెట్ రోడ్డులో రహదారులపైనే చేపలు, మాంసం విక్రయిస్తున్నారు. కూరగాయలతో పాటు దుకాణాలలో కొనుగోళ్లు చేసేందుకు వచ్చేవారు వా హనాలను రోడ్లపైనే నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. ముత్యాలమ్మగుడి ఎదురుగా మలుపు ఇరుకుగా ఉండటం, దుకాణాలు ఏర్పాటుతో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. గతంలో డ్రైవర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు అక్కడి దుకాణాలను తొలగించారు. అయితే ఇటీవల మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేశారు. రోడ్ల మలుపుల వద్ద సైకిళ్లు, పండ్ల బండ్లను నిలిపి విక్రయాలు జరుపుతుండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. రాజకీయ నాయకుల అండతో.. మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రధాన వీధుల్లో రాజకీయ నాయకుల అండతో రాత్రికి రాత్రే రోడ్ల పక్కన దుకాణాలు వెలుస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే కూడళ్లలో దర్జాగా తోపుడు బండ్లు, బడ్డీ కొట్లను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దృష్టి సారించని అధికారులు.. డోర్నకల్లో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలను మున్సిపల్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై అడ్డదిడ్డంగా వెలుస్తున్న దుకాణాలను నియంత్రిచడంలో మున్సిపల్ సిబ్బంది, రోడ్లపై ఇష్టారాజ్యంగా నిలుస్తున్న వాహనాలను నియంత్రిచడంలో పోలీసులు విఫలమవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై వెలసిన దుకా ణాలను తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ ● ప్రజావాణిలో 205 అర్జీలు మహబూబాబాద్: ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పని చేయాలన్నారు. ప్రజావాణిలో 205 వినతులు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సర్వే నంబర్ కేటాయించాలి నేరడ గ్రామంలో ఎకరం భూమి ఉంది. సాగులో ఉన్నాను.. సంబంధిత పత్రాలు ఉన్నాయి. కానీ, రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ కేటాయించడం లేదు. నాలుగు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయంలో వినతి ఇచ్చినా ఫలితం లేక కలెక్టరేట్లో అందజేశా. – డి.రమాదేవి, దివ్యాంగురాలు, నేరడగ్రామం, కురవి డ్రెయినేజీ నిర్మాణం చేయాలి జిల్లా కేంద్రం శివారులోని గాయత్రి గుడి ప్రధాన గేట్ ఎదుట డ్రెయినేజీ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. డ్రెయినేజీ నిర్మాణం చేయాలి. –వంకోజు జలేంద్రాచారి, మానుకోట భూమి ఇచ్చినా పట్టించుకోవడం లేదు నాకు రెండు ఎకరాల భూమి ఉంది. ముగ్గురు కుమార్తెలు కావడంతో బాగోగులు చూసుకోవడానికి పెద్ద కుమార్తె కుమారుడి పేరున 32 గుంటలు రాసి ఇచ్చాను. కానీ, పట్టించుకోవడం లేదు. పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నా. న్యాయం చేయాలి. –బి.ఎల్లయ్య, మదనతుర్తి గ్రామం, నెల్లికుదురు -
గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో వికసిత్ తెలంగాణ కోసం గిరిజనుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి హనుమకొండకు చేరుకున్న నితిన్ నబీన్కు హరిత హోటల్ వద్ద గిరిజన సంప్రదాయప్రకారం స్వాగతం పలికారు. అనంతరం గిరిజనుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మావోయిస్టులు ఉన్నచోట ఇంతకాలం గిరిజనుల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. నక్సలైట్ల సమస్య సమసిపోయిందన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గోడెం నగేశ్, కేంద్ర మాజీ మంత్రి అమర్సింగ్ తివారీ, నాయకులు కల్యాణ్ నాయక్, సోలంకి శ్రీనివాస్, బాబీ, రితేష్ రాథోడ్ పాల్గొన్నారు. భద్రకాళికి పూజలు హన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వేర్వేరుగా సందర్శించారు. వీరితోపాటు పార్టీ , ఈ సందర్భంగా వారికి ప్రధానార్చకులు భద్రకాళి శేషు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. ముందుగా గోమాతకు ప్రదక్షిణ చేసి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. నితిన్ నబీన్ కాన్వాయ్ని అడ్డుకున్న ఎన్ఎస్యూఐ నేతలుహన్మకొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాన్వాయ్ను కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సోమవారం హనుమకొండ పర్యటనకు వచ్చిన నితిన్ నబీన్ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ ఉమ్మడి జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాన్వాయ్ తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలి దాటగానే అడ్డంగా పరుగెత్తుకొచ్చారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుతొలగించి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం వదిలేశారు. వరంగల్ పోలీసులపై కేంద్ర మంత్రి ఆగ్రహం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాన్వాయ్ను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకునే విషయంలో పోలీసుల తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్యూ నాయకులు న్యూసెన్స్ చేస్తుంటే పోలీసులు సైలెంట్గా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ఎస్యూ నాయకుల న్యూసెన్స్పై ముందుస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వరంగల్ పోలీసుల నిర్లక్ష్యంపై కేంద్ర నిఘావర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా -
ఇదీ ఒక రోడ్డేనా?
● గుంతలు పడిన రోడ్డుపై ఎంపీ చామల ఆగ్రహం బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాల రూట్లో కొడవటూరు కమాన్ వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది. అడుగుకో గుంత అన్నట్టుగా రోడ్డంతా గుంతలమయమే. సోమవారం బచ్చన్నపేట నుంచి చేర్యాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి వెళ్తుండగా జాతీయ రహదారి–365 బీపై గుంతలను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆర్అండ్బీ డీఈకి ఫోన్ చేసి ఈ గుంతల రో డ్డుకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. కాగా, మండల పరిధిలో సుమారు రెండు కి లోమీటర్ల మేర అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత పనులు చేపట్టి రహదారిని ప్రయాణయోగ్యంగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఏకలవ్య పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
బయ్యారం: మండలంలోని నామాలపాడులోని ఏకలవ్య పాఠశాలలో సోమవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బోరు ఏర్పాటు చేయించి నీటి సమస్య పరిష్కరించాలని ఐటీడీఏ ఏటూరునాగారం పీఓను ఎమ్మెల్యే ఫోన్లో కోరారు. అనంతరం పాఠశాల నిర్వాహకులతో మాట్లాడుతూ.. ప్రస్తుత వానాకాలంలో పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున అవసరమైన మందులను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ రాంబాబు, నామాలపాడు, కొత్తపేట సర్పంచులు దీప ప్రకాష్, ప్రవీణ్నాయక్, సొసైటీ చైర్మన్ మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు’ తొర్రూరు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని తొర్రూరు ఆర్డీఓ గణేష్ సూచించారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. 10 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే సంబంధిత మండల, మున్సిపల్ కార్యాలయాలకు పంపించి అతి తక్కువ సమయంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎల్పీఓ పుల్లారావు, లేబర్ ఆఫీసర్ రవి, ఏటీడబ్ల్యూఓ ఉపేందర్, డిప్యూటీ ఈఈ రంజిత్నాయక్, సీడీపీఓ రేష్మ, మిషన్ భగీరథ ఈఈ మోహన్, ఏఓ రాంనర్సయ్య, ఎకై ్సజ్ ఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శం ఆ ఉపాధ్యాయుడు మరిపెడ రూరల్: ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం చాటుతూ జెడ్పీహెచ్ఎస్ ఎల్లంపేట జీవశాస్త్రం ఉపాధ్యాయుడు ఐనాల నవీన్ తన కుమారుడు అభినంద్ను సోమవారం ఎల్లంపేట ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ విద్యపై తనకున్న నమ్మకాన్ని ఆచరణలో చూపిస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు నవీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం భాస్కర్రావు, పీఎస్ హెచ్ఎం జి.వెంకన్న పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్పై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు’ గూడూరు: ఎస్ఐఆర్పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాలోని తన నివాసంలో సోమవారం ఎస్ఐఆర్ ఫారం స్వయంగా నింపి తహసీల్దార్ నాగభవానికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి బీఎల్ఏలు వచ్చి ఎస్ఐఆర్ ఫారంలు ఇస్తారని, వాటిని జాగ్రత్తగా నింపి అందించాలన్నారు. గ్రామాల్లో మృతిచెందిన, ఓటరు జాబితాలో డబుల్ పేర్లు ఉంటే తొలగిస్తారన్నారు. -
‘స్టిక్కర్ల’ పేరిట వసూళ్ల దందా!
ఖిలా వరంగల్ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ వాహనానికి ముందు, వెనుక రిప్లెక్టివ్ స్టిక్కర్లు అతికించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీని పేరుతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వసూళ్లు చేపడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యూ ఆర్ కోడ్ స్కాన్చేస్తే వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారుల నుంచి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు ఓనర్లు పేర్కొంటున్నారు. లారీ ఓనర్లకు భారం.. వాహనాలకు క్యూ ఆర్ కోడ్తో ఉన్న స్టిక్కర్లను అతికించే బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేట్ కాంట్రా క్టర్కు అప్పగించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయంలోనే ప్రైవేట్ కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు ఫిట్నెస్కు వచ్చే ప్రతీ వాహనానికి రిప్లెక్టివ్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో లభించే స్టిక్కర్లు వేసుకుని వచ్చినా లారీకి కనీసం రూ. 5,500 తీసుకుంటున్నారు. అసలే స్టిక్కర్లు లేని వాహనానికై తే రూ.6వేలు నుంచి వాహన సామర్థ్యాన్ని బట్టి రూ.10వేలు వసూలు చేస్తున్నారని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి.. వరంగల్ జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీఓ) రంగారావును సోమవారం ‘ది వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్’ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేముల భూపాల్, కోశాధికారి మహమ్మద్ జాకీర్, సభ్యులు కలిశారు. స్టిక్కర్ల పేరుతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. లారీ ఓనర్లు, డ్రైవర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్టిక్కర్ల వసూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని డీటీఓకు వినతిపత్రం అందజేశారు. లారీ ఓనర్లపై తీవ్ర ఆర్థిక భారం చర్యలు తీసుకోవాలని డీటీఓకు వినతి మార్కెట్లో బస్సు, లారీ వంటి వాహనాలకు రేడియం స్టిక్కర్ వేస్తే రూ. 300 నుంచి రూ.500 వరకు ఖర్చవుతోంది. అయితే కార్యాలయాల వద్ద ఉండే కాంట్రాక్టర్ స్టిక్కర్ తప్పని సరి నిబంధన విధించడంతో అక్రమాలు ఎక్కువయ్యాయి. కాంట్రాక్టర్కు సంబంధించిన సిబ్బంది స్టిక్కర్ అతికించాలనుకుంటే వాహన టైర్లను బట్టి సామర్థ్యం మేరకు రూ.5వేలు నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై వరంగల్ జిల్లా రవాణాశాఖ అధికారి రంగారావును వివరణ కోరగా.. రాష్ట్ర స్థాయి నుంచే ఉత్తర్వులు ఉన్నాయని, కాంట్రాక్టర్ క్యూఆర్ జారీ చేస్తే తాము వాహన సామర్థ్యాన్ని పరీక్షించి ఇక్కడ ధ్రువీకరణ పత్రాలు ఇస్తామన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ ఎంత వసూలు చేస్తున్నారనే విషయం తమకు తెలియదన్నారు. ఎక్కువ తీసుకుంటే వాహనదారులు తెలపాలని, అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
రెండోరోజు కొనసాగిన పల్స్పోలియో
● 2,456 మంది చిన్నారులకు చుక్కల పంపిణీ నెహ్రూసెంటర్: పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇంటింటికి వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొదటిరోజు పల్స్పోలియో చుక్కలు వేసుకోని పిల్లలను గుర్తించి రెండోరోజు 2,456 మందికి వేసినట్లు చెప్పారు. జిల్లాలో 938 బృందాల వైద్య సిబ్బంది సర్వే చేపట్టారని, రెండు రోజుల పాటు చుక్కలు వేసుకోని పిల్లలకు నేడు (మంగళవారం) వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇమ్యూనైజేషన్ అధికారి శివకుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక భారం తగ్గించాలి..
రేడియం రిప్లెక్టివ్ స్టిక్కర్లతో లారీ ఓనర్ల ఆర్థిక భారం పడుతోంది. లారీ టైర్లను బట్టి రూ.6వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు వేస్తే లారీలకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్కు రావాలంటే ఆర్థిక భారాన్ని చూసి భయపడుతున్నాం. భారంగా మారిన క్యూర్ కోడ్స్టిక్కర్లను తొలగించాలి. లేదా వాహనానికి రూ. వెయ్యి మాత్రమే వసూలు చేయాలి. –వేముల భూపాల్, లారీ ఓనర్స్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ● -
చిరుతపులి కోసం అన్వేషణ
● ఖానాపురంలో రెండోరోజు సంచారం?ఖానాపురం : చిరుత పులి కోసం అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిధిలో ఆదివారం చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాగంపేట గ్రామానికి చెందిన పలువురు చిరుత పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సోమవారం సమాచారం అందించారు. దీంతో సెక్షన్ ఆఫీసర్ పద్మారావు, బీట్ ఆఫీసర్ యోగి, శోభన్, బేస్ క్యాంపు నాగరాజు ఘటనాస్థలికి చేరుకుని ప్రజల వద్ద నుంచి వివరాలు సేకరించారు. అనంతరం తహసీల్దార్ నంగునూరి రమేశ్, ఎస్సై రామ్మోహన్, ఖానాపురం సర్పంచ్ దాసరి రమేశ్.. చిరుతపులి కనిపించిందనే అనుమానం వ్యక్తం చేసిన ప్రజల వద్ద వివరాలు తెలుసుకున్నారు. గ్రామ శివారులో ఆయిల్పాం తోటలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పాదముద్రలు సేకరించారు. కాగా, సోమవారం రాగంపేటకు చెందిన మహిళా రైతు విజయ వ్యవసాయ భూమి వద్ద పని చేస్తుండగా చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలుపగా మరోసారి అటవీ అధికారులకు తెలిపారు. అయినా వారు నామమాత్రంగానే అన్వేషణ చేపట్టి వదిలేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా మండల పరిధిలోనే చిరుతపులి సంచరిస్తూనే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చిరుతపులి జాడ కనిపెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
సేవలు వేగంగా, పారదర్శకంగా..
● అందుబాటులో ఆధునిక యంత్రం ● వరంగల్ తపాలా కార్యాలయానికి చేరిన మెషీన్ఖిలా వరంగల్ : వరంగల్ డివిజనల్ తపాలా కార్యాలయంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా ఆధునిక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తపాలా కౌంటర్ల వద్ద గంటల కొద్దీ నిలబడాల్సిన అవసరం లేకుండా స్వయంగా పోస్టల్ ఐటమ్స్ (స్పీడ్పోస్ట్) బుక్ చేయడం కోసం ఈ యంత్రాలను సిద్ధం చేశారు. ఫలితంగా వినియోగదారులకు నిరీక్షణ తప్పుతుంది. మెరుగైన సేవలు అందుతాయి. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో స్పీడ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని డివిజన్ సూపరింటెండెంట్ బి.రవికుమార్ తెలిపారు. పోస్టల్ సేవలు సులభం.. వరంగల్ డివిజనల్ తపాలా కార్యాలయంలో పోస్టల్ సేవలు సులభంగా, వేగంగా పంపేందుకు యూజప్ పెండ్లీ ఇంటర్ఫేస్ బుక్ సౌకర్యం కల్పించారు. వస్తువుల బరువును ఆధునిక యంత్రం తూకం వేస్తుంది. అందుకునుగుణంగా కచ్చితమైన చార్జీ లెక్కిస్తుంది. ఫోన్పే, పేటీఎం, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే వెసులు బాటు సైతం కల్పించారు. ‘తపాలా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన యంత్రాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలి. చెల్లింపు పూర్తయిన వెంటనే ట్రాకింగ్ నంబరుతో కూడిన రసీదు వస్తుంది. తపాలా వినియోగదారులు తప్పని సరిగా చిరునామా, పిన్కోడ్ తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది’ అని పోస్టల్ అధికారులు పేర్కొన్నారు. -
‘రోల్’ మోడల్గా కమిషనరేట్ పోలీస్!
వరంగల్ క్రైం : వరంగల్ కమిషనరేట్ పోలీస్ రాష్ట్రానికి ‘రోల్’మోడల్గా నిలుస్తున్నారు. సీపీ సన్ప్రీత్సింగ్ కమిషనరేట్ పరిధిలో మే 29 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన రోల్ కాల్ సిస్టం సత్ఫలితాలు ఇస్తోంది. ఫలితంగా కేసుల ఛేదనలో వేగం పెరిగినట్లు తెలుస్తోంది. రోల్ కాల్ విధానం పోలీస్ వ్యవస్థ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్నా ఈ మధ్య కాలంలో ఎవరూ పాటించడం లేదు. తుతూ మంత్రంగా ఇంతకాలంగా కొనసాగిన రోల్కాల్ విధానం ఇప్పటి నుంచైనా సక్రమంగా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని సీపీ హెచ్చరించడంతో ఉదయం 9 గంటలకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) రోల్ కాల్ తీసుకుంటున్నారు. దీంతో పీఎస్కు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే అధికారులు నిర్ణయం తీసుకుని సిబ్బందిని క్షేత్రస్థాయి విచారణకు పంపిస్తున్నారు. దీంతో పాటు అధికారులు కచ్చితంగా 9 గంటలకు విధులకు హాజరవుతారనే నమ్మకం ప్రజల్లో కలిగింది. విధులకు హాజరు తప్పనిసరి కావడంతో.. రాష్ట్రంలో పోలీస్ బాస్ నిర్ణయాలతో వరంగల్ కమిషనరేట్లో పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు సీపీ ప్రజలు, అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉంటున్నారు. ఎస్హెచ్ఓలు ఉదయం 9 గంటలకు రోల్ కాల్ తీసుకోవాలనే నిబంధనతో సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది కచ్చితంగా సమయానికి హాజరవుతున్నారు. దీంతో ఫిర్యాదుదారులకు అధి కారులు అందుబాటులో ఉండడంతో సాయంత్రం వరకు వారి సమస్యలు సైతం పరిష్కారమవుతున్న ట్లు సమాచారం. కమిషనరేట్ పరిధిలో వివిధ మండలాల్లో ఎస్హెచ్ఓలుగా పనిచేస్తున్న చాలా మంది అధికారులు నగరంలో ఉంటున్నారు. దీంతో రాత్రి వచ్చి ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విధులకు హాజరయ్యేవారు. ఈ నేపథ్యంలో రోల్ కాల్ వ్యవస్థ అమలు జరిగిన నెల వ్యవధిలోనే పోలీస్ వి ధుల్లో చాలా మార్పులు తీసుకొచ్చినట్లు పలువురు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమయం సరిపోక ఉక్కిరిబిక్కిరి.. రోల్ కాల్ సత్ఫాలితాలు ఇస్తున్నా ఎస్హెచ్ఓలు స మయం సరిపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలు స్తోంది. ట్రై సిటీ పరిధితోపాటు చుట్టు పక్కల పీ ఎస్లకు ఫిర్యాదుదారుల తాకిడి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే టెలీ కాన్ఫరెన్స్ మొదలవుతుంది. మొదట సబ్ ఇన్స్పెక్టర్లను ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లను ఏసీపీ, డీసీపీ, సీపీ టెలీకాన్ఫరెన్స్ ఉంటుంది. ఈ తంతు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతోంది. 9 గంటలకే రోల్ కాల్ ఉండడంతో సమయం సరిపోవడం లేదని, ఈ విషయంలో మార్పు తీసుకొస్తే బాగుంటుందని పలువురు ఎస్హెచ్ఓలు అభిప్రాయపడుతున్నారు. 9 గంటలకు స్టేషన్లో కొలువుదీరుతున్న ఎస్హెచ్ఓలు ఫిర్యాదులపై తక్షణ స్పందన.. ప్రజల్లో కలుగుతున్న నమ్మకం -
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశా ల (అటానమస్) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్తో కలిసి విడుదల చేశారు. కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, నర్సంపేట డిగ్రీ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి కమలాకర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాజీరు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను కళాశాలలోనే అందుబాటులో ఉంచారు. చిన్న నిర్లక్ష్యం.. గాల్లో కలిసిన ప్రాణం ● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ● ధర్మగడ్డ తండాలో ఘటన నెల్లికుదురు : చిన్న నిర్లక్ష్యానికి ఓ ప్రాణం గాల్లో కలిసింది. తన ఇంట్లో విద్యుత్ తీగకు అతుకు ఉన్నచోట టేపు వేయకుండా వదిలేయడమే కాకుండా ఇనుప వస్తువులకు తాకేలా ఉందా లేదా అనే విషయం చూసుకోకుండా వదిలేయడంతో షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాస్య తండా శివారు ధర్మ గడ్డ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ సురేశ్ (35) తన అన్న, బావమరిదితో కలిసి ఈ నెల 28న రాత్రి ఇంటిపై నిద్రించారు. అర్ధరాత్రి వర్షం వస్తుండగా సురేశ్ తాను నిద్రిస్తున్న ఇనుప మంచం ఎత్తుకుని మెట్లపై నుంచి దిగుతున్నాడు. ఈ క్రమంలో దారిలో ఉన్న విద్యుత్ వైరుకు ఉన్న అతుకుకు ఇనుప మంచానికి తగిలి షాక్ గురై మెట్ల పైనుంచి కిందపడ్డాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. సురేశ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య యమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో పడి బాలుడు.. ఖిలా వరంగల్ : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. ఈఘటన కమ్మరికుంటలో చోటు చేసుకుంది. ఏనుమాముల పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన ఓ మహిళ బతుకుదెరువు నిమిత్తం తన కుటుంబంతో కలిసి ఆరెపల్లి గ్రామంలో అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో ఆమె కుమారుడు కామెర శ్రీవిష్ణు సహస్ర సూర్యతేజ (11) సోమవారం సాయంత్రం గ్రామంలోని కుమ్మరికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. బహిర్భుమికి వెళ్లిన ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మృతుడి అక్క శ్రావ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. -
అదనపు డీసీపీ పనితీరు అభినందనీయం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: అడిషనల్ డీసీపీ రవి పనితీరు అభినందనీయమని వరంగల్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. పోలీస్శాఖలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో పనిచేసి వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ, అడ్మిన్ హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న అడిషనల్ డీసీపీకి పరిపాలన విభాగం సిబ్బంది వీయం.కల్యాణ వేదికలో ఏర్పాటు ఆత్మీ య వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని అడిషనల్ డీసీపీని ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. సిబ్బందికి సంబంధించి శాఖాపరమైన సమస్యలపై తక్షణమే స్పందించడంతో పాటు తనను సంప్రదించి వాటిని త్వరితగతిన పరిష్కరించి సిబ్బందికి సత్వరమే న్యాయం అందించేవాడని, అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో అడిషనల్ డీసీపీ రవి ప్రత్యేకతని సీపీ తెలిపారు. కార్యక్రమం ఏఓ సంపత్కుమార్, సూపరింటెండెంట్లు రమేశ్, యాకుబ్ బాబా, సంధ్య, వహీద్, గిరి, పూజితతో పాటు సీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. భవనాల తొలగింపుపై సీపీ సమీక్ష వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన కమిషనరేట్ భవనం పరిసరాల్లోని పాత భవనాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా పాత భావనాల్లో కొనసాగిస్తున్న వివిధ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరించాల్సి వస్తే సంబంధిత విభాగాలకు సంబందించిన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించారు. ఈసమీక్షలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర, అంతయ్య, ఆర్ఐలు శ్రీధర్, సతీశ్, స్పర్జన్ రాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డిగ్రీ దండగ కాదు.. పండుగ
హన్మకొండ అర్బన్ : రాబోయే రెండు దశాబ్దాలు విద్యారంగానికి అత్యంత కీలకమని, ‘డిగ్రీ దండగ కాదు.. పండుగ’అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. నగరంలోని మాస్టర్ జీ పీజీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతన డిగ్రీ, పీజీ సిలబస్పై సోమవారం అధ్యాపకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన సిలబస్లో విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు, ట్రెండింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అధ్యాపకులు నూతన సిలబస్పై పూర్తి అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. మాస్టర్ జీ విద్యాసంస్థల చైర్మన్ సంఘం రెడ్డి సుందర్రాజ్ మాట్లాడుతూ అధ్యాపకులు ఎప్పటికప్పుడు సిలబస్లో వస్తున్న మార్పులను తెలుసుకుంటూ విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు. కేయూ ఓఎస్డీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ నూతన సిలబస్ రూపకల్పనలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి పలు సూచనలు అందించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. పోలరామ్, జనరల్ సెక్రటరీ సంఘం రెడ్డి అచ్యుత్రాజ్, విశ్వరాజ్, ధనరాజ్, లక్ష్మీనర్సింహారావు, సూర్యనారాయణ, ధనలక్ష్మి, స్రవంతి, శ్రీనివాస్, అశోక్, అనురాధ, తదితరులు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి గణాంకాలే బలమైన పునాది.. కేయూ క్యాంపస్: దేశాభివృద్ధికి గణాంకాలే బలమైన పునాది అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చై ర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవా రం భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు చంద్రమహబిల నోబిస్ జయంతి సందర్భంగా కేయూలో ని స్టాటిస్టిక్స్ విభాగం సెమినార్హాల్లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధికి గణాంకాలు కేవలం సంఖ్యల సమాహారం మాత్రమేకాకుండా ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలనకు సమర్థవంతమైన నిర్ణయాల మూలాధారంగా నిలుస్తాయన్నారు. మహల నోబి స్ శాసీ్త్రయ దృక్పథం నేటికీ దేశ ప్రణాళిక వ్యవస్థకు మార్గదర్శకమన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ గణాంక శాస్త్రం ప్రతీవిద్యార్థికి అవసరమైన ప్రాథమిక విజ్ఞానంగా మారిందన్నారు. అనంతరం ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ ఇస్తారి, స్టాటిస్టిక్స్ విభాగం అధిపతి జె. శ్రీనివాస్, కేయూ స్టాటిస్టిక్స్ విభాగం రిటైర్డ్ ఆచార్యుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. వైస్ ప్రిన్సిపాల్ మమత, యూత్వెల్ఫేర్ ఆఫీసర్లు బి. నిరంజన్, శ్రీనివాస్, రాధిక, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
ఒత్తిడిని జయించాలి
● ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత ● బాలవికాసలో జాతీయ వర్క్షాప్ ప్రారంభం కాజీపేట రూరల్: నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించాలని, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం కోసం జాతీయ వర్క్షాప్ వంటివి ఎంతో దోహదపడతాయని హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ సెంటర్లో సోమవారం బాలవికాస, విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ వారి భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి వర్క్షాప్ను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రారంభించారు. ‘మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు–ఒత్తిడి నివారణ, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి’ అంశంపై ముఖ్య అతిథిగా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్నేత మాట్లాడుతూ యువతకు శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో, మానసిక దృఢత్వం అంతే ముఖ్యమన్నారు. బాలవికాస పీడీటీసీ డైరెక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలవికాస పీడీటీసీ 24 ఏళ్లుగా ఎన్నో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, ఈ జాతీయ వర్క్షాప్లు యువతకు ఎంతో మేలు చేస్తాయన్నారు. బ్రహ్మకుమారి సంస్థకు చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ నుంచి హాజరైన ప్రోగ్రాం ఆఫీసర్ మంజునాథ్, 8 రాష్ట్రాల నుంచి 100 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జాతరకు వెళ్లొస్తూ మృత్యుఒడికి..
కమలాపూర్ : అసోంలో జరిగిన కామాక్యదేవి జాతరకు వెళ్లొస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇదే ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన కళ్లెం శ్రీనివాస్(50), చల్లా వెంకటేష్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన తూర్పాటి భార్గవ్(35), హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన తూర్పాటి హరిబాబు కలిసి అసోంలో ఇటీవల జరిగిన కామాక్యాదేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఉప్పల్లో అదుపు తప్పి ఓ ఇంటి గోడను ఢీకొని డ్రైనేజీలోకి దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కళ్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తూర్పాటి భార్గవ్, సీహెచ్.వెంకటేష్, తూర్పాటి హరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కమలాపూర్, నడికూడ 108 అంబులెన్స్ల్లో వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తూర్పాటి భార్గవ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మృతుడు కళ్లెం శ్రీనివాస్ కుమారుడు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఉప్పల్లో ఘటన -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
నెహ్రూసెంటర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత అన్నారు. ఆదివారం ఐద్వా ముఖ్య నాయకుల సమావేశం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై జరుగతున్న దాడులు, దౌర్జన్యాలపై మహిళాలోకం ఏకమై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. మహిళలను చైతన్యపరిచి హక్కులు, చట్టాల అమలుపై, రిజర్వేషన్ల సాధనపై సంఘం ఆధ్వర్యంలో దశలవారి ఆందోళనలు చేపట్టాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించడం, దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. సంఘం బలోపేతం కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిఽధిలోని ప్రతీవార్డులో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఛాగంటి భాగ్యమ్మ, ములక వసంత, పంజాల ఉపేంద్ర, బోయిన సునీత, దర్శనపు మంజూల, కొమిర ఉమా తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన స్వరవైభవం
హన్మకొండ చౌరస్తా : ఘంటసాల గంధర్వ గానా మృత వేదిక, లిటిల్ గంధర్వ ఘంటసాల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గానకళ తపస్వి డా క్టర్ శరత్ చంద్ర దర్శకత్వంలో ఆదివారం హనుమకొండ పద్మాక్షి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించిన ‘స్వర వైభవం’ అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జగదీశ్ బాబు, ప్రొఫెసర్ తిరుపతయ్య హాజరై మా ట్లాడుతూ వర్ధమాన గాయనీగాయకులను ప్రోత్సహించడం, సంగీత సంస్కృతిని భావితరాలకు చేరవేయడమే ఈ సంస్థ లక్ష్యమన్నారు. సుమారు 50 మంది గాయనీగాయకులు పాల్గొని ఘంటసాలతో పాటు పలువురు ప్రముఖ గాయకుల మధుర గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఉపేందర్, నిమ్మల శ్రీనివాస్, ఎంఎల్ రావు, దేవేంద్రాచారి, టీవీ రమేశ్, చోటు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఐఏఎస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. -
పోలియోరహిత సమాజమే లక్ష్యం
● పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ స్నేహశబరీష్ ● జిల్లాలో 96శాతం వ్యాక్సినేషన్ పూర్తినెహ్రూసెంటర్: పోలియో రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. ఆదివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 0నుంచి5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. పిల్లలకు పోలియో రాకుండా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ముందుండాలన్నారు. డీఎంహెచ్ఓ రవి రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలో పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. 469 కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలు 76,660 మందికి గానూ 73,570 మందికి 96శాతం పోలియో చుక్కలు వేశామని పేర్కొన్నారు. మొదటి రోజు చుక్కలు వేసుకోని పిల్లలకు ఈనెల 29,30వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి వేయనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, 19వ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణజ్ఞానేశ్వర్, 33వ వార్డు కౌన్సిలర్ బి.అజయ్సారథిరెడ్డి, వ్యాధి నిరోధక టీకాల అధికారి శివకుమార్, డెమో రాజ్కుమార్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ స్వామి, పురుషోత్తం, శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పల్స్పోలియో కార్యక్రమ పరిశీలకుడు జాన్బాబు పట్టణంలోని సాలర్తండా కేంద్రాన్ని సందర్శించి ప్రతీ చిన్నారికి చుక్కలు వేసేలా వైద్య సిబ్బంది చొరవ చూపాలని తెలిపారు. -
నర్మెట సీఐ, ఎస్సైల సస్పెన్షన్
బచ్చన్నపేట/ నర్మెట : నర్మెట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేటలో గతంలో పని చేసి వీఆర్ఎస్కు అటాచ్డ్ అయిన ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో బచ్చన్నపేట ఎస్సైగా వచ్చిన హమీద్ దాదాపు 16 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. సుమారు నాలుగు నెలల క్రితం మండలంలోని సాల్వాపూర్ గ్రామ సమీపంలో పీడీఎఓస్ బియ్యం పట్టుకుని నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. కానీ పట్టుకున్న మొత్తం బియ్యం చూపించకుండా తక్కువ తూకం నమోదు చేశారనే విషయంలో సీఐ, ఎస్సైలు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ విషయమై సీపీకి ఫిర్యాదు చేయగా ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులతో విచారణ చేయించారు. ఇందులో పీడీఎస్ బియ్యం తక్కువ తూకం నమోదు చేశారనే విషయం నిరూపణ అయ్యింది. దీంతో సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్హమీద్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హమీద్.. ఎస్సై ఎస్కే అబ్దుల్హమీద్ పలు చోట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేవరుప్పుల మండలంలో పని చేసిన సమయంలో కూడా ఏసీబీ ట్రాప్నకు అయ్యారు. ఆ తర్వాత వీఆర్ అటాచ్డ్ అయి బచ్చన్నపేటకు వచ్చినప్పటి నుంచి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల పోచన్నపేట గ్రామ వాగు నుంచి ఇసుకను అనుమతులు లేకుండా తరలించడానికి కొంత మొత్తాన్ని ఆశించారని సీపీకి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆ ఆరోపణ వాస్తవమని రుజువు కావడంతో వీఆర్కు అటాచ్డ్ చేస్తూ సీపీ ఆదేశాలు ఇచ్చారు. తిరిగి పీడీఎస్ బియ్యం ఆరోపణ కూడా నిరూపణ కావడంతో ఏకంగా సస్పెండ్ చేశారు. బచ్చన్నపేటలో సస్పెండ్ల పర్వం.. బచ్చన్నపేటలో పని చేసిన పలువురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. 2024లో పని చేసిన అప్పటి ఎస్సై నవీన్కుమార్ కూడా ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. ఆ సమయంలో ఉన్న నర్మెట సీఐ నాగబాబు మరో కేసులో సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు పీడీఎస్ బియ్యం విషయంలో సీఐ అబ్బయ్య, ఎస్సై హమీద్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. -
కట్టు తప్పుతున్న ఖాకీలపై కొరడా
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టు తప్పుతున్న అధికారులపై పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ కొరడా ఝులిపిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వేటు వేస్తున్నా మిగతా వారికి భయం ఉండడం లేదు. భూ వివాదంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలపై ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రావును ఏఆర్కు అటాచ్డ్ చేసి 24 గంటల గడవకముందే పీడీఎస్ బియ్యం వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.అబ్బయ్య, బచ్చన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే హమీద్ను సస్పెండ్ చేస్తూ సీపీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్లో కలకలం సృష్టించింది. భూ వివాదాల్లో తలదూర్చవద్దని, ఇతర సెటిల్మెంట్లు చేయొద్దని పోలీస్ ఉన్నతాధికారులు నెలవారీ నేర సమీక్ష సమావేశాల్లో పదేపదే చెబుతున్నా కొందరి తీరులో మార్పురావడంలేదు. పోస్టింగ్ ఉన్న రోజుల్లోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న కక్కుర్తి.. చివరికి ఉద్యోగం ఊడేదాకా తెచ్చుకుంటోంది. పోలీస్ శాఖకు అవినీతి మరకలు.. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిస్టర్ కూల్గా పేరుంది. కానీ నిబంధనలను అతిక్రమించిన అధికారులపై తనదైన శైలిలో చర్యలు చేపడుతున్నారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై నిఘా (ఎస్బీ) అధికారులతో నివేదికలు తెప్పించుకోవడంతోపాటు క్యాట్పార్టీ అధికారులతో కూడా సమాచారం తెప్పించుకుని చర్యలు తీసుకుంటున్నారు. ● ఒకే సబ్ డివిజన్లో పనిచేసిన ఏసీపీ నందిరాంనాయక్, ఇన్స్పెక్టర్ గోపి, సబ్ ఇన్స్పెక్టర్ విఠల్పై సస్పెన్షన్ వేటు పడడం అప్పట్లో కమిషనరేట్లో సంచలనంగా మారింది. ● మామునూరు ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించిన సమయంలో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో ఒంటేరు రమేశ్తోపాటు ఆయన గన్మెన్పై వేటు పడింది. ● ఏప్రిల్ 29న హసన్పర్తి పోలీస్ స్టేషన్లో రాత్రి విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ టి.రాములు మ ద్యం మత్తులో ఉండడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. ● ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబు ల్గా పనిచేస్తూ అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వాటిని తీర్చలేని వారిపై వేధింపులకు పాల్పడిన ట్లు వచ్చిన ఆరోపణలపై ఏఆర్ హెడ్ కానిస్టేబు ల్ యాదగిరిపై వేటు పడింది. అదేరోజు చెన్నారావుపేట పీఎస్ కానిస్టేబుల్పై వచ్చిన ఆరోపణల్లో సతీశ్పై వేటు పడింది. ● ఏప్రిల్ 23న అవినీతి ఆరోపణలపై నర్సంపేట ఎస్సై రవికుమార్, ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్కుమార్పై వేటు పడింది. ● విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై ఏప్రిల్ 10న ఆత్మకూరు ఎస్సై సతీశ్పై వేటు పడింది. ● మద్యం మత్తులో ఓ షాపు యజమానిపై చెయ్యి చేసుకున్నందుకు మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్, మద్యం మత్తులో విధులు నిర్వర్తించిన మడికొండ హెచ్సీ మోహన్రావుపై వేటు పడింది. ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే తప్పుడు మాటలు చెప్పి నాలుగేళ్లు లైంగికదాడి, ఆపై బెదిరింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీసీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ గోదారి రాజ్కుమార్ను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ● మహిళా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మిల్స్ కాలనీ సబ్ ఇన్స్పెక్టర్ సురేశ్పై వేటు పడింది. ..ఇలా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కాసుల కోసం వెంపర్లు ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములు..సెటిల్మెంట్లకే ప్రాధాన్యం.. పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారుల ప్రాధాన్యాలు మారిపోయాయి. భూములు, సెటిల్మెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం మొదలవడంతో వ్యవసాయ భూముల దగ్గర జరుగుతున్న పంచాయితీలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. వరంగల్ సబ్ డివిజన్లో పర్యవేక్షణ అధికారి (ఏసీపీ )లేకపోవడంతో ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్ తన పరిధిలో పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన సొంత కారు వచ్చింది అంటే ఆ రోజు పెద్ద సెటిల్మెంట్ జరిగి నట్లు సిబ్బంది కోడై కూస్తున్నారు. ● పరకాల సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ తన దగ్గర పనిచేసే ఎస్సైలకు నెలవారీ మామూళ్ల చిట్టాను అందించి వాటి వసూళ్లకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయన నోటి నుంచి పెద్ద రాజకీయ నాయకుల పేర్లు చెప్పి సిబ్బందిని భయాభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణాలు వినిపిస్తున్నాయి. ● కాజీపేట సబ్ డివిజన్లో ఓ పీఎస్లో వింత పరిస్థితి నెలకొంది. అక్కడ ఓ ఇన్స్పెక్టర్ కేసుల నమోదులో తీవ్ర నిర్లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆరోపణాలు ఉన్నాయి. దీంతో ఇన్స్పెక్టర్ రైటర్ ఇదే అదునుగా భావించి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పీడ్ పెంచిన వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులపై అవినీతి ఆరోపణలు.. వరుస సస్పెన్షన్లతో కలకలం -
నది.. హతవిధి
ప్రస్తుతం నీరు తగ్గి కనిపిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులుత్రివేణి సంగమం వద్ద గతేడాది జూన్ 28న పుష్కరఘాట్కు చేరిన వరద(ఫైల్)కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ప్రతీ ఏడాది జూన్ 20 నాటికే సమృద్ధిగా వర్షాలు కురిసి గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగేవి. కానీ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనా ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో గోదావరిలో నీటి ప్రవాహం కదలడం లేదు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రాణహిత, తెలంగాణ నుంచి వచ్చే గోదావరి నదులు ప్రస్తుతం స్వల్ప స్థాయి నీరుతోనే దర్శనమిస్తున్నాయి. గతేడాది ఇదే నెల 28 నాటికి గోదావరి నీరు పుష్కర ఘాట్ మెట్ల వరకు చేరి ప్రవహించిందని స్థానిక రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల ముగుస్తున్నా వర్షాలు ఆలస్యం కావడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందని, వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో మళ్లీ రెండోసారి విత్తుతున్నారు. ఇప్పటికై నా వరుణుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిసి గోదావరిలో నీటి ప్రవాహం పెరగాలని రైతులు, ప్రజలు కోరుకుంటున్నారు. నీటి ప్రవాహం లేకపోవడంతో కదలని గోదావరి ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు ఫలితంగా స్వల్పస్థాయి నీటితోనే దర్శనమిస్తున్న నది -
నేటి కేటీఆర్ పర్యటన వాయిదా
మహబూబాబాద్: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ పర్యటన వాయిదా పడినట్లు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 29న(సోమవారం) మహబూబాబాద్ పట్టణంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమీక్షించాల్సి ఉండగా.. కేటీఆర్కు తీవ్ర జ్వరం రావడంతో పర్యటన వాయిదా పడినట్లు చెప్పారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం సూచించిన సన్నాలు సాగు చేయాలి తొర్రూరు: ప్రభుత్వం సూచించిన వరి సన్నరకాలు మాత్రమే సాగు చేయాలని ఏడీఏ శ్రీదేవి తెలిపారు. ఆదివారం తొర్రూరు పట్టణంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న విత్తన మేళాను సందర్శించారు. రైతులకు వివిధ రకాల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 7 వరి రకాలను సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ లభిస్తుందని తెలిపారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక పంటలను ఎంచుకోవాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పప్పు ధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యూరియాను సిఫార్సు చేసిన మోతాదులోనే విడతల వారీగా వినియోగించుకోవాలని కోరారు. తక్కువ నీటితో పండే అంతర పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. విత్తనాలు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు, విత్తన ట్యాగ్లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓలు రామ నర్సయ్య, స్వామి నాయక్, రైతులు పాల్గొన్నారు. వందశాతం అవకాశం కల్పించాలి కొత్తగూడ: షెడ్యూల్డ్ ప్రాంతంలోని అన్ని ఉద్యోగాల్లో ఆదివాసీలకు వందశాతం అవకాశం కల్పించాలని ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయబాబు డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని క్రీడా పాఠశాలలో జరిగిన ఆట జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జీఓ నంబర్ 3ని సవరిస్తూ మరో జీఓ విడుదల చేయాలని సూచించారు. గిరిజనేతరులతో కలిపి పదోన్నతులు కల్పించడం అన్యాయం అన్నారు. ఈ సమావేశంలో సువర్ణపాక పాపారావు, ప్రభాకర్, సారయ్య, ముడిగ సమ్మయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, సురేందర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ బావి వద్ద మొసలి కొత్తగూడ: మండలంలోని ఎంచగూడెం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్ద ఆదివారం మొసలి స్థానికులకు కనిపించింది. వాసం వీరస్వామి వ్యవసాయ బావి వద్ద మొసలిని చూసిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. కాగా, అటవీశాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకుని పాకాల సరస్సులో వదిలి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నేటి నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధి కారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసీం ఇక్బాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29, జూలై 1, 3, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు వారు తెలిపారు. -
నేడు వరంగల్కు నితిన్ నబీన్
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సోమవారం వరంగల్నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం 2 గంటలకు గిరిజన ప్రతినిధులతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. 3.10 గంటలకు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.40 గంటలకు హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. 4.40 నుంచి 5 గంటల వరకు హోటల్లో ఉంటారు. 5.10కి భద్రకాళి దేవస్థానం చేరుకుని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించుకుంటారు. అనంతరం హైదరాబాద్కు వెళ్తారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకులు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేల దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, చాడా శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్చందర్ రెడ్డి, వెంకటరమణ, జలగం రంజిత్, సతీష్, సత్యనారాయణ రావు, సండ్ర మధు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి గిరిజన ప్రతినిధులతో సహపంక్తి భోజనం.. సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలమైదానంలో కార్యకర్తలతో సమావేశం -
పనిచేయని లిఫ్ట్.. రోగుల అవస్థలు
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పనిచేయడం లేదు. నెలల తరబడి పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఆర్థోవార్డుకు తీసుకెళ్లేందుకు సిబ్బందితో పాటు సహాయకులకు తిప్పలు తప్పడం లేదు. కాగా, లిఫ్ట్ రిపేర్లో ఉందా లేదా వినియోగించకుండా నిలిపివేశారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి లిఫ్ట్ అందుబాటులోకి వచ్చేలా చూడాలని రోగులు కోరుతున్నారు. ● పట్టించుకోని జిల్లా ఆస్పత్రి అధికారులు -
చేపల వేటకు వెళ్లి..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి చిట్యాల: మానేరు వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామ శివా రులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మనబోతుల రఘుపతి, బిస్కుల ఈశాంత్, ఏదుల రంజిత్, భుక్యా సమ్మయ్య గ్రామ శివారులోని మానేరు వాగులో విద్యుత్ తీగలతో చేపల వేటకు వెళ్తూ మేకల రాజు(30)కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. దీనికి మొదటగా రాజు నిరాకరించినా బలవంతంగా ఒప్పించి తీసుకెళ్లారు. వాగు వద్ద అక్రమంగా మోటారు స్టార్టర్ ఫ్యూజ్ నుంచి తీగలు లాగి నీటిలో కరెంట్ షాక్ పెడుతూ చేపలు పట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో కట్టె విద్యుత్ వైరుకు అడ్డు రావడంతో వాగు ఒడ్డున ఉన్న రాజును పిలిచి ఆ వైరును తీయమని కోరారు. దీంతో ఆ కట్టెను తీస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నలుగురిని పోలీసులు అదుపుతోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మళ్లీశ్వరి ఉంది. -
ముక్కలైన కలల రెక్కలు
హసన్పర్తి: తల్లిదండ్రులకు అండగా నిలవాలని.. పైలట్గా ఉన్నత స్థానానికి చేరుకోవాలని.. కుటుంబాన్ని గర్వపడేలా చేయాలని సుమంత్ కన్న కలలు ఒక్క ప్రమాదంతో ముగిశాయి. ఆకాశాన్ని జయించాలని బయలుదేరిన యువకుడిని.. అదే ఆకాశం శాశ్వతంగా తనలో కలుపుకోవడం అందరినీ కలచివేస్తోంది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తూ.. ‘ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా’.. అని చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆ తల్లి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. పైలట్గా తిరిగి వచ్చి తల్లిదండ్రులకు గర్వకారణం కావా ల్సిన ఆ కుమారుడు.. శవపేటికలో వస్తాడనే విషయాన్ని ఆ కుటుంబం ఊహించలేదు. హసన్పర్తికి చెందిన ఆడెపు సుమంత్ (21) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో శిక్షణ విమానం భారత కాలమానం ప్రకారం శనివారం కుప్పకూలడంతో మృతిచెందాడు. ఈ వార్తతో కుటుంబంలో, గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మధ్య తరగతి కుటుంబం నుంచి.. హసన్పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడెపు వరలక్ష్మి–చంద్రమోళిది మధ్య తరగతి కుటుంబం. వ్యాపార రీత్యా చంద్రమౌళి కుటుంబం హసన్పర్తిలో స్థిరపడింది. చంద్రమౌళి హసన్పర్తిలో పెయింట్స్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆడెపు సుమంత్. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత 6నుంచి పదో తరగతి వరకు ఎల్లాపురంలోని ఎస్పీఆర్ పాఠశాలలో చదివాడు. ఇంటర్ ఆల్ఫోర్స్లో పూర్తి చేశాడు. పైలట్ కావాలన్నదే సుమంత్ లక్ష్యం. ఇందుకు సంబంధించిన పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందాడు. దక్షిణాఫ్రికాలో శిక్షణ కోసం గతేడాది వెళ్లాడు. మరో రెండు నెలలైతే.. మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఒక్క ఫోన్కాల్తో కుప్పకూలిన కుటుంబం శనివారం వచ్చిన ఒక ఫోన్కాల్ ఆ కుటుంబాన్ని శోకసద్రంలో ముంచింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.. అతను లేడు’అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామమంతా శోకసంద్రం సుమంత్ మరణవార్త తెలియగానే హసన్పర్తి గ్రామానికి చెందిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసినా వారి రోదనలు ఆగడం లేదు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ‘చాలా మంచివాడు.. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరం’అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు ఆగమంటాళ్లు సుమంత్ మృతదేహం ఇండియాకు పంపడానికి మరో మూడు రోజుల సమయం పడుతోందని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. పైలట్ కావాలన్న కల.. శిక్షణలోనే కూలిపోయిన విమానం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో హసన్పర్తికి చెందిన ట్రైనీ పైలట్ సుమంత్ మృతి రెండు నెలల్లో పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తానని తెలిపిన యువకుడు అంతలోనే తీవ్ర విషాదం.. తల్లిదండ్రులకు తీరని శోకం -
తల్లిదండ్రులూ.. ఆలోచించండి!
మైనర్ డ్రైవింగ్తో పెరుగుతున్న ప్రమాదాలు సాక్షి, వరంగల్: ‘మా బాబు బాగా డ్రైవింగ్ చేస్తా డు..’ ‘స్కూల్కు వెళ్లడానికి మాత్రమే..’ అంటూ మై నర్ల చేతికి బైక్లు ఇస్తున్న తల్లిదండ్రులు.. తెలియకుండానే వారి ప్రాణాలతో పాటు అమాయకుల ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తున్నారు. వారం రోజుల క్రితం పర్వతగిరి మండల కేంద్రంలో మైనర్ నడిపిన బైక్ ఢీకొని ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు తన ప్రాణం కూడా పోయింది. క్షణం నిర్లక్ష్యం ముగ్గురి కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్ను సీరియస్గా తీసుకున్న వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. మైనర్ డ్రైవింగ్ హాట్స్పాట్లుగా ఉండే స్కూళ్లు, కళాశాలల వద్ద ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఉదయం ఎనిమిది నుంచి పది గంటలు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య మైనర్లు ఎక్కువ వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సెకనులోనే.. మైనర్లకు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియదు. ఓవర్టేకింగ్, వేగ నియంత్రణ, బ్రేకింగ్ వంటి విషయాల్లో అనుభవం లేకపోవడంతో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడుతున్న విద్యార్థుల్లో గణనీయమైన సంఖ్య మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. ‘ఈ నెల 21న పర్వతగిరి మండల కేంద్రంలో 17 ఏళ్ల చరణ్ నడుపుతున్న బైక్.. ఎదురుగా వస్తున్న వడ్లకొండ ఎల్లగౌడ్(58), ఎండీ అహ్మద్ (58) ప్రయాణిస్తున్న బైక్ను వేగంతో ఢీకొనడంతో చరణ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఎల్లగౌడ్, అహ్మద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అలాగే, చరణ్ బైక్పై ఉన్న అతడి స్నేహితుడు చరణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగింది’ అని పోలీసులు గుర్తు చేస్తున్నారు. శిక్ష పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకు కూడా.. ‘ఇంటి నుంచి స్కూల్కు దగ్గర దూరమే అనే భావన. పిల్లల ఒత్తిడికి తల్లిదండ్రులు లొంగిపోవడం. పోలీసులు పట్టుకోరనే నిర్లక్ష్యం. స్నేహితుల ప్రభావంతో బైక్ నడపాలనే ఆసక్తి. సోషల్ మీడియాలో స్టంట్ల ప్రభావం’ ఈ అంశాలతోనే మైనర్ డ్రైవింగ్లు ఎక్కువవుతున్నాయుని సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ‘18 ఏళ్లలోపు పిల్లలు బైక్ నడిపితే కేసు కేవలం వారిపైనే కాదు. వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యజమానిపైనా నమోదవుతుంది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్షకూ అవకాశముంది. భవిష్యత్లో లైసెన్స్ రావడం కష్టమవుతుంది. పిల్లలు అడిగారని బైక్ ఇవ్వడం కంటే వారి భద్రత కోసం ‘ఇంకా రెండేళ్లు ఆగు’ అని చెప్పడం గొప్ప ప్రేమ. చిన్న నిర్లక్ష్యం జీవితాంతం తీరని విషాదంగా మారకముందే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి’ అని సీపీ సన్ప్రీత్ సింగ్ సూచించారు. పిల్లలకు ప్రేమతో ఇచ్చే బైక్.. ప్రాణాలకే ముప్పు చట్టం కఠినమే.. అయినా మారని పేరెంట్స్ తీరు స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవడంతో పోలీసుల ప్రత్యేక డ్రైవ్లు ఇటీవల పర్వతగిరిలో ఇద్దరి ప్రాణాలు తీసి మృతి చెందిన మైనర్ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్ డ్రైవింగ్పై నమోదైన కేసుల వివరాలు సంవత్సరం కేసులు 2024 174 2025 191 2026 96 ఏం పరిణామాలుంటాయంటే.. 18 ఏళ్లు పూర్తయితేనే ద్విచక్ర వాహనం నడపాలి ౖలెసెన్స్ తప్పనిసరి మైనర్కు బైక్ ఇస్తే వాహన యజమానిపై కూడా కేసు రూ.25 వేల వరకు జరిమానా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం వాహనం రిజిస్ట్రేషన్పై చర్యలు భవిష్యత్లో డ్రైవింగ్ లైసెన్స్పై ప్రభావం -
చినుకు పడితే చిత్తడే..
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని రోడ్లు కొద్దిపాటి వర్షానికే చిత్తడవుతున్నాయి. రోడ్లు గుంతలమయం కావడంతో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మరి అధ్వానంగా ఉంది. పలు కాలనీల్లో రోడ్లు జలమయం కావడంతో నడక కూడా నరకప్రాయంగా మారుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్ పనులతో కూడా పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. 75స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా ఓటర్లు 65,712 మంది ఉన్నారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. మున్సిపాలిటీ 75 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సుమారు 200కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో సుమారు 50శివారు కాలనీలు ఉన్నాయి. కాగా, పాత బజార్లోని ఏఎల్నగర్, బీటీఆర్నగర్, వెల్పుల సత్యంనగర్, సుందరయ్యనగర్ అంబేడ్కర్ కాలనీ, ఎన్ఎన్ నగర్, పలు కాలనీలో అంతర్గత రోడ్లు అంతంత మాత్రంగా ఉన్నాయి. కొత్త బజార్లోని 22,23,24,25,26 వార్డుల్లోని పలు కాలనీల్లో కూడా అంతర్గత రోడ్లు సరిగా లేవు. కాగా వర్షం పడినప్పుడు రోడ్లన్నీ జలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విలీన గ్రామాలైన ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి, అనంతారం, బేతోలు, రజాలిపేట, శనిగపురం గ్రామాల్లో కూడా రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. విలీన గ్రామాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి డ్రెయినేజీ రోడ్ల సమస్య పరిష్కరించాలని ఆయా గ్రామాల కౌన్సిలర్లు ప్రతీ కౌన్సిల్లో మొరపెట్టుకుంటున్నారు. జనసంచారం లేని ప్రాంతాల్లో రోడ్లు.. కంకరబోడ్ ప్రాంతంలోని ఎల్బీ స్కూల్ సమీపంలో జనసంచారం లేని చోట సీసీరోడ్డు నిర్మాణం చేశారు. అలా పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మానుకోట అభివృద్ధి కోసం రూ.59 కోట్లు విడుదల చేయించారు. ఆ నిధులతోనైనా రోడ్ల నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో సమస్యలు ఇలా.. జిల్లా కేంద్రంలోని ప్రధాన సెంటర్లలోని రోడ్లు కూడా గుంతలమయంగా మారాయి. ఈనెల 27న కురిసిన కొద్దిపాటి వర్షానికే పలు సెంటర్లలో రోడ్లు జలమయమై వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. కొత్తబజార్లోని బంధం చెరువు నుంచి కురవి రోడ్డు ఆర్వోబీ వరకు రోడ్డు గుంతలమయంగా మారి, వర్షానికి నిండిపోయాయి. జిల్లా ప్రధాన వైద్యశాల ముందు నుంచి నెహ్రూసెంటర్ సిగ్నల్ పాయింట్ వరకు రోడ్డుపై గుంతలు పడ్డాయి. వర్షపు నీటితో నిండిపోయాయి. శ్రీరామ మందిరం రోడ్డులో కూడా గుంతలు ఉండటంతో వర్షపు నీటితో నిండాయి. రైల్వే ఏక్యాబిన్ రోడ్డులో రహదారి పూర్తిగా దెబ్బతినడంతో బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాత బజార్లోని పలు ప్రధాన సెంటర్లతో పాటు మదర్ థెరిస్సా సెంటర్ నుంచి వివేకానంద సెంటర్ వరకు మిషన్ భగీరథ పైపులైన్ కోసం రోడ్డు ధ్వంసం చేశారు. శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో మరీ దారుణం. మానుకోట పట్టణంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయం మిషన్ భగీరథ పనులతో ధ్వంసం అసంపూర్తి కాల్వలే ప్రధాన కారణం జనసంచారం లేని ప్రాంతాల్లో మాత్రం రోడ్ల నిర్మాణాలుశివారు కాలనీలో పరిస్థితి దారుణం ఎల్ నగర్, బీటీఆర్నగర్తోపాటు శివారు కాలనీలో అంతర్గత రోడ్లు పూర్తిస్థాయిలో లేవు. ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల నిర్మాణాలు చేయాలని పలు మార్లు వినతులు ఇచ్చారు. –కుమ్మరి కుంట్ల నాగన్న, స్థానికుడువిలీన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేయాలి విలీన గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ లో కలిపిన తర్వాత పన్నులు పెరిగినవి తప్ప అభివృద్ధి జరగలేదు. ప్రధానంగా రోడ్ల సమస్య పరిష్కరించాలి. –ఖాదర్ బాబా, బేతోలు గ్రామం -
గిరిజనుల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం
● మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ హన్మకొండ : గిరిజనుల అభివృద్ధికి కేంద్రంలోని న రేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మాజీ ఎంపీ ప్రొఫెసర్, అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు గిరిజన తెగలను ఎస్టీలో కలిపిందని వివరించారు. ఆదివాసీ గిరిజన మహిళ ద్రౌపది ము ర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది అన్నారు. ‘వికసిత్ భారత్–2047– గిరిజన అభివృద్ధి’ అనే అంశంపై నేడు హరిత కాకతీయ హోటల్లో గిరిజన ప్రతినిధులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మేధోమధనం నిర్వహించనున్నారన్నారు. బీ జేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్లు వ్యతిరేకించాయన్నారు. గిరిజన అభివృద్ధికి ప్రాధాన్యం ఇ స్తున్న మోదీ ప్రభుత్వం 23 ఏకలవ్య స్కూళ్లు ఏర్పా టు చేసిందని, సమ్మక్క సారలమ్మ గిరిజన యూ నివర్సిటీ ఏర్పాటుతోపాటు రూ.899 కోట్లు కేటా యించిందని వివరించారు. బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ట్రైబల్ డిక్లరేషన్ పేరుతో మోసం చేసిందని దుయ్యబట్టారు. నాయకులు మార్తినేని ధర్మారావు, వన్నాల వెంకటరమణ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, యాప సీతయ్య, రావు పద్మ, గంట రవికుమార్, కొండేటి శ్రీధర్, దిలీప్ నాయక్, మల్లాడి తిరుపతి రెడ్డి, బన్న ప్రభాకర్, అజ్మీరా కృష్ణవేణి, స్వరూప, పగడాల కాళీప్రసాద్, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు. -
పీవీ .. ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి
హన్మకొండ: ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కా ర్యాలయంలో మాజీ ప్ర ధాని పీవీ నర్సింహారావు జయంతి నిర్వహించా రు. ఈ సందర్భంగా ిపీవీ చిత్ర పటానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి. తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.వెంకటరమణ, నాగ ప్రసాద్, సీజీఎంలు రవీంద్రనాథ్, కిషన్, జాయింట్ సెక్రటరీ శ్రీ కృష్ణ, జీఎంలు హేమంత్ కుమార్, మనోహర్ స్వామి, వేణు బాబు, కళాధర్, జయరాజ్, వెంకట కృష్ణ, తిరుపతి, ప్రభావతి, డి.ఈ టెక్నికల్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్కాళోజీ సెంటర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్కుమార్ మాట్లాడుతూ.. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్ప్రసాదరావు, ఉపాధ్యక్షుడు నామోజు శ్రీనివాస్, కోశాధికారి ఎస్ఏ రావూఫ్ తదితరలు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ రెడ్డికాలనీలోని వికాస్ మాస్టర్జీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చదరంగ పోటీలు ఆదివారం ముగిశాయి. ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రాండ్ చాంపియన్ అర్జున్ను స్ఫూర్తిగా తీసుకుని చెస్లో రాణించాలన్నారు. పాఠశాల ఏఓ నాగరాజు మాట్లాడుతూ చిన్నారులు సెల్ఫోన్కు దూరంగా ఉంటూ ఆట, చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జూలై 11, 12వ తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. ఆర్బిటర్స్ ప్రేమ్సాగర్, రజనీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల వార్డులో పాము ప్రత్యక్షం
● సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో భయం.. భయం కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పాముల భయం నెలకొంది. తాజాగా శనివారం ఎస్ఎన్సీయూ పిల్లల వార్డులోని సింక్ వరకు ఓ పాము రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. పసికందులు ఉండే ఫొటోథెరపి రూంలోకి పాము వచ్చి బల్లిని నోటకరుచుకోవడంతో సిబ్బందితోపాటు తల్లులు భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తర్వాత పాము వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా మూడు రోజుల క్రితం కూడా ఓ పాము వచ్చిందంటూ పేషెంట్ల అటెండెంట్లు తెలిపారు. ఇలా పాములు వస్తే మా బిడ్డలు, పసికందుల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. పాముల విషయంపై ఇన్చార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ సృజన్ను వివరణగా కోరగా... పాము వార్డులోకి వచ్చినట్లు తెలిసిందని, అప్పుడు తాను కలెక్టరేట్లో ఉన్నానని చెప్పారు. అయినా వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించామని తెలిపారు. పాములు సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
మహబూబాబాద్ అర్బన్: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో శనివారం సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు విద్యార్థులకు మాదకద్రవ్యాల నిరోధకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిరాథోడ్, జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, డీఎస్పీ తిరుపతిరావు హాజరై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల కట్టడికి ఎస్పీ షబరీష్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎక్కడై ఖాళీ ప్రదేశాల్లో అనుమానిక వ్యక్తులను గుర్తించి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ ఇన్చార్జ్ అధికారి శీరిష, డీఐఈఓ మదార్గౌడ్, స్పెషల్ డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ నిశాంత్ కుమార్, డీవైఎస్ఓ జ్యోతి, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ప్రిన్సిపాల్ రమేష్ కుమార్, ఎకై ్సజ్ సీఐ చీరంజీవి, చైల్డ్లైన్ అధికారులు చైతన్య, కమలాకర్, వీరన్న, నరేష్, హరీష్, తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
● సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్కసాక్షిప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్, పొట్లాపూర్ ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ పరిధిలోని నీటిపారుదల శాఖ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్న ఈ సమావేశంలో రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్కు అవసరమైన భూసేకరణపై అధికారులు సమగ్ర నివేదిక సమర్పించారు. తాజా మార్కెట్ ధరల ప్రకారమే భూసేకరణ.. కాసిందేవిపేట, ఇంచెర్ల, రామచంద్రాపూర్ గ్రామాల్లో ఈ ప్రాజెక్టుకు మొత్తం 244.23 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటివరకు 201.03 ఎకరాలకు మాత్రమే అవార్డులు జారీ అయినప్పటికీ భూసేకరణ పూర్తికాలేదని తెలిపారు. 2020–21లో జారీ చేసిన అవార్డుల ప్రకారం ఎకరాకు రూ.2.47 లక్షల నుంచి రూ.8.26 లక్షల వరకు మాత్రమే పరిహారం నిర్ణయించగా, ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలు భారీగా పెరగడంతో ఆ ధరలకు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రి సీతక్క 2020–21లో జారీ చేసిన పాత భూసేకరణ అవార్డును ఉపసంహరించి, తాజా మార్కెట్ విలువల ఆధారంగా కొత్త అంచనాలతో వెంటనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలో రామప్ప–లక్నవరం కెనాల్ పూర్తయ్యేలా.. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రామప్ప చెరువు నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమై 8,700 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు లక్నవరం పర్యాటకాభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించి, వచ్చే వారంలోనే శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ప్రజారోగ్యంతో చెలగాటమాడొద్దు
● ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ధర్మేందర్ మహబూబాబాద్/మహబూబాబాద్ రూరల్: వ్యా పారులు, రెస్టారెంట్ల నిర్వాహకులు, వైన్స్ షాపుల్లో క్యాంటిన్ నిర్వహించే వారు తప్పని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన వస్తువులు, తాజా నూనెను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ ధర్మేందర్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లను, వైన్స్షాపుల క్యాంటీన్లను శనివారం ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్తో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మరుగబెట్టిన నూనెను ఉపయోగిస్తున్నారని, అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్నారు. చికెన్కు రంగులు పూస్తు హానికరమైన కెమికల్స్ కలుపుతున్నారన్నారు. పరిశుభ్రత కూడా పాటించడం లేదని మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. గంట పాటు రెస్టారెంట్లు, వైన్స్ క్యాంటీన్లు తనిఖీ చేయగా ని బంధనలకు విరుద్ధంగా ఉండటంతో రూ.36,000 జరిమానా విధించామన్నారు. ఆహార నిమయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించా మన్నారు. ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేస్తామని, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. -
ఆశల జల్లులు
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026● జిల్లాలోని 13 మండలాల్లో చిరుజల్లులు ● పత్తి, పునాస, పచ్చిరొట్టకు ఆసరా ● మరో వాన పడితే ఖరీఫ్ వరి సాగుకు సై సాక్షి, మహబూబాబాద్: మొఖం చాటేసిన మేఘాలతో అన్నదాత ఆందోళన చెందుతున్నారు. వర్షం కోసం జిల్లా వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. కోలాటాలు ఆడుతున్నారు. బండపాశం వండుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో శుక్రవారం సాయంత్రం మొదలైన చిరుజల్లులు, శనివారం ఉదయం వరకు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పత్తి, పునాస, పచ్చిరొట్ట పంటలకు ఉపశమనంగా ఉంటుందని సంతోషపడుతున్నారు. పత్తి పంటకు ఆసరా జిల్లాలో కురిసిన జల్లులతో పత్తి పంటకు ఆసరాగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. జూన్ నెలలో దుక్కులు దున్నుకొని బావులు, బోర్ల నీళ్లతో దుక్కులు తడిపి కొందరు, వట్టి దుక్కిపై మరికొందరు పత్తి విత్తనాలు నాటారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 10 వేల ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు విత్తినట్లు అంచనా. అదేవిధంగా పునాస పెసర, నువ్వులు, కందుల విత్తనాలు చల్లారు. దీంతోపాటు పచ్చిరొట్ల పిల్లిపెసర, జీలుగ, జనుము విత్తనాలు చల్లారు. అయితే వర్షాలు లేకపోవడంతో మొలిచిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. భూమిలోనే ఉన్న విత్తనాలు పాడవుతున్నాయని రైతులు ఆందోళన చెందారు. ఇప్పుడు కురిసిన వర్షాలతో కొంత మేరకు ఉపశమనంగా ఉంటుందని, మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో పెద్ద వర్షం వస్తే వాగులు, చెరువులు, కుంటల్లో నీరు చేరుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశగా చూస్తున్నారు. బయ్యారంలో భారీ వర్షం బయ్యారం: తొలకరి ఆరంభం నుంచి భారీ వర్షం కురవక పంటలసాగుపై ఆశలు వదులుకుంటున్న రైతులకు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షం ఆశలు రేకెత్తించింది. బయ్యారం, జగ్గుతండా, వెంకట్రాంపురం, కొత్తపేట, ఇర్సులాపురం తదితర పంచాయతీల్లో కురిసిన భారీ వర్షంతో పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. ప్రత్తి, మొక్కజొన్న, పెసర పంటలతో పాటు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేసే రైతులకు ఈ వర్షం ఉపయోగకరంగా మారింది. మరిపెడలో.. మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం భారీ వర్షం కురవడంతో పలు వీధులు జలమయమయ్యాయి. జాతీయ రహదారి కార్గిల్ సెంటర్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. ద్విచక్రవాహనాలు వెళ్లే పరిస్థితి లేక అవస్థలు పడ్డారు. రామావిలాస్ సందు, పూలబజారు తదితర వీధుల్లో వర్షపు నీరు నిలిచింది. -
పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయ్!
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జూన్ మాసంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో వీధికో స్కూల్ చొప్పున వెలుస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ స్కూల్లో చేర్పించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అర్హతలేని వారు సైతం పాఠశాలలు నెలకొల్పుతూ అందినకాడికి దండుకుంటున్నారు. విద్యా సంస్థల నిర్వహణలో ప్రైవేట్ ఇష్టారాజ్యం, గుర్తింపు లేకుండానే స్కూళ్లు ప్రారంభించడం, నాలుగైదు స్కూళ్లకు అనుమతులు తీసుకుని పదుల సంఖ్యలో బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు సెక్షన్లు అంటూ మాయాజాలంలో పడేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ తరగతికి రెండు కంటే ఎక్కువ సెక్షన్లు నిర్వహించకూడదు. అయినప్పటికీ ఏ పాఠశాలలో చూసినా ఆ నిబంధనలు అమలు అవుతున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ నిబంధనలు ఇవీ.. ప్రైవేట్ స్కూళ్లలోని నిరుపేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలనే నిబంధన ఆర్టీఈ చట్టంలో ఉంది. సెక్షన్ 18 ప్రకారం ప్రైవేట్ స్కూళ్లు తమ స్థాయి, మౌలిక సదుపాయాలు, ఫీజుల వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. పాఠశాలను నిర్వహించాలంటే తప్పనిసరిగా భవన యజమానితో లీజు అగ్రిమెంట్ ఉండాలి. కనీసం ఐదేళ్ల లీజు ఉండేలా భవన యజమాని అనుమతి ఇవ్వాలి. భవనంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలి. అగ్నిమాపకశాఖ నుంచి ధృవపత్రం పొందాల్సి ఉంటుంది. అలాగే పాఠశాల ఏర్పాటుతో ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలుగదని సంబంధిత ట్రాఫిక్ పోలీసుల నుంచి ధృవపత్రం తీసుకోవాలి. పాఠశాల భవన గదుల్లో బోధనకు రీసౌండ్ సంబంధించి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పట్టణాల్లో అయితే 2వేల చదరపు మీటర్ల విస్తీర్ణం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో మైదానం ఉండాలి. అయితే పట్టణాల్లో 2 వేల చదరపు మీటర్ల మైదానం సాధ్యం కానందున ఇండోర్గేమ్స్ కోసం అనుమతి ఇస్తారు. లేదంటే ప్రభుత్వ మైదానాలు, పార్కుల్లో ఆటల కోసం లీజు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతీ తరగతికి ఒక సెక్షన్ నిర్వహించుకోవచ్చు. ఒకవేళ అదనంగా మరొక సెక్షన్ నిర్వహించుకోవాలంటే ప్రభుత్వానికి రూ.20వేల చలానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అనుమతి ఇస్తుంది. ఉన్నత పాఠశాలలకు ఆర్జేడీ ద్వారా పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ నుంచి అనుమతి పొందాలి. అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన.. పుట్టగొడుల్లా వెలుస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వాటిలో అర్హత లేని ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నట్లు సమాచారం. చాలా పాఠశాలల్లో కేవలం ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు ఉన్నవారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో డీఈడీ శిక్షణ పొంది ఉన్నట్లయితే విద్యార్థుల మనస్థత్వాన్ని ఎరిగి వారిని విద్య పట్ల ఆకర్షితులను చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత తరగతులు బోధించే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బీఈడీ, టెట్ అర్హత సాధించి ఉండాలి. అయితే ఎలాంటి ట్రైనింగ్ లేకున్న కేవలం అకడమిక్ అర్హతలతోనే ఉపాధ్యాయలుగా నియమిస్తున్నట్లు తెలుస్తుంది. గుర్తింపు లేకపోతే సీజ్ చేస్తాం.. తల్లిదండ్రులు వారి పిల్లలను స్కూళ్లలో చేర్చే ముందు ఆయా పాఠశాలలు ప్రభుత్వ అనుమతి తీసుకున్నాయా లేదా పరిశీలించుకోవాలి. లేదంటే పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు గుర్తింపు లేని పాఠశాలలను సీజ్ చేస్తాం. జిల్లాలో గుర్తింపులేని పాఠశాల జాబితాను సిద్ధం చేశాం. త్వరలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – ఏ.సత్యనారాయణమూర్తి, డీఈఓ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం పోటాపోటీగా పెరుగుతున్న పాఠశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో విద్యాలయాలు అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన పట్టించుకోని సంబంధితశాఖ అధికారులు -
ఆంగ్ల మాధ్యమంపై దృష్టి సారించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ దంతాలపల్లి: ప్రతీ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయులు చెబుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. గ్రంథాలయం, పాఠశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆంగ్ల భాషను సులభంగా అర్థమయ్యేలా బోధించాలని, వారిలో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉందన్నారు. అనంతరం మండలకేంద్రంలో నిర్వహిస్తున్న విత్తనమేళాను పరిశీలించారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి, నేలకు మేలు చేసే నానో యూరియాను వాడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునిల్కుమార్, ఎంఈఓ శ్రీదేవి, ప్రధానోపాధ్యాయుడు వేణు మాధవరెడ్డి, ఏఓ వాహిని, ఏఈఓ హర్షవర్దన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయొద్దు
● వాహనాలకు గొలుసులు, తాళ్లు కట్టడం చట్ట విరుద్ధం ● వరంగల్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జాఫర్ మహబూబాబాద్ రూరల్: రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులు, ఇతర వాహనదారులను పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేయొద్దని వరంగల్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎండీ.జాఫర్ అన్నారు. పార్కింగ్ కష్టాలు అనే శీర్షికన సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి రైల్వే శాఖ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా రైల్వే వరంగల్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జాఫర్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని కొత్త బజారు వైపున గల పార్కింగ్ స్టాండ్ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న వాహనాలకు తాళ్లు కట్టి ఉంచడానికి గమనించి వాటికి ఉన్న తాళ్లను తొలగించాలని పార్కింగ్ స్టాండ్ నిర్వాహకుడు సతీష్ను ఆదేశించారు. వాహనాలకు గొలుసులు, తాళ్లు వేసి కట్టిపెడితే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పార్కింగ్ స్టాండ్కు కేటాయించిన స్థలం వరకు మాత్రమే వాహనాల పార్కింగ్ కోసం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ ఖాళీ ప్రదేశాల్లో వాహనాలు నిలుపుదల చేస్తే ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు చూసుకుంటారన్నారు. ప్రయాణికులు, ఇతర వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
ప్రభుత్వం సూచించిన సన్నరకాలకే బోనస్
బయ్యారం: ఖరీఫ్లో ప్రభుత్వం సూచించిన వరి సన్న రకాలు సాగు చేస్తేనే బోనస్ చెల్లిస్తారని డీఏఓ విజయచంద్ర సూచించారు. మండలంలోని కొత్తపేట రైతువేదికలో నిర్వహిస్తున్న విత్తన మేళాను ఆయన సందర్శించి మాట్లాడారు. వరిపంటలో యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, నానో యూరియా వాడాలని రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. పంటమార్పిడితో అధిక దిగుబడులు.. గార్ల: పంట మార్పిడి విధానం ద్వారా భూమి సారవంతం కావడంతో పాటు, పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని డీఏఓ విజయచంద్ర సూచించారు. శుక్రవారం గార్లలోని రైతు వేదికలో కొనసాగుతున్న విత్తన మేళాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఖరీఫ్లో సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు మేలైన విత్తనాలు ఎంచుకొని యాజమాన్య పద్ధతులను అవలంభించడం, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం వల్ల పంటల్లో దిగుబడులు పెరుగుతాయన్నారు. ఏఓ కావటి రామారావు, ఏఈఓలు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలతో యువత నిర్వీర్యం
● డీఎస్పీ ఎన్.తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్ : మత్తు పదార్థాలతో యువత నిర్వీర్యం అవుతుందని, యువత మత్తువదిలి మంచిగా బతకాలని డీఎస్పీ నంబూరు తిరుపతిరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ సబ్ జైలులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ తిరుపతిరావు హాజరై జైలులోని ఖైదీలచే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించి మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేవి యువతను నిర్వీర్యం చేస్తూ వారి భవిష్యత్ను అంధకారం చేస్తున్నాయని, నేర అవి నీతి రహిత సమాజమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిలాంటి మత్తు పదార్థాలు ఏరూపంలో ఉన్నా, సేవించినా, ఇతరులకు అమ్మినా, రవాణా చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ బారినపడిన యువత తీవ్ర నేరాలకు పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని వాపోయారు. డ్రగ్స్ మహమ్మారిని తుదముట్టించేందుకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేస్తుందని, ఇందులో భాగంగా గంజాయి సాగు, అమ్మకంతో పాటు ఉపయోగించే వారిపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, పోలీసులకు సమాచారం ఇచ్చినవారికి రూ.5 వేల పారితోషకం కూడా ఉంటుందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అనంతరం గంజాయితో పాటు వివిధ నేరాలకు పాల్పడిన ఖైదీలకు ప్రత్యేకంగా సూచనలు, సలహాలతో కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జైలర్ మల్లెల శ్రీనివాసరావు సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, జైలు సిబ్బంది ఖలీల్, లక్ష్మన్, వీరన్న, జనార్దన్, రామాంజనేయులు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా నిర్వహించాలి
తొర్రూరు: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్, పాలకుర్తి నియోజకవర్గ ప్రత్యేక అధికారి బెన్షాలోమ్ సూచించారు. శుక్రవారం మండల రెవెన్యూ కార్యాలయంలో సూపర్వైజర్లు, బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. బీఎల్ఓలు ఇంటింటకీ వెళ్లి కొత్త ఓటరు గణన, పేర్లు, చిరుమానాలు, ప్రాంతాల మార్పులు, మరణించిన, అనర్హత ఓటర్ల తొలగింపు వంటి సవరణలు చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు, జీపీఓలు పాల్గొన్నారు.. నేడు శనిత్రయోదశి పూజలు హన్మకొండ కల్చరల్: శనిత్రయోదశి పుస్కరించుకుని శనివారం ఉదయం 5 గంటల నుంచి శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనిపూజలు, నవగ్రహ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఏలిననాటి శని, అష్టమ శని గ్రహప్రభావాలతో బాధపడుతున్న వారు పూజల్లో పాల్గొనాలని, తైలాభిషేకాలు, తిల పూజలు, తిల దానాలు, వస్త్రదానాలు చేసి శని పీడ నుంచి విముక్తులు కావొచ్చని వారు పేర్కొన్నారు. భర్తీ ఎప్పుడు? ● సీకేఎంలో ఇంకా ఖాళీగా ఆర్ఎంఓ పోస్టుకాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్ఎంఓ పోస్టు భర్తీ కావట్లేదు. గత మూడు నెలల నుంచి ఈ అధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో ఇన్చార్జ్ ఆర్ఎంఓలు బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. ఆర్ఎంఓ స్థాయి అధికారి లేకపోవడం వల్ల వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల్లో పీజీ విద్యార్థికి ఆర్డర్.. ఇటీవల జరిగిన బదిలీల్లో సీకేఎం ఆస్పత్రి ఆర్ఎంఓగా ఓ పీజీ విద్యార్థినికి ఆర్డర్ ఇవ్వడం అయోమయానికి గురిచేసింది. సంగారెడ్డి జిల్లా ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో గైనిక్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న డాక్టర్ గీతాలక్ష్మికి ఆర్ఎంఓగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వీస్ కోటాలో ఓబీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఆర్ఎంఓగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాల్లో ఆర్ఎంఓగా విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. గైనిక్ కోర్సు పూర్తి చేయనివారికి ఎలా ఆర్డర్ ఇచ్చారని సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ రిపోర్టు చేయకుండానే తిరిగి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులకు వివరించినట్లు సమాచారం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సెంట్రల్ జోన్ పోలీసులు కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ఏర్పాటు చేసిన 2కే రన్ను కలిసి సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంట్రాంరెడ్డి, డీసీపీలు ధార కవిత, అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. -
ఇల్లుపీకి.. పందిరేసి
సాక్షి, మహబూబాబాద్: పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు రూ.287.24కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 5,415 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అయితే ఇందులో ఇప్పటి వరకు 2,773ఇళ్లు పూర్తికాగా.. 1,798 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారు. ఇందులో 1,728 కుటుంబాలు ఇళ్లలోకి చేరగా.. 975 ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. మిగిలిన 2,542 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. ముఖం చాటేసిన కాంట్రాక్టర్ డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామని ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకుండానే ముఖం చాటేశాడు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు తోడు ఒక్కో లబ్ధిదారుడి నుంచి అదనంగా రూ.2లక్షలకు పైగా వసూలు చేశాడు. మరికొన్ని గ్రామాల్లో నాయకులకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు ముట్టచెప్పామని లబ్ధిదారులు చెబుతున్నారు. అయితే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ లబ్ధిదారులు ఇచ్చిన డబ్బులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాడు. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టగా.. మరికొన్ని గ్రామాల్లో లబ్ధిదారుల సొంత స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. స్లాబ్ లెవల్ వరకు కొన్ని, పిల్లర్లు, బేస్మెంట్ వరకు మరికొన్ని నిర్మించి వదిలి పెట్టాడు. అయితే ప్రభుత్వ స్థలంలో నిర్మించి ఇళ్ల పరిస్థితి అలాగే ఉన్నా. ఇల్లు పీకి కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశపడిన వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మొండిగోడలపై గోనెబస్తాలు, పాత చీరలు కట్టుకొని.. డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు కావడంతో నిర్మాణం కోసం పాత ఇళ్లు కూల్చివేశారు. కొత ఇళ్లు స్లాబ్పోసి కాంట్రాక్టర్ వదిలేశాడు. దీంతో ఐదు సంవత్సరాలుగా లబ్ధిదారులు గోడలు, పిల్లర్ల మధ్యలో గోనె సంచులు, పాత చీరలు కట్టుకొని ఉంటున్నారు. మరికొందరు ఇంట్లో ఉన్న బర్రెలు, బంగారం అమ్ముకొని, ఇంకొందరు గిరిగిరి, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్, డ్వాక్రా రుణాలతో వచ్చిన డబ్బులతో గోడలు పెట్టుకున్నారు. అప్పులు తీర్చేందుకు కొన్ని కుటుంబాలు గ్రామం విడిచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఖమ్మం వంటి పట్టణాలకు వలస వెళ్లి పనిచేసుకొని వచ్చిన డబ్బులతో కిస్తీలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ ఫొటోలోని మహిళ కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ ధనమ్మ. ఐదు సంవత్సరాల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇల్లు పొందేందుకు అర్హత సాధించింది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు రూ.2లక్షల అదనంగా ఇస్తే ఇల్లు మంచిగా నిర్మిస్తానని కాంట్రాక్టర్ నమ్మబలికాడు. దీంతో ముందుగా రూ.1.5లక్షలు ఇచ్చింది. పాత ఇల్లు కూల్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టారు. స్లాబ్ లెవల్ వరకు పనులు చేపట్టి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ ముఖం చాటేశాడు. దీంతో పుస్తెల తాడు అమ్ముకొని గోడలు పెట్టుకొని అసంపూర్తి ఇంట్లో ఉంటున్నారు.’ మొండిగోడల్లో బస్తా సంచులు, పాత చీరలు కట్టుకొని జీవనం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పాత ఇళ్లు కూల్చివేత కాంట్రాక్టర్కు ఒక్కో ఇంటికి రూ.2లక్షలకు పైగా ఇచ్చిన లబ్ధిదారులు అసంపూర్తి నిర్మాణాలతో ముఖం చాటేసిన కాంట్రాక్టర్ ఐదేళ్లుగా అవస్థలు పడుతున్న పేదలుఅసంపూర్తి నిర్మాణాలకోసం కొత్త ప్రణాళిక జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకోసం జీఓ నంబర్ 5 ద్వారా డబుల్ బెడ్రూం ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చి నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇప్పటికే వివరాలు సేకరించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నిర్మాణాలు మొదలు పెడతాం. బిల్లులు వసూళ్లు చేసి నిర్మాణాలు ఆపివేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటాం. –పురుషోత్తం, ఇన్చార్జ్ హౌసింగ్ ప్రాజెక్టు అధికారి -
పార్కింగ్ కష్టాలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధి కొత్త బజార్ వైపు వాహనాల పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మూడో నంబర్ ప్లాట్ ఫారం వైపున ఉన్న ఖాళీ ప్రదేశం మొత్తం తమ పరిధిలోకి వస్తుందంటూ ప్రయాణికుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులను రైలెక్కిచ్చి వచ్చేలోపు తమ వాహనాలను గొలుసులు, తాళ్లతో కట్టిపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నో పార్కింగ్ పేరిట.. నో పార్కింగ్ పేరిట ఇష్టం వచ్చినట్లు బోర్డులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వాహనాలు నిలిపినవారిని నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రయాణికులు తెలిపారు. రైల్వే పార్కింగ్ స్థలానికి కేటాయించిన ప్రదేశం కంటే అధిక మొత్తంలో స్థలాన్ని ఆక్రమించి ఎక్కడ కూడా వాహనాలు పార్కింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ తమ వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లి వచ్చేలోగా గొలుసులు, తాళ్లుకట్టి పెడితే ఆయన పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని అడిగితే తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పందించి నో పార్కింగ్ పేరిట డబ్బుల వసూళ్లు, పార్కింగ్ స్టాండ్ నిర్వహణ విషయంపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. వాహనాలు నిలుపనివ్వటం లేదు రైల్వే స్టేషన్ ఆవరణలోని పార్కింగ్ స్టాండ్ సమీపంలో ప్రయాణికులు ద్విచక్ర వాహనాలు, కార్లు తీసుకుని వస్తే ఇక్కడ నిలుపనివ్వడంలేదు. ప్రయాణికులు వచ్చివెళ్లేలోగా గొలుసులు, తాళ్లతో కట్టిపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యంగా వ్యవహరిస్తూ పార్కింగ్ మొత్తం తమ పరిధిలోకి వస్తుందని బెదిరిస్తున్నారు. టికెట్లు కొనుగోలు చేసి వచ్చేసరికి వాహనాలు ఇక్కడి నుంచి తీసేయాలని అంటున్నారు. –గిద్దల రమేశ్, పర్వతగిరి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు, వారి బంధువుల ఇబ్బందులు పార్కింగ్ స్టాండ్ నిర్వాహకులు దౌర్జన్యం చేస్తున్నారని వాహనదారుల ఆరోపణ నో పార్కింగ్ పేరిట వసూళ్లు -
వరద కాల్వలకు మోక్షం
మహబూబాబాద్: మానుకోట పట్టణంలో ముంపు ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు రూ.12 కోట్లు కేటాయించగా.. పనులకు అగ్రిమెంట్ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. నీటి పారుదలశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేయనున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ ఈనెల 22న సంబంధిత అధికారులతో ఆ స్థలాలను పరిశీలించి ఫైనల్ చేశారు. గతంలో కొన్ని.. వర్షాకాలంలో మానుకోటలోని పలు ప్రాంతాలు కొద్దిపాటి వర్షానికే ముంపునకు గురవుతున్నాయి. కాగా, గతంలో బస్తీదవాఖాన ఎదుట, బ్రహ్మకుమారీస్ మందిరం సమీపం, పీఎస్ఆర్ గార్డెన్ సమీపం, రాహుల్ నగర్లో మేజర్ వరద కాల్వలు, వాటితో పాటు సుమారు 10 మైనర్ వరద కాల్వల నిర్మాణం చేశారు. ప్రస్తుతం మరిన్ని నిర్మాణం చేయనున్నారు. రూ.12కోట్ల కేటాయింపు.. మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.59 కోట్లు విడుదల చేయించారు. కాగా, వాటిలో రూ.12 కోట్లు వరద కాల్వలు కోసం కేటాయించారు. వరద కాల్వ లు నిర్మాణం జరిగే ప్రాంతాలివే.. ● బంధం చెరువు నుంచి పాషివాగు నుంచి జనాల చెరువు వరకు 835 మీటర్ల మేర వరద కాల్వ నిర్మాణం చేస్తారు. ● జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ సమీపంలో ఉన్న సెవెన్ హిల్స్ నుంచి బంధం చెరువు వరకు 805 మీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ● నర్సంపేట ఎన్హెచ్ బైపాస్ నుంచి గుండ్లకుంట చెరువు వరకు 100 మీటర్ల వదర కాల్వ నిర్మాణం. ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ నుంచి నిజాం చెరువు వరకు 700 మీటర్ల కాల్వ. ● హస్తినాపురం నుంచి నిజాం చెరువు వరకు 250 మీటర్ల కాల్వ, సిగ్నల్ కాలనీ నుంచి రైల్వేట్రాక్ కింది నుంచి నిజాం చెరువు వరకు 400 మీటర్ల వదర కాల్వ. నిజాం చెరువు నుంచి రాబంద్రుచెరువు వరకు 436 మీటర్లతో కాల్వ నిర్మాణం చేయనున్నారు. చెరువులకు అనుసంధానం.. వరద కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తారు. దీంతో నీరు వృథా కాదు, భూగర్భ జలాలు పెరుగుతాయి. ముంపు ప్రాంతాలు జలమయం కావు. చెరువులకు అనుసంధానం చేయనుండటంతో నీటిపారుదలశాఖ అధికారుల సూచనలు, సలహాల ప్రకారం నిర్మాణం చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఆ స్థలాలకు ఇరిగేషన్ అధికారుల నిర్ణయం మేరకు మార్కింగ్ చేశారు. ఏడాది గడువు.. వరదకాల్వల పనులను ఏడాదిలోపు పూర్తి చేయాల్సి ఉంది. కాగా ఈనెలలోనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నారు. పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో ముంపు సమస్య తీరుతుంది. ముంపు ప్రాంతాల గుర్తింపు మానుకోట పట్టణంలోని స్నేహనగర్, రామన్నపేట కాలనీ, మన్మదతోట ప్రాంతం, గుండ్ల కుంట కాలనీ, జమాండ్లపల్లిలో కొంతభాగం, బంధం చెరువు ప్రాంతం ప్రధానమైన ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వీటితో పాటు జగ్జీవన్రావు నగర్ కాలనీ, ఏల్ నగర్ కాలనీ, ధర్మన్న కాలనీ శివారు కొంతభాగం (కృష్ణస్వామి కుంట), ఏటి గడ్డ తండా, సిగ్నల్ కాలనీలో కొంతభాగం, తదితర ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వర్షాకాలంలో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో కసరత్తు చేస్తున్నారు. కాల్వలతో సమస్య తీరుతుంది వరద కాల్వల నిర్మాణాలతో ముంపు సమస్య తీరుతుంది. వాటిని చెరువులకు లింకు చేయడం వల్ల నీరు వృథా కాదు. మళ్లీ నిధులు విడుదల కాగానే మిగిలిన ముంపు ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేస్తాం. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూస్తూ గడువులోపు పూర్తి చేస్తాం. –ఎం.వినోద్కుమార్, మున్సిపల్ కమిషనర్ రూ.12కోట్లు కేటాయింపు.. అగ్రిమెంట్ పూర్తి ముంపు ప్రాంతాల్లో త్వరలోనే పనులు ప్రారంభం ఆ కాల్వలు చెరువులకు అనుసంధానం ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో పనులు -
ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులు
● 170 మంది కేటాయింపు కాశిబుగ్గ: ఎట్టకేలకు ఎంజీఎం ఆస్పత్రికి స్టాఫ్ నర్సులొచ్చారు. దవాఖానా నుంచి బదిలీ అయిన వారి స్థానంలో కొత్తగా ఎవరూ జాయిన్ అవకపోవడంతో తొలుత అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో నర్సింగ్ సూపరింటెండెంట్ దయాశీల, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజాత అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎంలో పేషెంట్లకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు బీఎస్సీ, జనరల్ నర్సింగ్, పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి నర్సింగ్ స్టాఫ్ను రప్పించారు. స్టాఫ్ నర్సుల స్థానంలో వీరు ప్రత్యామ్నాయంగా సేవలందిస్తున్నారు. ఖాళీగా 284 పోస్టులు ఎంజీఎం దవాఖనాలో రోగులకు సేవలు అందించడానికి 478 మంది స్టాఫ్నర్సులు అవసరం ఉండగా.. కేవలం 194 మందితో వైద్యసేవలు అందిస్తున్నారు. మరో 284 పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఎంజీఎంలో పేషెంట్ల సేవల కోసం స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు) కొరత గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు బదిలీ అయిన వారి స్థానంలో 170 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అలాగే హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఐదుగురు స్టాఫ్ నర్సులను అలాట్ చేసినట్లు తెలుస్తోంది. 2024 సంవత్సరం బ్యాచ్కు సంబంధించిన వీరు రెండు రోజుల నుంచి ఎంజీఎంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటి వరకు 60 మంది స్టాఫ్ నర్సులు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మిగతావారు కూడా సోమవారం వరకు జాయిన్ కావొచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎంజీఎంలోని అత్యవసర చికిత్సలు, పలు వార్డుల్లో నర్సింగ్ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. -
కాజీపేట క్రూ డిపోకు ట్రైన్ మేనేజర్లు
● ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే లోకోపైలెట్ల క్రూ డిపో కార్యాలయానికి 8 మంది ట్రైన్ మేనేజర్లకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు జారీ అయినట్లు రైల్వే నాయకులు తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి కాజీపేట క్రూ డిపోకు సిబ్బంది బదిలీపై వచ్చారని, ఈ ఏడాది 8 మంది ట్రైన్ మేనేజర్లును కాజీపేటకు బదిలీ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే సంఘ్ లోకోరన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పాక రాజ్కుమార్ తెలిపారు. విజయవాడ వద్ద గల గాలా క్రూ డిపో కార్యాలయం నుంచి 8 మంది ట్రైన్ మేనేజర్లు రెక్వెస్ట్ బదిలీపై త్వరలో కాజీపేటకు రానున్నట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య కృషితో ట్రైన్ మేనేజర్ల బదిలీలు జరుగుతున్నాయని రాజ్కుమార్ తెలిపారు.అల్పాహారంలో బల్లి ప్రత్యక్షం ● కాశిబుగ్గలోని ఓ హోటల్లో ఘటన ● రూ.10వేల జరిమానా విధించిన అధికారులు కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్లో అల్పాహారంలో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైంది. దీనిని చూసిన వినియోదారుడు షాక్కు గురయ్యాడు. గురువారం కాశిబుగ్గలోని ఓ టిఫిన్ సెంటర్కు వెళ్లిన ఆ వ్యక్తి వడ తింటున్న సమయంలో బల్లి కళేబరం ముక్కలుగా కనిపించడంతో ఆందోళనకు గురయ్యాడు. వెంటనే టిఫిన్ సెంటర్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని బాధితుడు ఆరోపించారు. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తనిఖీలు చేపట్టి బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన ఆహార పదార్థాలు, పిండిని పరిశీలించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి మౌనిక హోటల్ నిర్వాహకుడికి రూ.10వేల జరిమానా విధించడంతో పాటు వారం రోజులు టిఫిన్ సెంటర్ మూసివేయాలని ఆదేశించారు. ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి ● శంకరంతండాలో ఘటన చెన్నారావుపేట: మొరం తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరంతండాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య రాజు (24) ట్రాక్టర్లో మొరం తరలిస్తున్నాడు. ఈ క్రమంలో తండాలోని శ్మశానవాటిక వద్ద ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. -
గోడ కూలుస్తుండగా ప్రమాదం
మామునూరు: పాత ఇంటి గోడ కూల్చివేస్తుండగా ప్రమాదవశాత్తు కూలి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సూర యాకయ్య (45) కుటుంబంతో కలిసి బతుకుదెరువు నిమిత్తం వరంగల్ ఆర్టీఏ జంక్షన్ లెనిన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అదేకాలనీకి చెందిన కుంచం పురుషోత్తంతో కలిసి యాకయ్య కూలి పనులకు వెళ్తున్నాడు. రోజు వారీగానే మామునూరు గ్రామంలో ఎర్ర సంతోష పాత ఇంటిని కూల్చివేసేందుకు గురువారం ఉదయం యాకయ్య, పురుషోత్తం కూలికి వెళ్లారు. కూల్చివేసే క్రమంలో ఆకస్మికంగా కూలీలపై గోడ పడిపోవడంతో సూర యాకయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యాకయ్య మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు మామునూరులో ఘటన -
ఆదరణ అంతంత మాత్రమే!
హన్మకొండ: పీఎం కుసుం పథకంలో సోలార్ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే చెల్లించే యూనిట్ ధరపై ఇప్పటికే రైతులు పెదవి విరుస్తుండగా.. ఉరుము ఉరిమి మీదపడిన చందంగా డిస్కంలు రైతులకు చెల్లించే యూనిట్ ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. యూనిట్ కాస్ట్ తక్కువగా ఉందని సోలార్ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చాలా మంది ముందుకు రాలేదు. పీఎం కుసుం పథకం కింద యూనిట్ ధర రూ.3.13 చెల్లిస్తామని డిస్కం పీపీఏ (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) చేసుకుంది. ప్లాంట్కు ఉపయోగించే ఉపకరణాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్లాంట్ ఏర్పాటు వ్యయం తగ్గుతున్న క్రమంలో యూనిట్ కాస్ట్ తగ్గించాలని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.3.13 నుంచి రూ.2.98కి అంటే 15 పైసలు తగ్గించాలని కోరుతూ టీజీ ఎన్పీడీసీఎల్ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో పిటిషన్ వేసింది. దీనిపై జూలై 8న బహిరంగ విచారణ చేపట్టాలని ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 వరకు ఈఆర్సీ అభ్యంతరాలు స్వీకరిస్తుంది. బహిరంగ విచారణ తర్వాత ఈఆర్సీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాలో మొత్తం 2098 మంది 2,788.900 మెగావాట్ల సోలార్ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ. లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. పీపీఏ మాత్రం 643 మెగావాట్లకు 447 మంది రైతులు చేసుకున్నారు. వేలల్లో దరఖాస్తులు వస్తే వందల్లో మాత్రమే పీపీఏలు చేసుకోవడాన్ని చూస్తే రైతులు డిస్కంలు చెల్లించే రేటుపై విముఖత ఉన్నట్లు అర్థమవుతోంది. గిట్టుబాటు కాని ధర.. రుణవాయిదాలు 12 ఏళ్ల వరకు చెల్లించాల్సి రావడం.. 25 ఏళ్ల వరకు యూనిట్ రేట్ పెంచకపోవడం వంటి కారణాలతో రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావొచ్చనే ఆలోచన.. రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి రావడం.. ప్రతీ నెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి సోలార్ప్లాంట్ ఏర్పాటుపై విముఖత వ్యక్తమైంది. దరఖాస్తులు చేసిన నాటి ఉత్సాహం ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పీపీఏ చేసుకోవడంలో లేదు. పీపీఏ చేసుకున్న వారందరు కూడా సోలార్ప్లాంట్ ఏర్పాటు అంశంపై సందిగ్ధంలో పడ్డారు. దీంతో 447 మంది 643 మెగావాట్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు 18 మెగావాట్ల 9 సోలార్ ప్లాంట్లు పూర్తికావడం చూస్తే రైతుల్లో విముఖతకు నిదర్శనం. రైతుల నుంచి ఆశించినస్థాయిలో స్పందన రాకపోవడం, ప్రాజెక్టులో పురోగతి మందగించడంతో విద్యుత్ కొనుగోలు ధర తగ్గింపు ప్రతిపాదనపై ఈఆర్సీ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. రైతులు ఆగ్రహంగా ఉన్నారని తెలిసి కూ డా డిస్కంలు ఈఆర్సీకి 15 పైసలు తగ్గింపు కోరు తూ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే తక్కువగా ఉన్న ధరను మరింత తగ్గిస్తే పథకం అమలుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి కనబరచని రైతులు యూనిట్కు 15 పైసలు తగ్గించాలని డిస్కంల నిర్ణయమే కారణం ఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ దరఖాస్తులు 2,098.. పీపీఏ చేసుకున్నది 447 మంది ఇప్పటి వరకు పూర్తయిన సోలార్ప్లాంట్లు 9 మాత్రమేసోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు పీఎం కుసుం..కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా రైతులను సౌర విద్యుత్ ఉత్పత్తి వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వ నరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎ స్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
బచ్చన్నపేట : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొ డవటూర్లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లపు నరేశ్ (38) గొర్రెలను కాచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ పోషణ నిమిత్తం అప్పు చేశాడు. అయితే ఎలా తీర్చాలని కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలిని హెడ్ కానిస్టేబుల్ బాలయ్య సందర్శించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
ఎమ్మార్పీకే విక్రయించాలి
మహబూబాబాద్ రూరల్ : ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే లైసెన్స్లు రద్దు చేస్తామని డీఏఓ విజయచంద్ర హెచ్చరించారు. మహబూబాబాద్ పట్టణంలోని వివిధ ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లోని యూరియా, డీఏపీ, వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువులను ఈ–పాస్ మిషన్ ద్వారానే అమ్మాలని తెలిపారు. ఈ తనిఖీలో మండల వ్యవసాయ అధికారి ఎస్.తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారిగా కనకదుర్గ మహబూబాబాద్ రూరల్: జిల్లా ఎకై ్సజ్ అధికారిగా బి.కనకదుర్గ విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం జిల్లా ఎకై ్సజ్ అధికారిగా పనిచేస్తున్న బి.కిరణ్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్ నాచారం డిస్టిలరీ అధికారిగా పనిచేస్తున్న బి.కనకదుర్గ బదిలీపై జిల్లా ఎకై ్సజ్ అధికారిగా రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా, వ్యక్తిగత కారణాలతో అధికారి కనకదుర్గ విధుల్లో చేరేందుకు విముఖంగా ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. ఆమె విధుల్లో చేరుతారా లేక ఆమె స్థానంలో మరెవరైనా జిల్లా ఎకై ్సజ్ అధికారిగా బదిలీపై వస్తారా అనే అంశం జిల్లా ఎకై ్సజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. పిల్లలందరికీ పోలియో చుక్కలు నెహ్రూసెంటర్: జిల్లాలోని 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. పల్స్పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్పోలియో కార్యక్రమానికి 469 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ శివకుమార్, కోఆర్డినేటర్లు స్వామి, పురుషోత్తం, డిప్యూటీ డెమో రాజ్కుమార్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. కల్యాణం.. కమనీయం రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మ స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాథచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ వద్దు.. ప్రభుత్వ స్కూల్ ముద్దు కురవి : ప్రైవేట్ స్కూల్ వద్దు.. ప్రభుత్వ స్కూల్ ముద్దు అనే నినాదంతో మండలంలోని బలపాల శివారు లింగ్యా తండా గ్రామంలో ప్రజలు ముందుకు వచ్చారు. గురువారం తండాకు వచ్చిన పలు ప్రైవేట్ స్కూల్ బస్సులను సర్పంచ్ మాలోత్ స్వరూపహరిలాల్ ఆధ్వర్యంలో ఆపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. డీఎన్టీపీఎస్ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు రాకుండా ఆపేస్తామని, ప్రజలు సహకరించాలని సూచించారు. సంక్షేమ పథకాలు పొందే ప్రతీ ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని తెలిపారు. ఇక నుంచి పిల్లలను ప్రైవేట్ బడికి పంపిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. -
రోడ్డు దాటుతూ తిరిగిరాని లోకాలకు..
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి దాటుతున్న పంచాయతీ కార్మికుడిని ఓ గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ కార్మికుడు కారు బానెట్పై పడడంతో దాదాపు 300 మీటర్ల దూరం వెళ్లాక బ్రేక్ వేయడంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కర్రె ఎల్లయ్య (56) గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆర్వీఎస్ కాంప్లెక్స్ నుంచి జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ నుంచి జనగామ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఎల్లయ్యను ఢీకొంది. ఈ ఘటనలో ఎల్లయ్య కారు బానెట్పై పడగా డ్రైవర్ ఆపకుండా 300 మీటర్ల దూరం తీసుకెళ్లి బ్రేక్ వేయడంతో రోడ్డుపై కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ కారును ఆపకుండా వెళ్లాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య నాగమణి, కుమారుడు రాజు, కుమార్తె హేమలత ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. బైక్ను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి రేగొండ: బైక్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్కు చెందిన ఒన్నాల మొగిలి (59), సరోజన దంపతులు బైక్పై తిరుమలగిరిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో దమ్మన్నపేట క్రాస్ వద్ద కారు వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా 108లో పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా మొగిలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరోజనను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కొడుకు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు.. రఘునాథపల్లి: ద్విచక్రవాహనం అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచనపల్లి శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కంచనపల్లి గ్రామానికి చెందిన ముక్కెర రాములు,రాజమ్మ దంపతుల కుమారుడు రాజు అలియాస్ నితిన్ (22) తన ద్విచక్రవాహనంపై స్టేషన్ఘన్పూర్లో జరిగిన బంధువుల వివాహ వేడుకలకు హాజరయ్యాడు. రాత్రి కోమటిగూడెం మీదుగా తిరిగి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఓ రైతు పైపులైన్ కోసం తవ్వి పూడ్చగా.. ఎత్తుగా ఉండడతో బైక్ అదుపు తప్పి కిందపడింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న రాజు అలియాస్ నితిన్కు తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కారు ఢీకొని పంచాయతీ కార్మికుడు మృతి -
సాంకేతిక పురోగతితో సమగ్రాభివృద్ధ్ది
కేయూ క్యాంపస్: వికసిత్ భారత్–2047 లక్ష్యం ఆర్థికాభివృద్ధికి మాత్రమే పరిమితం కాదని, సాంకేతిక పురోగతితో సమగ్రాభివృద్ధి సాధ్యమని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలోని కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్హా ల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కా మర్స్ అసోసియేషన్ ఏడో వార్షిక సదస్సులో ఆయ న మాట్లాడారు. విలువలే దేశ భవిష్యత్ను నిర్దేశిస్తాయని, వికసిత్ భారత్–2047 సాధనలో కామర్స్, మేనేజ్మెంట్ విద్య కీలకంగా నిలవనుందన్నారు. ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం : బాలకిష్టారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కామర్స్మేనేజ్మెంట్ విద్య విస్తృత ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ఆయన మాట్లాడారు. డిగ్రీ, పీజీలో సిలబస్ సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు. రానున్న రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉన్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. అలాగే, రాష్ట్రం కూడా రైజింగ్ తెలంగాణ దిశగా పురోగమిస్తోందని వివరించారు. యువతకు ఉపాధికోసం ప్రత్యేక పోర్టల్ : చెన్నప్ప, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ డి.చెన్నప్ప అన్నారు. 2017లో స్థాపించిన కామర్స్ అసోసియేషన్లో ప్రస్తుతం 1,177 మంది సభ్యులు ఉన్నారని వవరించారు. ఉచిత శిక్షణ ద్వారా వందమంది విద్యార్థులకుపైగా ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందారన్నారు. ఎస్బీఐ ఆర్ఎం బండి మురళీమోహనకృష్ణ, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసమూర్తి, కేయూ మాజీ రిజిస్ట్రార్ శంకరయ్య, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి, సదస్సు సెక్రటరీ పి.వరలక్ష్మి, కామర్స్ డీన్ కె.రాజేందర్, పి.అమరవేణి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సెక్రటరీ అకాహ్రాయ్జాస్తి, రిటైర్డ్ ఆచార్యులు కృష్ణమాచార్య, రవికుమార్ మాట్లాడారు. సదస్సులో 150 పరిశోధన పత్రాల సారాంశాల (అబ్స్ట్రాక్ట్) సంకలనాన్ని విడుదల చేశారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వెబ్సైట్ను కూడా అతిథులు ఆవిష్కరించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
తినుబండారాలపై టాస్క్ఫోర్స్ దాడులు
● పాడైన రూ.1.06 లక్షల విలువైన సరుకులు స్వాధీనం రామన్నపేట/ఖిలావరంగల్ : పాడైపోయిన వంటనూనెలు, హానికర రసాయనాలతో తినుబండారాలు తయారు చేస్తున్న వ్యాపారి ఇంటిపై టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం దాడి నిర్వహించారు. ఇందులో సుమారు రూ.1,06,780 విలువైన పాడైపోయిన ఆహార పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అధికారుల కథనం.. టాస్క్ఫోర్స్ బృందం.. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చింతల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న మరియా ట్రేడర్స్పై తనిఖీలు నిర్వహించారు. ఇందులో పరిశ్రమలో వినియోగానికి అనర్హమైన వంటనూనెలు, ఫుడ్ కలర్లు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అనంతరం పరిశ్రమ యజమానిని తరమం ఆశీర్వాదంగా గుర్తించి 361 కిలోల ఖారా, 114 కిలోల భోంది, 80 కిలోల చేగోడి, 30 కిలోల కారం, 8 బాక్సుల ఫుడ్ కలర్తోపాటు సుమారు 60 కిలోల పాడైపోయిన వంటనూనెలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.1,06,780 ఉంటుందని అధికారుల అంచనా. షాపు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న సరుకులను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ మంగీలాల్, ఎస్సై చందర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర అభివృద్ధికే ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’
మహబూబాబాద్: క్షేత్రస్థాయిలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ప్రత్యేక అఽధికారి, జెన్కో సీఎండీ హరీశ్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ప్రజాపాలన ప్రగతి– ప్రణాళిక 99రోజుల కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కొన్ని విషయాల్లో పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటలు, అధిక లాభాలు కలిగిన పంటలు సాగే చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. టాస్క్ శిక్షణ కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. యూ రియా తగ్గించి నానో యూరియా వాడే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. -
బదిలీల పర్వం..
నెహ్రూసెంటర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైద్య ఆరోగ్యశాఖ, డీఎంఈ, టీవీవీపీ విభాగాల్లో బదిలీల ప్రక్రియ పూర్తికావొస్తుంది. ఒకచోట 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరూ ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ప్రొఫెసర్లు, డాక్టర్లు, స్టాఫ్నర్సులు, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది బదిలీపై వెళ్లారు. దీంతో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు స్థానచలనం తప్పలేదు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు బదిలీపై వెళ్లకుండా.. ఒక విభాగం నుంచి మరో విభాగానికి డిప్యుటేషన్ల ఉత్తర్వులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే విధంగా ఇప్పటి వరకు వారు కొనసాగిన స్థానంలోనే ఉండేలా పైరవీలు సైతం ప్రారంభించినట్లు సమాచారం. ఏళ్లుగా తిష్ట.. ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అయినప్పటికీ.. కొంత మంది వారికి అనుకూలమైన ప్రాంతంలోనే ఉద్యోగం చేసేలా పైరవీలు, డిప్యుటేషన్ ద్వారా తిష్ట వేయాలని చూస్తున్నారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వరకు బదిలీ అయిన స్థానంలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఈ లోపు శాఖల్లో ఉన్న లోటుపాట్లను అడ్డం పెట్టుకుని మళ్లీ స్థానికంగా కొనసాగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పాటు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు కూడా బదిలీలు చేయాల్సి ఉండగా.. కేవలం కొంది మంది ఉద్యోగులకే బదిలీ కావడంతో పూర్తిస్థాయిలో బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. పైరవీలు.. కొంది మంది ఉద్యోగులు స్థానికంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోస్టింగ్ల కోసం హైదరాబాద్లో పైరవీలు చేయడంతో పాటు డిప్యుటేషన్లు, ఇతర పద్ధతుల్లో యథావిధిగా కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జీఎంసీ ప్రిన్సిపాల్ బదిలీ.. మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లకావత్ వెంకట్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరు బాధ్యతలు చేపట్టలేదు. ప్రిన్సిపాల్తో పాటు ప్రొఫెసర్లు, నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వారందరికీ బదిలీలు తప్పలేదు. ఈ నెల చివరి వరకు బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి రానుంది. వైద్యశాఖలో ఎట్టకేలకు ట్రాన్స్ఫర్స్ ఏళ్లుగా ఒకేచోట తిష్టవేసిన కొందరు ఉద్యోగులు పాత స్థానాల్లోనే పని చేసేందుకు పైరవీలు -
పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి
కాశిబుగ్గ: వరంగల్ కాశిబుగ్గలో అపరిశుభ్ర వాతావరణంలో పచ్చళ్లు తయారు చేస్తూ, నిల్వ ఉంచుతున్న కేంద్రంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. గురువారం ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశిబుగ్గ సాయి వీధిలో ఉన్న ఓ గృహంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున కుళ్లిన పచ్చడి ముడి సరుకులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వీటిని చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక కిరాణా షాపులు, ఇతర చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అరికెల శ్రీనివాస్ను అదుపులో తీసుకున్నారు. అలాగే, 750 కిలోల టమాట, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలు, 150 కిలోల అల్లం–వెల్లుల్లి ఫేస్ట్తో కూడిన మొత్తం రూ.2,25, 000 విలువైన కుళ్లిన కల్తీ ఆహార నిల్వ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడిన వ్యక్తిని, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చర్యల నిమిత్తం ఇంతెజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. దాడిలో టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎ.మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బండారి రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.2.25 లక్షల కల్తీ నిల్వలు స్వాధీనం చేసుకున్న పోలీసులు -
దాచుకున్న డబ్బులు మాయం!
కొత్తగూడ : పోస్టాఫీస్లో దాచుకున్న డబ్బు మాయమైంది. ఖాతాదారుకు తెలియకుండా ఆ సొమ్ము డ్రా చేశారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటోంది. బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఏంపెల్లి సందీప్(25) గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య రచన, ఏడాది వయసున్న పాప ఉంది. ఆ నిరుపేద కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిందని పలువురు దాతలు తమకు తోచిన మేర ఆర్థిక సాయం అందించారు. ఇలా వచ్చిన డబ్బును రచన పేరుతో పోస్టల్ అకౌంట్ ప్రారంభించి సెప్టెంబర్ 09, 2025న డిపాజిట్ చేశారు. అకౌంట్లో ఉన్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని బాధితులు గురువారం పోస్టాఫీస్కు వెళ్లింది. ఈ క్రమంలో అకౌంట్లో ఉన్న డబ్బు నుంచి డిసెంబర్ 27, 2025న రూ.లక్షా 99 వేలు డ్రా చేసినట్లు ఉందని ప్రస్తుత మేనేజర్ తెలిపాడు.అయితే తాను డ్రా చేయలేదని, డిపాజిట్ చేసినప్పటి నుంచి నేటి వరకు పోస్టాఫీస్కు రాలేదని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. డ్రా చేసిన సమయంలో మేనేజర్ బదిలీ అయ్యాడని, తనకు ఏమీ తెలియదని ప్రస్తుత మేనేజర్ సమాధానం ఇచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు సిద్ధమైంది. మధ్యవర్తులతో మంతనాలు.. బదిలీపై వెళ్లిన పోస్టాఫీస్ మేనేజర్కు విషయం తెలియగానే మధ్య వర్తుల ద్వారా బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా మంతనాలు నిర్వహించినట్లు సమాచారం. తన డబ్బులు మేనేజర్ డ్రా చేసినట్లు అంగీకరించి డ్రా చేసిన మొత్తానికి మరి కొంత డబ్బు అదనంగా ఇచ్చేందుకు చర్చలు జరిపినట్లు తెలిసింది. కాగా, ఆ మొత్తాన్ని మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి వద్ద ఉంచినట్లు సమాచారం. విషయం బయట పడింది కాబట్టి ఎక్కువ సొమ్ము ఇచ్చాడని, ఇంకా బయటకు రాని ఎంతమంది డబ్బులు ఇలా వినియోగించుకున్నాడో అనే చర్చ సాగుతోంది. చిన్న పాప కోసం దానం చేసిన డబ్బులు కాజేసిన మేనేజర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.పోస్టల్ అకౌంట్ నుంచి ఖాతాదారుకు తెలియకుండా రూ.1.99లక్షలు డ్రా విషయం బయటకు రావడంతో మధ్యవర్తులతో మంతనాలు ఫిర్యాదు చేయకుండా ఎక్కువ డబ్బుల ఆశ ఇంకా ఎన్ని అకౌంట్ల నుంచి తీశారోనని అనుమానాలుమేనేజర్పై కఠిన చర్యలు తీసుకోవాలి నిరుపేద ఆదివాసీ బిడ్డకు దాతలు సాయం చేసిన డబ్బులు కాజేసిన పోస్టల్ బ్రాంచ్ మేనేజర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. అతడు పని చేసిన కాలంలో ఇంకా ఎంత మంది డబ్బులు వినియోగించుకున్నాడో విచారణ చేపట్టాలి. లేదంటే ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోతుంది. –సందీప్, తుడుందెబ్బ నాయకుడు -
వేతన వెతలు!
కూరగాయలు కొందామంటే పైసల్లేవు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. నాకు నెలకు రూ.17,300 జీతం వస్తుంది. గత ఆరునెలలుగా జీతాలు రాక కూరగాయలు కొనుక్కుందామంటే పైసల్లేవు. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలకు నోట్ బుక్స్, బ్యాగులు కొందామంటే డబ్బులు లేవు. అధికారులు స్పందించి జీతాలు ఇప్పించాలి. – రఘుపతి, కంప్యూటర్ ఆపరేటర్, నర్సింహులపేట పెండింగ్ జీతాలు అందించాలి ఐదు నెలలుగా జీతాలు వస్తలేవు. ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే సమస్య ఉందని చెబుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుతో నలిగిపోతున్నాం. అధికారులు పెండింగ్ వేతనాలు ఇప్పించి తమకు న్యాయం చేయాలి. –కొమురయ్య, ఫిజికల్ డైరెక్టర్, నెల్లికుదురు మోడల్ స్కూల్ మహబూబాబాద్ అర్బన్: సకాలంలో వేతనాలు అందక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 8 మోడల్ స్కూళ్లలో పీడీ, కంప్యూటర్ ఆపరేటర్, నైట్ వాచ్ మెన్, అటెండర్ విధులు నిర్వహిస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు గోసపడుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అప్పుల తెచ్చి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలుగా పెండింగ్లో.. జిల్లాలో 8 మోడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ విధానంలో 34 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. పీడీలకు నెలకు రూ. 28,935 కాగా, రూ.22,750 మాత్రమే అందిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.19,500లకు రూ. 17,300, నైట్ వాచ్మమెన్, అటెండర్లకు రూ. 15,600లకు బదులు రూ.13,000 అందిస్తూ పీఎఫ్, ఈ ఈఎస్ఐ పేరుతో కట్ చేస్తున్నారు. రెన్యూవల్ తేల్చడంలో తాత్సారం. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏటా సాధారణంగా ఏప్రిల్లో రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఆ ప్రక్రియ జరగలేదు. అలాగే ఒక్కరికి కూడా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించలేదు. వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని సదరు ఏజెన్సీల నిర్వాహకులను ప్రశ్నించే సిబ్బందికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారని పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా అర్హత లేని ఏజెన్సీలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యతలు అప్పగించడంతో వేతనాలు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని జీతాలు ఐదు నెలలుగా పెండింగ్ జిల్లాలో 8 మోడల్ స్కూళ్లలో 34 మంది నిర్లక్ష్యంగా ఏజెన్సీ నిర్వాహకులు -
పైరవీల జోరు
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల నియామక ప్రక్రియపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రోజుకో తీరు నిబంధనలు, గంటకో ఆదేశాలు ఇస్తూ అర్హులైన అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే నియామక ప్రక్రియలో ఏ సర్టిఫికెట్కు ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టంగా పొందుపర్చాలని అభ్యర్థులు కోరుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత చేపడుతున్న నియామకాలు కావడంతో రాజకీయ నాయకుల నుంచి కూడా ఒత్తిడి పెరిగిన ట్లు జిల్లా విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ముందు చెప్పిన అర్హతలు.. ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా నిర్వహించే ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హులు, ఎంపిక ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా ప్రకటించారు. ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత, అదీ లేకపోతే డీఈడీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలకు కాకుండా ఇప్పుడు కేవలం ఇంటర్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని కొందరు అంటుంటే.. డీఈసీఏ సర్టిఫికెట్ కీలకం అని ఇంకొందరు.. డీఈడీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని మరికొందరు, బీఈడీ ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఆందోళనలో అర్హులు.. ఉన్నత చదువులు చదివి టీచర్ ఉద్యోగం రాక ఇంటి వద్దనే పనిచేసుకుంటున్న సమయంలో ప్రీప్రైమరీ స్కూల్స్ టీచర్ పోస్టులు పడడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఒక వైపు అధికా రుల నుంచి స్పష్టత లేకపోవడం, మరోవైపు దళారులు రంగ ప్రవేశం చేసి డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని తిరగడం.. మరో వైపు రాజకీయ నాయకులు మా లీడర్తో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తామని, ఇప్పటికే జాబితా తయారైందని చెప్పడంతో అన్ని అర్హతలు ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ఏం జరుగుతుందో అనే భయం కూడా పట్టుకుంది. అధికారులు స్పందించి నియామక ప్రక్రియ వివరాలను స్పష్టంగా పొందుపరిచి అందరికి అందుబాటులో ఉండే బెల్ సైట్లో గానీ, డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల వద్ద గానీ డిస్స్లే చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రీప్రైమరీ పాఠశాలలుడిగ్రీ 413 దరఖాస్తులు ఇంటర్ 511 దరఖాస్తులు ఇన్స్ట్రక్టర్ పోస్టులుబీటెక్/ పాలిటెక్నిక్ 14 దరఖాస్తులుఆయా పోస్టులు:76 వచ్చిన దరఖాస్తులు: 428పీజీ 128 దరఖాస్తులు ● ప్రీప్రైమరీ పోస్టుల ఎంపికలో తర్జనభర్జన ఇంటర్, టీటీసీకి ప్రాధాన్యం అంటున్న అధికారులు ఇంటర్, బీఈడీ ఉన్నచోట పరిస్థితిపై స్పష్టత కరువు రాజకీయ నాయకుల నుంచి పెరిగిన ఒత్తిడి ఆందోళనలో అర్హులైన అభ్యర్థులు 118676నిబంధనల ప్రకారమే నియామకాలుప్రీప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. అయితే రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీచేసిన నిబంధనల ప్రకారమే నియామకాలు జరుగుతాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా జిల్లా సెలక్షన్ కమిటీ తుది జాబితా తయారు చేస్తుంది. తయారు చేసిన జాబితాలో ఎటువంటి గోప్యత ఉండదు. – సత్యనారాయణమూర్తి, డీఈఓ -
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కఏటూరునాగారం: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సీతక్క కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హాస్టల్లో నూతనంగా చేరిన విద్యార్థినుల వివరాలను తెలుసుకుని వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, కరకట్ట భద్రత, వరదల సమయంలో నది కరకట్ట దెబ్బతినకుండా చేపడుతున్న రక్షణ చర్యలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. మ్యాప్ ఆధారంగా గోదావరి ప్రవాహ తీరు, కరకట్ట పరిస్థితులు, జియో ట్యూబ్స్ ఏర్పాటు విధానం, చేపడుతున్న రక్షణ చర్యలపై పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన ప్రతీ ఏడాది గోదావరి వరదలతో ఏటూరునాగారం, రామన్నగూడెం, మంగపేట, అకినేపల్లి మల్లారం, ఓడగూడెం తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుందన్నారు. మంగపేట, రామన్నగూడెం ప్రాంతాల్లో వరద ఉధృతి గ్రామాలపై ప్రభావం చూపకుండా జియో ట్యూబ్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ ఏడాది వరదల సమయంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించే పరిస్థితి రాకుండా దీర్ఘకాలిక, శాశ్వత రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొండాయి వద్ద బ్రిడ్జి పిల్లర్లు పూర్తి కాగా గడ్డర్ల నిర్మాణం పనులు సాగుతున్నాయని తెలిపారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఫిరంగి, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, ఇరిగేషన్ డీఈ ప్రవీణ్, ఆత్మ కమిటీ చైర్మన్ రఘు, బ్లాక్ అధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు. -
కాలం కలిసొచ్చేనా..?
● మొక్కజొన్న సాగుపై ఏజెన్సీ రైతుల సందిగ్ధం ● వర్షాలు సరిగా లేక ఆందోళన బయ్యారం: జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ఏటా వానాకాలం సీజన్లో మొక్కజొన్న పంట సాగు చేసే రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు మోస్తరు వర్షం కూడా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారం, గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల, మహబూబాబాద్ మండలాల పరిధి ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్లో వానలపై ఆధారపడి మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రతీ వానాకాలం వర్షాలు అనుకూలంగా పడుతుండడంతో కాలం కలిసొచ్చి పంటలు పండేవి. అయితే ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానలు లేక మొదలు కాని దుక్కులు.. గత ఏడాది మే చివరలో ఆశాజనకంగా వానలు కురవడంతో జూన్ మొదటివారంలోనే వర్షాధారంగా మొక్కజొన్న పంట సాగు చేసే రైతులు దుక్కులు సిద్ధం చేసుకొని జూన్ చివరి నాటికి విత్తనాలు విత్తా రు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొన్నిచోట్ల మినహా మిగతా ప్రాంతాల్లో ఆశాజనకమైన వానలు కురవకపోవడంతో దుక్కులు దున్నని పరిస్థితి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాధారిత భూముల్లో పంటల సాగుపై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఆ తరువాత ముఖం చాటేస్తే.. మరికొన్ని రోజుల్లో భారీ వర్షం కురుస్తే పంట సాగుకు దుక్కులు దున్ని విత్తనాలు విత్తొచ్చు. మొక్కజొన్నకు పంట విత్తే సమయంలోనే దుక్కిదున్నే కూళ్లు, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఎకరానికి రూ.20 వేల వరకు రైతులు భరించాల్సి వస్తుంది. సాగు చేసిన పంటలో ఒకసారి కలుపుమందు పిచికారీ చేయటంతో పాటు మూడు దఫాలుగా యూరియా వేస్తే మూడు నెలల తరువాత పంట చేతికి వస్తుంది. పంట సాగు చేసిన నాటి నుంచి మూడు నెలల వ్యవధిలో పది నుంచి పదిహేను రోజుల పాటు వానలు పడకపోతే పంట ఎండిపోయే పరిస్థితి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. వానలు ఏం చేస్తాయోనని భయం అవుతోంది ఈ ఏడాది ఇప్పటి వరకు పెద్దవాన పడలేదు. చిన్నవానలకు కొద్దిగా దుక్కి చేశాం. వానలు పడితేనే పండే భూముల్లో ఇప్పుడు మొక్కజొన్నలు విత్తితే వానలు ఏం చేస్తాయోనని భయం అవుతుంది. – బి.విశ్వనాథం, మొట్లతిమ్మాపురం -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
చిట్యాల: నీటితొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలోని తిర్మలాపూర్లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కంచు మౌనిక–బీరన్న దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, బీరన్న తన గొర్రెలమందను మేతకోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. మందలోని ఒక గొర్రెపిల్లకు పాము కరవడం గమనించి ఆయన భార్య మౌనికకు సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించి మందులు, ఇంజక్షన్లు పంపించమని చెప్పాడు. దీంతో ఆమె తన బంధువుల ద్వారా గొర్రెలమంద వద్దకు మందులు పంపించింది. పాము కరిచిన గొర్రెపిల్ల ఎలా ఉందని తెలుసుకునేందుకు మౌనిక పక్కింటికి వెళ్తుండగా.. కూతురు హాన్వి ఆమె వెనుకే వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. తన ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టెలో చూడగా కనిపించింది. దీంతో ఆమె కేకలు వేస్తూ కూతురు హాన్విని బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
31 జంటలకు ఉచిత కల్యాణం
కాశిబుగ్గ: వరంగల్ ములుగు రోడ్డులోని సప్తధామంలో 31 జంటలకు ఉచితంగా కల్యాణం నిర్వహించారు. బుధవారం జరిగిన వివాహ మహోత్సవంలో నూతన వధూవరులకు బంగారు పుస్తెలు, వెండి మట్టెలు, బట్టలు, పూజా సామగ్రి అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 19 జంటల నెంది గిరిజనులు, కోయలు, నర్సంపేట, కొత్తగూడెం నుంచి 7 జంటలు, వరంగల్ నుంచి 5 జంటలు పాల్గొన్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిపురనేని గోపిచంద్ తెలిపారు. వానవాసి కల్యాణ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు రామచంద్రయ్య, ఎంఎల్ ధర్మారావు, చాంబర్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, గట్టు మహేష్బాబు, సభ్యులు సదాశివుడు, సాయి, ఉమాశంకర్, వెంటకరమణ, భాస్కర్, మహిపాల్, రాంప్రసాద్, విజయ్కుమార్ పాల్గొన్నారు. -
శిథిల భవనం!
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్నాయి. స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన భవనాల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. వందేళ్లు దాటిన భవనాలు.. జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం 1914లో నిర్మించిన భవనంలో నేటికీ కొనసాగుతోంది. అధికారులు, సిబ్బంది భయంతో ఉద్యోగం చేస్తున్నారు. నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయం 1926లో నిర్మాణం చేసి భవనంలో కొనసాగుతోంది. ఆ భవనంలో కొన్ని గదులు కూలిపోయాయి. మిగిలిన గదులను మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. ఈనెల 22న ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆ కార్యాలయాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిజాంకాలం నాటి భవనంలో.. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలో కొనసాగుతోంది. ఆ భవనంలో కూడా కొన్ని గదులు కూలిపోయాయి. మిగిలిన గదులను మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. వర్షం వస్తే చాలా వరకు కురుస్తుంది. స్లాబ్ పెచ్చులు నేటికీ ఊడి కింద పడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆఫీసర్ క్లబ్ భవనం కూడా కూలిపోయే దశలో ఉంది. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది. కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. కూలిపోయే దశలో.. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆవరణ అంతా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పాములు సంచరిస్తున్నాయి. పందులకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ క్వార్టర్స్ సగం కూలిపోగా.. మిగిలినవి కూడా కూలిపోయే దశలో ఉన్నా యి. ఖాళీగా ఉన్నవాటిని కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. పశువైద్యశాల కూడా శిథిలావస్థలో ఉంది. నోటీసులు.. వర్షాకాలం రాగానే కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయిస్తున్నారు. కానీ, శిథిల భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలకే పరిమితం.. పలు కార్యాలయాల భవనాల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వాలు మారిన ప్రతిపాదనల ఫైళ్లలో కదలిక లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో నిధులు వృథా అవుతున్నాయే తప్ప సమస్య తీరడం లేదు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఇటీవల బాలరక్షా భవన్ అద్దె భవనంలో ఉండగా సఖి కేంద్రంలోకి మార్చారు. డీటీఓ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు మార్చారు. దీంతో అద్దెకు అవకాశం లేకపోవడంతో శిథిల భవనాల్లో ఉండాల్సి వస్తోంది. నిజాంకాలం నాటి భవనాల్లో పలు కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సిబ్బంది ఇబ్బందులు తాత్కాలిక మరమ్మతులతో నిధులు వృథా -
యాప్ ద్వారా మాత్రమే యూరియా ఇవ్వాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులకు యాప్ ద్వారా మాత్రమే యూరియా ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ బి.గోపి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా యాప్ ద్వారా రైతులకు సరఫరా విధానం అమలు, వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాల తీరు, ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, పంటల మార్పిడి, అపరాల సాగు పెంపుపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని రైతువేదిక కార్యాలయం నుంచి డీఏఓ ఎస్.విజయచంద్ర, మరిపెడ ఏడీఏ శ్రీదేవి, టెక్నికల్ ఏడీఏ మురళి, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
ఇంటింటికి సర్
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) లోని ముఖ్య ఘట్టం ఇంటింటి గణన గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే జిల్లాలో ఈ పక్రియ సజావుగా నిర్వహించేదుకు చేపట్టిన ఓటరు మ్యాపింగ్ 94శాతం పూర్తి చేసుకొని జిల్లాను రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలిపారు. ఓటరును గుర్తించేందుకు ఫాంలు పూర్తి చేసి ఇచ్చేందుకు అన్ని పార్టీల ఏజెంట్లు సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అసలు ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంటింటి గణనతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటో తేదీన ఓటరు సవరణ తుది జాబితా వరకు సాగనుంది. సర్వేకోసం జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు ఆర్డీఓలు ఈఆర్ఓలుగా, 12 మంది తహసీల్దార్లు ఏఈఆర్ఓలుగా, వీరి పరిధిలో 56 మంది సూపర్ వైజర్లు.. వారి పరిధిలో మొత్తం 555 మంది బీఎల్ఓలు పనిచేస్తున్నారు. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే.. జూలై 31న ముసాయిదా(డ్రాఫ్ట్) ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లైమ్స్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, ఎన్యూమరేషన్ ఫామ్స్పై నిర్ణయం.. అభ్యంతరాల పరిష్కారం మొదలైన ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ ఒకటో తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. అందరూ అప్రమత్తం.. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకోకపోతే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. దీంతో అటు అధికా రులు, ఇటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సర్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, ప్రభుత్వ సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సర్వే అధికారులకు చూపించాలి. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు తమ ఉద్యోగ గుర్తింపు కార్డు చూపెట్టవచ్చు. కాగా, బ్యాంకు, పోస్టాఫీసు, ఎల్ఐసీ, పీఎస్యూ ద్వారా పొందిన కార్డులు, అధికారులు జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కు పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఎన్ఆర్సీ, కుటుంబ రిజిస్ట్రేషన్, పట్టేదారు పాస్ పుస్తకం, ఆధార్కార్డు చూపించి ధ్రువీకరించుకోవచ్చు. అయితే బీఎల్ఓలు ముందుగా ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు పత్రం అందజేస్తారు. వీటిని పూర్తి చేసి ఓటరు నేరుగా గానీ, రాజకీయ పార్టీల ఏజెంట్ల ద్వారా గానీ బూత్లెవల్ ఆఫీసర్కు అప్పగించాలి. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక వెట్సైట్లో ఏరోజు ఫాంను ఆరోజుగా స్కాన్ చేసి ఆన్లైన్ చేయాలి. అయితే ఈ ప్రక్రియపై బీఎల్ఓలకు అనేకమార్లు శిక్షణ ఇచ్చినా.. కొందరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రధానంగా కొంత మంది అంగన్వాడీ టీచర్లు ఫాంలో వివరాల నమోదు, స్కాన్ చేయడం, అప్లోడ్ చేయడం వంటి ప్రక్రియలు చేయలేని పరిస్థితి ఉంది. ఇటువంటి వారికోసం సహాయకులు, సూపర్ వైజర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవస రం ఉంది. బీఎల్ఏలకు నాయకుల దిశానిర్దేశం ఒక్క ఓటు గెలుపోటములను తారుమారు చేసే అవకాశం ఉంది. కావునా.. తమ తమ ప్రాంతాల్లో ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇటీవల బీఎల్ఏ(బూత్లెవల్ ఏజెంట్లు)లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ఫాం ఎలా నింపాలి. ఏ ఆధారాలు చూసుకోవాలి. 2002లోని ఓటరు జాబితాను ఎలా సరిచూడాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. బీఎల్ఓలు.. ఇచ్చిన ఫాం సరి చూడడం, వాటిని దగ్గరుండి భర్తీ చేయడం, తప్పులు ఉంటే సరిచేయడం వంటి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 555/94%288/96%4,84,9404,57,819267/91%2,24,1722,60,7612,51,6932,06,126మహబూబాబాద్డోర్నకల్నేటి నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఇప్పటికే బీఎల్ఓలకు శిక్షణ ఫాం పూర్తి చేసి ఇస్తేనే ఓటు భద్రం అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల అప్రమత్తంమ్యాపింగ్ ప్రక్రియ ఇలా.. పీఎస్లు ఓటర్లు మ్యాపింగ్ శాతం -
నిర్లక్ష్యం ఎవరిది?
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు 7: 30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో ఓ బాలుడు అక్కడికక్కడే, ఇద్దరు ఎంజీఎంలో మృతి చెందారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఎల్లగౌడ్, అహ్మద్ చికిత్స పొందుతూ రాత్రి సుమారు 11 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అదే రోజు అర్ధరాత్రి ముగ్గురి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరుసటి రోజు ఉదయం సుమారు 10: 30 గంటలకు పోస్టుమార్టం నిర్వహించాల్సిన వైద్యులు సాయంత్రం 4 గంటల సమయంలో నిర్వహించి 5 గంటలకు మృతదేహాలను అప్పగించారు. దీనిపై బంధువులు, స్థానికులు ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటనపై ‘దయనీయస్థితిలో మృతదేహాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ఎంజీఎం అధికారులు వివరణ ఇచ్చారు. ముగ్గురి మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియలో వైద్యుల ఆస్యమేమీకాలేదని, పోలీసుల పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించారన్నారు. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఘటనలో నిర్లక్ష్యం పోలీసులదా..? వైద్యులదా? అనే అంశంపై పలువురి అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంపై సోమారం గ్రామ సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ పోస్టుమార్టం నిర్వహించే కిందిస్థాయి సిబ్బంది ఒక మృతదేహానికి రూ.5,500 ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన విషయంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో పోస్టుమార్టం ప్రక్రియ గంట ఆలస్యం చేశారని తెలిపారు. ఈ విషయాలపై ఎంజీఎం అధికారుల వివరణలో వాస్తవం లేదన్నారు. పోస్టుమార్టం ఆలస్యంపై ఎంజీఎం అధికారుల వివరణ -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
● ఎస్పీ శబరీష్కేసముద్రం: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ పెట్టాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం కేసముద్రం జెడ్పీహైస్కూల్లో మన ఊరు–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై 9, 10, ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ హాజరై మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్ను నాశనం చేస్తాయని, ఒక్కసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం గంజాయి వ్యతిరేక సందేశాలతో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్పర్సన్ అల్లం రమ, సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, హెచ్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా చర్లపల్లి–తిరుపతి–చర్లపల్లి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. ఈనెల 25, 27వ తేదీల్లో చర్లపల్లిలో 18:10 గంటలకు బయలుదేరే చర్లపల్లి–తిరుపతి (07819) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు 20:00 గంటలకు చేరుకుని మరుసటి రోజు 07:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ నెల 26, 28వ తేదీల్లో తిరుపతిలో 15:00 గంటలకు బయలుదేరే తిరుపతి–చర్లపల్లి (07820) ఎక్స్ప్రెస్ కాజీపేటకు మరుసటి రోజు 2:30 గంటలకు చేరుకుని చర్లపల్లికి 04:30 గంటలకు వెళ్తుంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్క్లాస్ కోచ్ల సౌకర్యంతో ఉన్న ఈ రైళ్లకు చర్లపల్లి–తిరుపతి మధ్య అప్అండ్డౌన్ రూట్లో జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. క్యాన్సర్తో చిన్నారి మృతి ● పర్వతగిరిలో విషాదం మహబూబాబాద్ రూరల్ : క్యాన్సర్(బోన్)తో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెలమల్ల నరేశ్, స్రవంతి దంపతుల రెండో కుమార్తె సాయిశృతి (13) నాలుగేళ్ల నుంచి క్యాన్సర్తో బాధపడుతోంది. దీంతో చిన్నారి వైద్యం కోసం తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి బుధవారం మృతిచెందింది. కాగా, సాయిశృతి మృతితో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ● నేటి నుంచి 28వ తేదీ వరకు రాకపోకలు -
విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలి
మహబూబాబాద్: విద్యా ప్రమాణాలు పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల ముఖగుర్తింపు హాజరు, తదితర విషయాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించాలన్నారు. ఈనెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, దాని లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మూతబడిన పాఠశాలల ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, ఇందుకు సమయపాలన ముఖ్యమన్నారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా రోజువారి హాజరు నమోదు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బోధన పద్ధతులపై ఉపధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇంగ్లిష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. సమావేశంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ -
డీసీఎం బోల్తా.. డ్రైవర్ మృతి
మహబూబాబాద్ రూరల్ : డీసీఎం బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ పాత ఇనుప సామాను దుకాణం నుంచి సామగ్రిని డీసీఎంలో హైదరాబాద్ తరలిస్తున్నారు. వాహనం జిల్లా కేంద్రం శివారులోని సాలార్ తండా మీదుగా వెళ్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చింది. దీంతో ఆటోను తప్పించబోయి డీసీఎం అదుపు తప్పి బోల్తాపడింది. ఈఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎల్లగొండ లాలయ్య (35)గా గుర్తించారు. ఘటనాస్థలిని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. టౌన్ ఎస్సై శివరామకృష్ణ ఆస్పత్రిలో మృతుడి వివరాలు సేకరించారు. లాలయ్య కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు చేసిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మానుకోట శివారులో ఘటన మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా వాసి -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్–మే నెలలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్రెడ్డి, పరీక్షల విభాగం అధికారులు బుధవారం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 12,726 మంది హాజరుకాగా అందులో 5,260మంది విద్యార్థులు ఉత్తీర్ణత (41.33శాతం) సాధించారు. ఆరో సెమిస్టర్ పరీక్షలకు 33,205 మంది హాజరుకాగా 16,119 మంది విద్యార్థులు (48.54శాతం) ఉత్తీర్ణత సాధించారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో కేయూ ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు పి. వెంకటయ్య, తిరుమలాదేవి, నాగరాజు, ఆసిం ఇక్బాల్, పి. శ్రీనివాస్, పద్మజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామావెంకటేశ్వర్లు, క్యాంపు ఆఫీసర్ నాయకపు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను కేయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తులకు అవకాశం.. డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు.15రోజుల్లో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫీజులు చెల్లించని కళాశాలల ఫలితాలు నిలిపివేత.. సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థుల ఫలితాలను అధికారులు వెల్లడించలేదు. తమ ఫలితాలు కేయూ వెబ్సైట్లో కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. దీనిపై పలు కళాశాలల యాజమాన్యాలు పరీక్షల విభాగం అధికారులను సంప్రదించారు. ఫీజులు చెల్లించని కళాశాలల విద్యార్థుల ఫలితాలు వెబ్సైట్లో పెట్టలేదని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. దీంతో సాయంత్రం వరకు సుమారు 10 కళాశాలల వరకు యూనివర్సిటీకి ఫీజులు చెల్లించాయి. ఫలితంగా ఆ కళాశాలల విద్యార్థుల ఫలితాలను వెల్లడించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఇప్పటి వరకూ యూనివర్సిటీకి ఫీజులు చెల్లించని కళాశాలల విద్యార్థుల ఫలితాలు నిలిపివేశామన్నారు. ఐదో సెమిస్టర్లో 41.33 శాతం, ఆరో సెమిస్టర్లో 48.54శాతం ఉత్తీర్ణత వర్సిటీకి ఫీజులు చెల్లించని కళాశాలల ఫలితాలు నిలిపివేత రీవాల్యుయేషన్ దరఖాస్తులకు అవకాశం -
భవితకు బంగారు బాట..
ఖానాపురం : ఆ పాఠశాలలో సీటు సాధిస్తే భవిష్య త్ బంగారమే. ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమాలు.. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం.. ఉద్యోగావకాశాల కోసం కావాల్సిన శిక్షణ..వెరసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అదే వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గిరిజన సైనిక స్కూల్. 1985లో ఏర్పాటు చేసిన ఈ గిరిజన గురుకుల పాఠశాలలో ఎంతో మంది విద్యాభ్యాసం పొందుతూ వస్తున్నారు. 2018లో గిరిజన గురుకుల పాఠశాలను గిరిజన సైనిక్స్కూల్గా ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవతో గత ప్రభుత్వంలో సైనిక్స్కూ ల్ను ప్రారంభించారు. కోట్లాది రూపాయల నిధులు కేటాయించి వసతులు కల్పించడంతో గిరిజన సైనిక్స్కూల్లో బోధనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 710 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 40 మంది అధ్యాపకులు, 27 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. సైనిక్స్కూల్లో సీటు కోసం అనేక మంది విద్యార్థులు పోటీపడుతున్నారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి సీటు పొందుతున్న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం, ఉద్యోగ అవకాశాల కోసం కావాల్సిన శిక్షణలు విద్యార్థులకు అందుతున్నాయి. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ.. గిరిజన సైనిక పాఠశాలలోని విద్యార్థులకు ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ కల్పిస్తున్నారు. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు, సా యంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆర్మీ ఉద్యోగా లకు కావాల్సిన శిక్షణను ముగ్గురు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, ముగ్గురు పీడీల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. సమయానికి నిద్రలేవడం, వ్యాయా మం, ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి సుమారు 135 మంది అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 71 మందికి ఉద్యోగాలు.. గిరిజన సైనిక్స్కూల్లో ప్రవేశాలు పొందిన అనంతరం విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు పడుతున్నాయి. అధ్యాపకులు ప్రత్యేక చొరవతో విద్యార్థులకు బోధన చేపడుతున్నారు. దీంతో ఇప్పటి వరకు 71 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఇందులో అగ్నివీర్లో 46, పోస్టల్శాఖలో 9, పోలీస్ శాఖలో (కానిస్టేబుల్) 5, జీడీ (కానిస్టేబుల్)లో 5, నేవీలో 3, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లో 3, అగ్నిమాపక శాఖలో(ఫైర్మెన్) 2 చొప్పున ఉద్యోగాలు సాధించారు. వీరితో పాటు ఎన్ఐటీ, ఐఐఐటీ, జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థలకు 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.సైనిక్ స్కూల్.. గిరిజన విద్యార్థులకు వరం ప్రస్తుతం పాఠశాలలో 710 మంది స్టూడెంట్స్ ప్రతీ రోజు ప్రత్యేక శిక్షణలు ఇప్పటికే వివిధ ఉద్యోగాలు సాధించిన 71 మంది విద్యార్థులు -
వరద ముప్పు ప్రాంతాలను గుర్తించాలి
మహబూబాబాద్: లోతట్టు, వరద ముప్పు ప్రాంతాలను గుర్తించాలని మానుకోట మున్సిపల్ కమిషనర్ వినోద్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం వర్షాకాలం సన్నద్ధతపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నీరు నిల్వ కాకుండా కాల్వలను శుభ్రం చేయాలన్నారు. అత్యవసర స్పందన బృందాలు, రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రమాదకరమైన చెట్లు తొలగించాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ మూడురోజులు బంద్మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ బుధవారం తెలిపారు. ఈ నెల 26న శుక్రవారం మొహర్రం పండుగ, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని పేర్కొన్నారు. రైతులు సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు తమ పంట ఉత్పత్తులు తీసుకురావాలని సూచించారు. అడవులు, జంతువుల రక్షణకు సహకరించాలిగూడూరు: గూడూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో అడవులు, జంతువుల రక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఫారెస్ట్ డెవలప్మెంట్ అధికారి (ఎఫ్డీఓ) వెంకటేశ్వర్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎఫ్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. మహబూబాబాద్ ఎఫ్డీఓగా విధులు నిర్వర్తిస్తున్నానని, ఉన్నతాధికారులు గూడూరు ఎఫ్డీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఎఫ్డీఓ వెంకటేశ్వర్రావుకు ఎఫ్ఆర్వో ప్రసాదరావు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పిలికారు. -
కోలుకుంటున్న చిన్నారి పాయల్
● ఎంజీఎం ఐసీయూ వార్డులో చికిత్స చేస్తున్న వైద్యులు ● వారం రోజుల క్రితం తీవ్రంగా గాయపరిచిన కుక్క కాశిబుగ్గ: వరంగ ల్ లేబర్కాలనీ స మీపంలోని శాలి నీనగర్లో కుక్కకాటుకు గురైన చిన్నారి పాయల్ ఎంజీఎం ఆస్పత్రిలో కోలుకుంటోంది. శాలినీనగర్లో వారం రోజుల క్రితం జరిగిన కుక్కదాడి ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో చిన్నారి పాయల్ ముఖం, ముక్కు, కన్ను, నుదుటిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈఎన్టీ వార్డులో అడ్మిట్ అయిన ఆ చిన్నారికి అత్యవసర చికిత్స అందించడానికి వీలుగా పిల్లల వార్డులోని ఐసీయూలో ఉంచారు. ఈఎన్టీ డాక్టర్తోపాటు పిల్లల వైద్య నిపుణులు చిన్నారి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఒక దశలో పాయల్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండగా క్రమక్రమంగా కోలుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పాయల్ ఆరోగ్యం రికవరీ అవుతోందని, ప్రస్తుతం గాయపడిన చోట వైద్యులు కుట్లు వేసే దిశగా ప్రయత్నిస్తున్నారని ఆర్ఎంఓ అశ్వినికుమార్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ప్రాణాపాయం ఉంచి బయటపడినట్లు ఆయన పేర్కొన్నారు. కూలిపని కోసం వచ్చి... పాయల్ కుటుంబం ఛత్తీస్గఢ్ నుంచి కూలిపని కోసం వచ్చి శాలినీనగర్లోని ఓ ఇంటి నిర్మాణ పనులు చేసున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో వారు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంజీఎంలో అన్ని రకాల వైద్యసేవలు వైద్యసేవలు అందుతున్నా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని వారు వాపోతున్నారు. -
నూతన కరిక్యులం, సిలబస్కు ఆమోదం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పీజీ కోర్సుల్లోని ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాలల్లో నూతన కరిక్యులం, సిలబస్ను బుధవారం క్యాంపస్లోని కమిటీహాల్లో నిర్వహించిన ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాల అధిపతులు, బీఓఎస్లు, డీన్, అధ్యాపకుల సమావేశంలో ఆమోదించారు. వివిధ విభాగాల బీఓఎస్లు తమ విభాగాల్లోని నూతన కరిక్యులం, మార్పులు చేసిన సిలబస్ క్రెడిట్స్ గురించి ఈ సందర్భంగా వివరించారు. ఆయా పీజీ కోర్సుల్లోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక అంశాలను సిలబస్లో ప్రవేశపెడుతున్నట్లు డీన్ బి. సురేశ్లాల్ తెలిపారు. ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆచార్యులు సుధాకర్రెడ్డి, విజయ, కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఆర్ట్స్, సోషల్సైన్స్ విభాగాల డీన్ బి. సురేశ్లాల్, ప్రొఫెసర్ పి. శ్రీనివాస్రావు, రాధికారాణి, మేఘనారావు, నిర్మల, దీపాజ్యోతి, కె. వీరస్వామి, చిర్రరాజు, కృష్ణయ్య, స్వర్ణలత పాల్గొన్నారు. ఆమోదం లభించని సోషల్ వర్క్ పీజీ కోర్సుల సోషల్సైన్స్లో ఒక్క సోషల్వర్క్ విభాగానికి సంబంధించిన నూతన పాఠ్యప్రణాళిక విషయంపై చర్చించిన సందర్భంగా వారానికి రెండు రోజులు ఫీల్డ్వర్క్కు కేటాయించటంపై ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ సమావేశంలో వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో మళ్లీ ఆ విభాగం ఫీల్డ్ వర్క్ తగ్గించి కరిక్యులం, సిలబస్లోమార్పులు చేసుకోవాలని సంబంధిత విభాగం బీఓఎస్కు ఇతర ఆచార్యులు సూచించారు. దీంతో సోషల్వర్క్విభాగానికి సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం లభించలేదు. కాగా, ఈవిద్యాసంవత్సరం 2026–2027లోనే ఈ నూతన పాఠ్యప్రణాళికను అమలులోకి తీసుకొస్తారు. -
27న మెగా జాబ్ మేళా
నయీంనగర్ : కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయాధారిత వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27 కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, హెల్త్ కేర్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన 100 పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పారు. శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవినీతి రహిత సమాజ నిర్మాణ లక్ష్యంతో ‘లక్ష్యం కోసం లక్ష సైన్యం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ రానున్న నల్లగొండ– వరంగల్– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ తరఫున కపిలవాయి దిలీప్కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. టీఆర్ఎల్డీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంప్రసాద్, నాయకులు రాజ్కుమార్ రెడ్డి, బుల్లెట్ వెంకన్న, కుందె గిరి, కోటి, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ -
అధికారుల కసరత్తు..
నెహ్రూసెంటర్: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా, పిల్లలకు అంగవైకల్యం రాకుండా ఉండేందుకు 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రభుత్వం పల్స్ పోలియో చుక్కలను పంపిణీ చేస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలోని పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. జిల్లాలో 76 వేల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలుండగా.. వారికి ఈ నెల 28న పోలియో చుక్కలు వేసేలా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోజు వేసుకోని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటి సందర్శన ద్వారా పోలియో చుక్కలు వేయనున్నారు. పిల్లలందరికీ పంపిణీ చేసేలా.. జిల్లాలోని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు పంపిణీ చేసేలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. 20 పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్, 5 సీహెచ్సీలు, బస్తీ దవాఖానా, జీజీహెచ్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో, అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 76వేల కు పైగా చిన్నారులను గుర్తించగా.. వారందరికీ పంపిణీ చేయనున్నారు. మూడు రోజులు .. పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఆరోజు మిగిలిన పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి కార్యక్రమంలో భాగంగా చుక్కల మందు వేస్తారు. ఈ నెల 28న పోలియో చుక్కల పంపిణీ జిల్లాలో 76వేల మందికి పైగా 5 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా వేయించాలిఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పిల్లలు పోలియో వ్యాధి బారిన పడకుంగా, అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు దోహదం చేస్తాయి. మొదటి రోజు వేసుకోని వారికి వైద్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి పోలియో చుక్కలు పింపిణీ చేస్తారు. చిన్నారులు మిస్కాకుండా చూసుకోవాలి. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ -
దొంగ నోట్ల తయారీ ముఠా అరెస్ట్
పాలకుర్తిటౌన్:(దేవరుప్పుల) : అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సృజన్కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన చింత సుదర్శన్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి దొంగ నోట్లు, ప్రింటర్, కారు, రూ. 8500 నగ దు, నాలుగు సెల్ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం పాలకుర్తి ఇన్చార్జ్ సీఐ, వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్రావు పర్యవేక్షణలో స్థానిక ఎస్సై సృజన్కుమార్ ఆ నలుగురిని బుధవారం రిమాండ్ నిమిత్తం జనగామ జైలుకు తరలించారు. కాగా, దొంగ నోట్ల గుట్టు రట్టులో ఎస్సైతోపాటు సిబ్బంది యాకూబ్, యాకేశ్, దామోదర్, అశోక్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు. ప్రింటర్, కారు, ఇతర సామగ్రి స్వాధీనం వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య -
మురుగు.. పరుగు
బ్యాంకు స్ట్రీట్లోని డ్రెయినేజీలో నిలిచిన మురుగునీరు, సాయినగర్లో నూతనంగా నిర్మించిన కాల్వలో నిలిచిన మురుగు డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో డ్రెయినేజీలు, సైడు కాల్వల్లో మురుగు, వ్యర్థాలు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్యలోపం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, అధికారులు డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పలు వార్డుల్లో.. మున్సిపాలిటీ పరిధిలో 15వార్డులు ఉన్నాయి. కాగా, కొంతకాలంగా డ్రెయినేజీలు, సైడు కాల్వ లను శుభ్రపరచకపోవడంతో మురుగు, వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. గాంధీ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్, బ్యాంకు స్ట్రీట్ నుంచి పాతడోర్నకల్ వరకు ప్రధాన రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలను నెలల తరబడి శుభ్రపర్చడం లేదు. దీంతో మురుగు, వ్యర్థాలతో డ్రెయినేజీ నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే దోమల బెడద పెరగడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో డ్రెయినేజీలను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేయడంతో శుభ్రం చేసే అవకాశాలు లేక వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులతో డ్రెయినేజీలు మూసుకుపోయాయి. పెరిగిన సైడు కాల్వలు.. ఇటీవల ఒక్కో వార్డుకు కోటి రూపాయల నిధులు మంజూరు కావడంతో 15 వార్డుల్లో సైడు కాల్వలను నిర్మించారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో సైడు కాల్వల పొడవు పెరిగింది. సైడు కాల్వలు నిర్మించి నెలలు గడుస్తున్నా .. నేటి వరకు శుభ్రపరచకపోవడంతో మట్టి, వ్యర్థాలు, మురుగుతో మూసుకుపోతున్నాయి. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన మురుగు దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు డోర్నకల్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరతతో పారిశుద్ధ్య సమస్యలు సిబ్బంది కొరత.. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో డ్రెయినేజీలు, కాలువలు శుభ్రపరిచేందుకు ఏడుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో అరకొరగా కాల్వలను శుభ్రపరుస్తున్నారు. ప్రస్తుతం అమృత్ పైపులైన్లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల్లో తరచూ పైపులు పగులుతుండగా.. సిబ్బందిని పైపులైన్ల మరమ్మతులతో పాటు ఇతర పనులకు వినియోగిస్తున్నారు. దీంతో నెలల తరబడి కాల్వలను శుభ్రపరచకపోవడంతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై వర్షాలు పడుతుండడంతో అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయనిఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు స్పందించి డ్రెయినేజీలు, సైడు కాల్వలను శుభ్రపరిచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక
హన్మకొండ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నెల 29న వరంగల్ పర్యటనకు వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వరంగల్ రానున్నారు. ఈ దిశగా పర్యటన విజయవంతానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సభ నిర్వహణకు గాను బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతం రావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు స్థల పరిశీలన చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని కుడా (హయగ్రీవచారి) మైదానం, వరంగల్లోని అజాంజాహి మిల్లు గ్రౌండ్, మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ను పరిశీలించారు. చివరకు హనుమకొండ బాలసముద్రంలోని కుడా మైదానంలో సభ నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. అనంతరం హనుమకొండ హంటర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్లో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్.గౌతం రావు మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పర్యటను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, గంటా రవికుమార్, ఆయా జిల్లాల అధ్యక్షుడు బలరాం నాయక్, శశిధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు. స్థల పరిశీలన చేసిన నాయకులు -
గంజాయి రహిత సమాజమే లక్ష్యం
● ఎస్పీ శబరీష్ దంతాలపల్లి: గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్లాడ గ్రామంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతీ ఒక్కరు మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తే గ్రామాలు బాగుపడుతాయని అన్నారు. యువత మత్తుకు బానిసై తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి ప్రాణాలను కోల్పోవడమే కాకుండా కన్నవారికి కడుపుకోత మిగిల్చిన వారవుతారని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబాలను అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ద్విచక్రవాహనం కలిగిన ప్రతీ ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించి కుటుంబానికి రక్షణగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డుపల్లి వెంకన్న, డీఎస్పీ కృష్ణ కిశోర్, సీఐ గణేష్, ఎస్సై రవికుమార్, వార్డు సభ్యులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
అర్థమయ్యే రీతిలో బోధించాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి కేసముద్రం: విద్యార్థులకు ప్రాథమిక విద్యను సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం మండలంలోని కల్వల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, జెడ్పీ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. ఇంగ్లిష్లో సంభాషిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం డీఈఓ మాట్లాడారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ఇన్చార్జ్ హెచ్ఎం ఆర్.ఏకాంబ్రం, పీఎస్ హెచ్ఎం కళ్లెం వీరారెడ్డి, పీడీ కొప్పుల శంకర్, నాగేందర్, బేతి సత్యనారాయణ, మార్గం శ్రీనివాస్, సీఆర్పీ ఉదయ్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి ఇసుక దందా!
ఆకేరు, మున్నేరు వాగుల నుంచి విచ్చలవిడిగా అక్రమ రవాణా చిన్నగూడూరు మండలంలో ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు(ఫైల్) ●సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా చేసేందుకు కూపన్లు ఇస్తున్నారు. అయితే కూపన్లు ఇచ్చేందుకు గృహనిర్మాణ శాఖ, గ్రామ కార్యదర్శి ద్వారా ధ్రువీకరించిన పత్రాలు చూపించాలి. అప్పుడు తహసీల్దార్ కార్యాలయం నుంచి కూపన్లు పంపిణీ చేస్తారు. ఇదే అదునుగా ఒక్క కూపన్ చూపించి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ లబ్ధిదారులకు కాకుండా.. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకాలు చేసి అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రచారం. అర్ధరాత్రి వేళ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు స్వేచ్ఛగా పగలు ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ ఆదేశించారు. కూపన్ల పంపిణీపై రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిఘా పెట్టాలని పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం ఇందిరమ్మ మొదటి విడత నిర్మాణాలు సగానికి మించి పూర్తయ్యాయి. దీంతో పలు మండలాల్లో ఇసుక కూపన్ల పంపిణీ నిలిపివేశారు. అయితే ఉదయం పూట కూపన్ల పేరుతో రవాణా చేయడంతో పాటు.. వారం రోజులుగా జిల్లాలో రాత్రిపూట ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు ప్రచారం. రాత్రి 10నుంచి తెల్లవారుజాము 4గంటల వరకు నిరాటంకంగా రవాణా చేస్తున్నారు. నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ, నెల్లికుదురు మండలాల్లో దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయపడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయినాకు ఆకేరు వాగు పక్కనే మూడెకరాల పొలం ఉంది. ప్రతీ ఏడాది వానాకాలం, యాసంగి పంటలు సాగు చేస్తే పుష్కలంగా వరి పంట పండేది. ప్రస్తుతం వానాకాలంలో సాగు చేద్దామన్న నీళ్లు నిల్వ లేని పరిస్థితి. ఇదే అదునుగా కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేస్తుండడంతో భూగర్భజలాలు ఎండిపోతున్నాయి. చెక్ డ్యామ్ కుడి ఆనకట్టకు మరమ్మతులు చేయాలని స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. – భర్తాపురం కొమురెల్లి, రైతు, ఉగ్గంపల్లి రాత్రిపూట ఇసుక రవాణా నిలిపివేయాలిఆకేరు వాగు నుంచి రాత్రిపూట ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో ముంగిమడుగు, రామన్నగూడెం, నర్సింహులపేట ప్రజలకు నిద్రలేకుండా పోతుంది. మితిమీ రిన వేగంతో ఇసుక ట్రాక్టర్లు వస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయం వేస్తుంది. అక్రమంగా రవాణా జరుగుతున్న ఇసుకను అధికా రులు అరికట్టాలి. రాత్రి వేళల్లో మండలంలోని ఆకేరు వాగు నుంచి అక్రమ రవాణాను నియంత్రించి ఇందిరమ్మ ఇళ్లకు పేద లబ్ధిదారులకు తక్కువ ధరలకు పంపిణీ జరిగేలా చూడాలి. – కొంపెల్లి నరేష్, నర్సింహులపేట అధికారుల మౌనం వెనుక.. అర్ధరాత్రి ఆకేరు, మున్నేరు వాగుల నుంచి ఇసుకను తరలిస్తూ స్థానికంగా డంప్లు పోయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల సమీపంలో పోయడం, గోదావరి ఇసుకలో కలపడం వంటివి చేస్తున్నారు. మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు వారానికి ఒక్కొక్క ట్రాక్టర్కు రూ.5వేలు, నెలకు రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం. జిల్లాలో సుమారుగా 300లకు పైగా ట్రాక్టర్లు ఈ దందాలో భాగం అవుతున్నట్లు ప్రచారం. ఇందుకోసం ఓ ఇసుక మాఫియా డాన్ అందరి వద్ద వసూళ్లు చేయించి.. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ రవాణాశాఖ అధికారులకు వాటాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి ప్రైవేట్లో అమ్మకాలు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు కలెక్టర్ ఆదేశించినా ఆగని అక్రమ సరఫరా -
విద్యార్థినులు చదువులో రాణించాలి
మరిపెడ రూరల్: కేజీబీవీ విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలని జీఈసీఓ గాయత్రి అన్నారు, మంగళవారం మరిపెడ మండలం గుండెపూడి శివారు కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, టాయిలెట్స్, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను ఆమె పరిశీలించారు. ఉదయం అల్పాహారం ప్రారంభంతో పాటు ప్రార్థన సమయంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు అందించారు. ఈ ఏడాది 6వ తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులకు చెలిమి ప్రోగ్రామ్స్తో పాటు ఎస్బీ ద్వారా ప్రత్యక్ష బోధన, ఖాన్ అకాడమీ ద్వారా విద్య, సైన్స్ ల్యాబోరేటరీ, గ్రంథాలయం వినియోగం, క్రీడలు, వివిధ రంగాల్లో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం సీఆర్టీలతో మాట్లాడుతూ.. పాఠశాల టైం టేబుల్ సిద్ధం చేసుకుని విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఓ చాందిని, సీఆర్టీలు పాల్గొన్నారు. -
ప్రభుత్వం సూచించిన విత్తనాలు వేయాలి
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నాణ్యమైన విత్తనాలు వేసి రైతులు లాభాలు పొందాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం మండలంలోని కల్వల గ్రామ రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో 7 రకాల సన్న వరి విత్తనాలను రైతులు సాగు చేసుకుని, ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయించినట్లయితే వెంటనే పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులకు తెలియజేయాలన్నారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడకాన్ని పెంచాలన్నారు. అదే విధంగా డీఏఓ విజయచంద్ర మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని, రైతులు గమనించి ఆరుతడి పంటలైన పెసర, మినుములు, కందులు, జొన్నలు, కూరగాయలను సాగు చేసుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలను, విత్తన డీలర్లు ఏర్పాటు చేసిన వరి, పెసర, జీలుగ విత్తనాలను కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధి అమీనాపురంలో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో జాప్యం కాకుండా వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, కేసముద్రం పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్రెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ క్రాంతి, ఏఓ వెంకన్న, జిల్లా విత్తన డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఓలం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నివేదికలు సమర్పించాలి మహబూబాబాద్: రోడ్డు నిర్వహణ మరమ్మతులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు సేఫ్టీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి వైద్యం అందించాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. సంబంధిత అధికారులు రోడ్డు మ్యాపింగ్ మార్కింగ్పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ ఎన్నికల మ్యాపింగ్లో పారదర్శకత అవసరం అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు.. ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్నేహశబరీష్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ పక్కన 255 సర్వే నంబర్ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్నారు. ఆక్రమించిన భూమిని ప్రభుత్వ నిబంధనల ప్రకా రం స్వాధీనం చేసుకున్నామన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళా ల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ కల్వల రైతువేదికలో విత్తన మేళాకు హాజరు -
భూ సమస్య కొలిక్కి..
సాక్షి, మహబూబాబాద్ : నారాయణపురం గ్రామ భూ సమస్య త్వరలో కొలిక్కి రానుంది. అధికారులు దీనికి సంబంధించిన ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అప్పట్లో ఉన్న తండాలను కలుపుకుని ఉమ్మడి నారాయణపురం గ్రామాన్ని నెల్లికుదురు మండలం చెట్లముప్పారం రెవెన్యూ గ్రామం నుంచి వేరుచేసి రెవెన్యూ విలేజ్గా మార్చారు. ఆ తర్వాత కేసముద్రం మండలంలో కలిపారు. ఈ క్రమంలో పొరపాటున అధికారులు ఆ గ్రామ భూములన్నింటినీ అటవీ శాఖలో కలపగా, అప్పటి నుంచి ఆ గ్రామ రైతులకు రైతుబంధు (ప్రస్తుతం రైతు భరోసా), రైతుబీమా, బ్యాంకు రుణాలు అందకుండా పోయాయి. ఆ తర్వాత పలుమార్లు ఆ గ్రామ రైతులు మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, దీక్షలు చేపట్టారు. అలాగే, అప్పటి ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎంపీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో వీరు పలు మార్లు అప్పటి కలెక్టర్ శశాంకతో చర్చించారు. చివరకు అప్పటి సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు కూడా ఈ సమస్య చేరింది. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. చివరకు సమస్యకు పరిష్కార మార్గం దొరికింది. సిద్ధమవుతున్న పట్టాదారు పాస్ పుస్తకాలు పది సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలు నోచుకోని నారాయణపురం రెవెన్యూ విలేజ్ రైతులకు త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాలు అందించనున్నారు. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి అధికారులు, ఉద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా తండ్రి పేరున ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేరు పాస్ పుస్తకాలు ఇవ్వడం, చనిపోయిన వారి స్థానంలో వారసుల పేర్లు చేర్చడం, వివిధ కారణాలతో కాస్తులో ఒకరు, పట్టాదారుగా మరొకరు ఉన్న వాటిని పరిశీలించి నిజమైన రైతుకు పాస్ పుస్తకాలు అందచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ కేసముద్రం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పాస్ పుస్తకాల పంపిణీకి ఉన్న అన్ని అడ్డంకులు తొలగాయన్నారు. పాస్ పుస్తకాల తయారీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటే.. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడమా.. మెడికల్ కళాశాల ప్రారంభానికి రానున్న సీఎం చేతుల మీదుగా ఇప్పించడమా అనే విషయంపై చర్చ జరుగుతోంది.906 మంది రైతులకు 1,611 ఎకరాల భూమి పట్టాలు సిద్ధం పొరపాట్లను సవరించే పనిలో జిల్లా అధికార యంత్రాంగం త్వరలో నారాయణపురం గ్రామ అన్నదాతల చేతుల్లోకి పట్టాలురాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నారాయణపురం సమస్య తీరకపోవడంతో అక్కడి రైతులు పలుమార్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మురళీ నాయక్ ద్వారా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత 15 రోజుల నుంచి నారాయణపురం సమస్య పరిష్కరించాలని తహసీల్దార్ వివేక్ను ఆదేశించారు. దీంతో నారాయణపురం రెవెన్యూ పరిధిలోని నారాయణపురం, క్యాంపుతండా, పీక్లాతండా రైతుల భూమిని పరిశీలించి సర్వే నిర్వహించారు. చివరకు 1,411 భూ ఆధార్ మ్యాపింగ్లను గుర్తించారు. అటవీ, ఇతర ప్రభుత్వ భూములను వేరు చేశారు. చివరకు 906 మంది రైతులకు 1,611 ఎకరాల భూమి పట్టాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. -
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
మహబూబాబాద్ రూరల్ : బూత్స్థాయి ఏజెంట్లు పార్టీకి వెన్నెముక లాంటి వారని, ప్రతీ ఓటరును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నా రు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీఎల్ఏల శిక్షణ సమావేశం మంగళవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు క్యాడర్ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా బీఎల్ఏల శిక్షణ ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు రామిరెడ్డి, బండి శ్రీను, వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఆడిట్
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో మంగళవారం సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ సంపత్రావు ఆధ్వర్యంలో ముగ్గురు కమిటీ సభ్యులు పాఠశాల సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చే నిధులు వినియోగం, వనరులు, సదుపాయాలపై ఆడిట్ నిర్వహించారు. పాఠశాలకు వచ్చిన నిధులు, ఖర్చుల గురించి ప్రభుత్వానికి నివేదికను తయారు చేసి అందజేయనున్నారు. ఎంఈఓ శీలం వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం సిరినాయక్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కోచింగ్మహబూబాబాద్ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు అర్హులైన మైనార్టీ విద్యార్థులకు నాలుగు నెలలు పాటు మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ హైదరాబాద్ సహకారంతో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి టీఏవీ.నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు, ఎస్ఎస్సీ, సీజీఎల్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఆర్ఆర్బీ, తెలంగాణ పోలీస్ నియామకాలు, ఐబీపీఎస్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తామన్నారు. అభ్యర్థుల ఏదైనా డిగ్రీ పాసై ఉండాలన్నారు. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్, ఇందిర ప్రియదర్శిని కౌన్సెలింగ్ సెంటర్ నాంపల్లి హైదరాబాద్లో నేరుగా విద్యార్థులు అందజేయాలని, పూర్తి వివరాలకు మానుకోట కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ ఆఫీస్ను సంప్రదించాలన్నారు. 791 పేద కుటుంబాల గుర్తింపుగంగారం: నీతి ఆయోగ్ స్కీంలో మండలంలో 791 పేద కుటుంబాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గుర్తించి నివేదిక రూపొందించారు. మండలంలోని గుర్తించిన పేద కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు సోమవారం సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్కు కలెక్టర్ వివరించారు. ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలితొర్రూరు: ఆర్టీసీ అభివృద్ధికి సిబ్బంది సహకరించాలని డీఎం ప్రసూనలక్ష్మి కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎంను మంగళవారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. డీఎం మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ కుమార్, డిపో కార్యదర్శి జిలుకర యాదగిరి, నాయకులు ఎంకే రావు, సతీష్, సత్తయ్య, వనజ, రాజేశ్వరి, శ్రీలత, రాధిక, ధనుంజయ్, టీవై రెడ్డి పాల్గొన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలిమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వివిధ సంక్షేమ హాస్టళ్లను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు దాటినా విద్యార్థులందరూ రాకపోవడంతో సంక్షేమ హాస్టళ్లు వెలవెలబోతున్నాయన్నారు. సరైన మరుగుదొడ్లు, బాతురూమ్లు, తలుపులకు కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను జిల్లా అధికారులు సందర్శించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండ్ల రాకేష్, చందు, విక్రమ్, వినోద్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బులు ఇప్పించాలి
మహబూబాబాద్ రూరల్: మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేసిన వ్యాపారి రెండు నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు ధర్నా చేపట్టారు. వెంటనే డబ్బులు చెల్లించాలని మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి ధర్నా చేశారు. మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. రైతులు వెంకన్న, అనిల్ కుమార్, రాంజీ, కోటేష్, కట్టయ్య, నరేష్ మాట్లాడుతూ.. మానుకోట వ్యవసాయ మార్కెట్ పరిధిలో, మార్కెట్ బయట సుమారు 40 మంది రైతుల వద్ద నుంచి ఎన్.ఎస్. ట్రేడర్స్ యజమాని శేఖర్ మిర్చి, మొక్కజొన్న కొనుగోలు చేశారన్నారు. మొత్తం రైతులకు చెందిన సుమారు రూ.40 లక్షలకుపైగా రావాల్సి ఉందన్నా రు. వెంటనే డబ్బులు ఇప్పించేలా వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ ను వివరణ కోరగా ఎన్.ఎస్.ట్రేడర్స్ యజమాని శేఖర్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. మిర్చి, మొక్కజొన్న విక్రయించిన రైతులు డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతుల ధర్నా -
బడికి పంపకండి..
డబ్బులు ఇస్తేనే మీ పిల్లలకు చదువులు చెబుతాం‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది దంతాలపల్లి మండలం పెద్దముప్పా రం గ్రామానికి చెందిన ధర్మారపు వేణు. ఈయన కుమారుడు వరుణ్ తొర్రూరు పట్టణంలోని అబ్యాస్ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం కల్పించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ఎంపికై న వరుణ్ ఆరో తరగతి నుంచి ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అయితే ‘రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు వి డుదల చేయడం లేదు.. మీ అబ్బాయికి చదువు చెప్పలేం.. మీకు ఫీజు చెల్లించే స్తోమత ఉంటేనే బడికి పంపించండి.. లేకపోతే వేరే పాఠశాలకు పంపించుకోండి’ అని పాఠశాల యాజమాన్యం మెసేజ్ పెట్టింది. దీంతో దిక్కుతోచని వేణు సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన బిడ్డ పరిస్థితి ఏమిటని ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించుకున్నాడు.’ ●సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం పలురువు పేద విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తోంది. ఇటువంటి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బోధనతో పాటు, హాస్టల్ వసతి, పుస్తకాలు, దుస్తులు, టై, బెల్ట్, షూ మొదలైన ఖర్చులకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. అయితే, నాలుగేళ్లుగా ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదని, ఈ ఏడాది జిల్లాలోని పలు స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను పాఠశాలలకు పంపొద్దని అంటున్నాయి. మరి కొన్ని పాఠశాలలు డబ్బులు చెల్లించి విద్యార్థులను పంపించాలని చెబుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించే స్తోమత ఉన్న తల్లిదండ్రుల పిల్లలు బడికి వెళ్తుండగా.. నిరుపేద విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభం నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. బడికి వద్దంటూ.. జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ద్వారా తొర్రూరు పట్టణంలోని అబ్యాస్ ప్రైవేట్ పాఠశాల, లిటిల్ప్లవర్, పీఎస్ఆర్, అర్యభట్ట, మహబూబాబాద్ పట్టణంలోని విద్యాభివర్థని, ఎస్వీ విద్యాలయంలో 496 మంది చదువుతున్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ ద్వారా తొర్రూరు పట్టణంలోని అబ్యాస్ స్కూల్ మహబూబాబాద్ పట్టణంలోని విద్యాభారతి, కృష్ణవేణి, గాదె రుక్మారెడ్డి, డోర్నకల్ పట్టణంలోని సెయింట్ హానర్స్ పాఠశాలలో 260 మంది మొత్తం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా 756 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా ఒకటి నుంచి నాల్గో తరగతి వరకు ఏడాదికి రూ. 28వేల చొప్పున, 5నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 42వేలు, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 5నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థికి రూ. 42వేల చొప్పున చెల్లిస్తారు. అయితే 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదు. మొత్తం రూ. 5కోట్లకు పైగా డబ్బులు రావడం లేదు. ఇప్పుడు పలు పాఠశాలల యాజమాన్యాలు డబ్బులు ఇస్తేనే పిల్లలను పంపండి అని చెబుతున్నాయి.తల్లిదండ్రులు సతమతం ఫీజులు చెల్లిస్తేనే పిల్లవాడిని బడికి పంపించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదు. ఫీజులు చెల్లించే స్తోమత లేక పాఠశాలకు పంపించలేమని, అలాగని పిల్లవాడిని వేరే పాఠశాలకు పంపిస్తే చదువులు ఆగం అవుతాయని.. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రెండు, మూడు సార్లు జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాల మెసేజ్ అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు త్వరగా బకాయిలు చెల్లించాలని కలెక్టర్కు విన్నపం -
ఆర్ఎంపీ వైద్యంపై విచారణ..
లింగాలఘణపురం : జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కుందారంలో ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి గౌసియాబేగం అనే మహిళ మృతి చెందండంపై డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు స్పందించారు. ఈ నెల 20న సాక్షిలో ‘ఆర్ఎంపీ వైద్యం వికటించి మహిళ మృతి..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి డీఎంహెచ్ఓ స్పందించి మండల వైద్యాధికారి ఉదయ్కిరణ్ను విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో సోమవారం ఆయన కుందారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సదరు మహిళ ఎప్పుడు మృతి చెందింది.. ఎలా జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం ఇంజక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ ఇంటికి వెళ్లి విచారణ చేయగా తాను ఎలాంటి వైద్యం చేయడం లేదని, సదరు మహిళ ఓ ఇంజక్షన్ తీసుకొచ్చి ఇవ్వాలని వేడుకోవడంతో ఇచ్చానని, తాను ఎలాంటి వైద్యం చేయడంలేదని చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై మండల వైద్యాధికారి ఉదయ్కిరణ్ను వివరణ కోరగా నివేదికను డీఎంహెచ్ఓకు సమర్పించనున్నట్లు వివరించారు. డీఎంహెచ్ఓకు నివేదిక ఇవ్వనున్న మండల వైద్యాధికారి -
విత్తనానికో పండుగ
కొత్తగూడ : కడుపు నింపే ఎలాంటి ధాన్యం అయినా విత్తనం నుంచి రావాల్సిందే. అందుకే ఆదివాసీ సమాజం విత్తనాన్ని దైవ సమానంగా భావించి దీనిని మొదటి పండుగగా నిర్వహిస్తారు. తొలకరి పలకరించిందంటే ఏజెన్సీ గూడెల్లో విత్తన పండుగ సందడి మొదలవుతుంది. గ్రామంలోని పెద్దలు ఒక రోజు నిర్ణయించుకుని ఆ రోజు ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. ముందుగా ఇలవేల్పులకు ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. వెదురు బుట్టల ను ఆవు పేడతో అలికి పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. ఆ బుట్టల్లో నవ ధాన్యాలు పోసుకుని ఇంటికో బుట్ట తీసుకుని సంప్రదాయ వాయిద్యాలతో బొడ్రాయి (గ్రామ దేవత) వద్దకు చేరుకుంటారు. గ్రామ దేవతను నీటితో అభిషేకించి ముగ్గు వేసి చిన్న గొయ్యి నాగలి కర్రుతో తవ్వుతారు. గ్రామ పెద్ద గొయ్యిలో నవ ధాన్యాల్లో కొన్ని తీసి పోస్తాడు. అనంతరం మిగతా వారు తలా కొన్ని ఆ గొయ్యిలో వేస్తారు. దాన్ని పూడ్చి నీరు పోస్తారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లిస్తారు. ఈ పండుగ చేయనిదే ఆదివాసీ గ్రామాల్లో ప్రజలు విత్తనం వేయరు. కాగా, శనివారం ఆదివాసీలు విత్తన పండుగ జరుపుకున్నారు. గ్రామదేవత వద్ద నవధాన్యాలు వేస్తున్న కొత్తగూడ గ్రామస్తులు, వెదురు బుట్టల్లో నవధాన్యాలతో ఆదివాసీలు మా తాతల కాలం నుంచి విత్తన పండుగ ఆనవాయితీగా వస్తోంది. విత్తనాన్ని మేం దైవంగా భావిస్తాం. విత్తనానికి పూజ చేయనిదే ఎవుసం మొదలు పెట్టం. గ్రామ దేవతల ఆశీర్వాదం, పంచ భూతాల సాకారం కోరుతూ విత్తన పండుగ చేసుకుంటాం. – మల్లెల రామయ్య, గ్రామపెద్ద, కొత్తపల్లిఆదివాసీ సమాజం ప్రకృతితో మమేకమై ఎన్నో పండుగలు నిర్వహిస్తుంది. అందులో విత్తన పండుగ ఒకటి. ఇలాంటి పండుగలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి. విత్తన పండుగకు ఒక తేదీ నిర్ణయించి సెలవు ప్రకటించాలి. ఉద్యోగులు, విద్యార్థులు విత్తన పండుగలో పాల్గొనే అవకాశం కల్పించాలి. – నర్సింగరావు, తుడుందెబ్బ నాయకుడు ఆదివాసీ గూడెల్లో సందడి.. మృగశిర కార్తెతో వ్యవసాయం మొదలు -
విగ్రహాల తొలగింపు.. భద్రపరిచేందుకు ఏర్పాట్లు
● ఫొటో, వీడియో చిత్రీకరణలో కొనసాగుతున్న పనులుకాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రాకారాల్లో విగ్రహాలు, ఉప ఆలయాల్లో మూలవిరాట్టులను తొలగిస్తున్నారు. ప్రధాన గర్భగుడిలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి జోడు లింగాలను అక్కడే మూసివేశారు. గర్భగుడి స్తంభా లను కూడా తొలగిస్తారు. ప్రాకారంలోని భారీ హ నుమాన్, మత్స్య విగ్రహాలను, ప్రధాన ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహం, శ్రీసరస్వతి అమ్మవా రి ఆలయంలోని విగ్రహాన్ని తీశారు. నవగ్రహాలు, స్పటిక లింగం తొలగించారు. ఇంకా శ్రీశుభానందా దేవి, శృంగీ, బృంగీ విగ్రహాలు, పడమర, దక్షిణం, ఉత్తర నందులు తొలగించాల్సి ఉంది. సరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లోని వెండి ఆభరణాలను భద్రపరుస్తున్నారు. తొలగించిన వి గ్రహాల కోసం ప్రత్యేకంగా దేవాదాయశాఖ ఏర్పా ట్లు చేపట్టింది. శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో ఫ్లైవుడ్తో బాక్స్లు తయారు చేస్తున్నారు. ఆ బాక్సుల్లో ధాన్యం పోసి విగ్రహాలను భద్రపరిచేందకు తమిళ శిల్పులతో తయారీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ధాన్యం 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. సుమారు 25మంది వరకు తమిళ శిల్పులు తొలగింపు పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులను ఫొ టోలు, వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు.


