వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శివపూజకు వేళ అయ్యింది. నేడు (ఆదివారం) మహాశివరాత్రి పర్వదినం. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాల వెలుగుల్లో జిగేల్ మంటున్నాయి. ఆయా ఆలయల్లో అత్యంత వైభవోపేతంగా జరగనున్న శివపార్వతుల కల్యాణోత్సవానికి లక్షమంది భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, శివనామస్మరణతో శైవాలయాలు మార్మోగనున్నాయి.
శివాలయాల్లో ప్రత్యేక పూజలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు మార్మోగనున్న శివనామస్మరణ
18వ తేదీ వరకు నిర్వహణ– కార్యక్రమ వివరాలు ఇలా..
హన్మకొండ కల్చరల్: నగరంలోని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మహాశివరాత్రి రోజు భక్తుల జాగరణ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజు శివపార్వతుల కల్యాణం లింగోద్భవకాలపూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. పూజకార్యక్రమాలలో పాల్గొనే భక్తులు రూ. 21,116 చెల్లించి రశీదు పొందాలి. అలాగే విడిగా చండీహోమంలో రూ. 3,116, స్వామివారి కల్యాణంలో రూ. 1116, లింగోద్భవకాల పూజకోసం రూ. 12,116, అన్నపూజకోసం రూ. 5,116 చెల్లించాలని ఆలయ ఈఓ అనిల్కుమార్ తెలిపారు.
15వ తేదీన..
● 15వ తేదీన (ఆదివారం) ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, రుద్రేశ్వరస్వామి వారికి సామూహిక రుద్రాభిషేకాలు, నిత్యవిధిహవనం, సాయంత్రం 5.45గంటలకు ఉత్తరాషాడ నక్షత్రయుక్త గోధూళిలగ్నసుమూహూర్తమున రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరిదేవి వారి కల్యాణోత్సవం జరుగుతుంది. అర్ధరాత్రి 12గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వకమహ రుద్రాభిషేకం జరుగుతుంది.
16న..
● 16వతేదీ (సోమవారం) ఉదయం 5గంటలకు సుప్రభాతం గణపతిపూజ, స్వామివారికి రుద్రాభిషేకములు, మహాపూజ, నాగవెల్లి కార్యక్రమం జరుగుతుంది.
17న..
● 17వతేదీ (మంగళవారం) మహాన్నపూజ, అన్నప్రసాదాల వితరణ. సాయంత్రం మహాపూజ
18న..
● 18వ తేదీ (బుధవారం) ఉత్సవ ముగింపులో భాగంగా ఆంజనేయస్వామికి చందనోత్సవం, ఆకుపూజ, రుద్రేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, మహాబిల్వార్చన, చండీహోమం, పూర్ణాహుతి పండిత సత్కారం నిర్వహిస్తారు.
వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం


