ఓటర్ల గోప్యత!
●అంతుచిక్కని ఓటరు నాడి
● ఓటు ఎవరికి వేశారో చెప్పని వైనం
● తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు
● ఫలితాల రోజే ఉత్కంఠకు తెర
సాక్షి, మహబూబాబాద్: గతంలో ఎన్నో ఎలక్షన్లు చూశాం.. ఎంతో మందిని గెలిపించాం.. ఎంతో మందిని ఓడించాం.. నామినేషన్ వేసినప్పుడే పలువురు అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది.. ప్రచారంలో మరికొందరి భవితవ్యం తెలిసేది.. కానీ ఈ ఎన్నికలు ఎవరికి అర్థంకాని రీతిలో జరిగినట్లు జిల్లాలోని ఓటర్లు చెప్పుకుంటున్నారు. దీంతో పోలింగ్ అయిన తర్వాత కూడా బ్యాలెట్ బ్యాక్సుల్లో ఏం ఉందో ఓటరు నిర్ణయం ఎలా ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో శుక్రవారం ఫలితాలు తేలే వరకు అభ్యర్థుల్లో ఉత్కంఠ ఉండనుంది.
ఎవరూ వచ్చినా అదే సమాధానం..
జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒకటి, రెండు మినహా అన్ని వార్డుల్లో పోటీ అంచనా వేయడం కష్టంగా మారింది. ఓటరు నాడి పట్టే నాథుడే కనిపించడం లేదు. అభ్యర్థులు ఓటు అడిగేందుకు వచ్చిన సందర్భాల్లో ఓటరు చెప్పే సమాధానం ఒకే విధంగా ఉండడం గమనార్హం. అధికార కాంగ్రెస్ అభ్యర్థులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజీపీ, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టుకుని మంచినీళ్లు ఇచ్చి వారు చెప్పిందంతా విని మీకే ఓటు వేస్తామనే నమ్మకం కలిగించడం గమనార్హం. అయితే ఒక్కరిద్దరికి కాకుండా.. అందరికీ నమ్మకం కలిగించే విధంగా ఓటరు ఉండడంతో చివరకు ఓటు ఎటు వేసింది మాత్రం అంతుపట్టకుండా ఉంది.
ఒక వైపు ఓటింగ్.. మరో వైపు డబ్బుల పంపిణీ
ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో పోలింగ్కు ము ందు రాత్రి ఓటర్లకు డబ్బులు, మందు, చీరలు, ఇ తర బహుమతులు, తాయిలాలు ఇచ్చేవారు. తెల ్ల వారే సరికి అంతా గప్ చిప్గా ఉండేది. కానీ ఈ సారి ఒక వైపు ఎన్నికలు జరుగుతుంటే.. మరోవైపు డబ్బుల పంపిణీ ముమ్మరంగా సాగింది. చివరి రోజు పంపిణీ చేసిన డబ్బులకే ప్రాధాన్యత ఉంటుందని నమ్మిన అభ్యర్థులు ప్లాన్ ప్రకారం ఓటర్లకు అందేలా చర్యలు తీసుకున్నారు. కుటుంబం మొత్తం గంప గుత్తగా ఓట్లు వేయాలని కోరుతూ.. పలు వార్డుల్లో ప్రతీ కుటుంబానికి రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు ఇవ్వడం అందరిని విస్మయానికి గురిచేసింది. ఇలా ఒకరిని చూసి మరొకరు తిరిగి డబ్బులు పంపిణీ చేస్తుండగా.. దీనిని గమనించిన ఓటర్లు ఆలస్యంగా ఓటు వేశారు.


