‘పేట’ పీఠమెవరికో?
నర్సంపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఉధృత ప్రచారం నిర్వహించారు. నువ్వా? నేనా? అన్నట్లు సాగిన ప్రచారంలో పుర పోరులో చివరికి ఎవరికి గెలుపు లభిస్తుందో? మున్సిపాలిటీ పీఠం ఎవరికి దక్కుతుందోనని పట్టణ వాసులు ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ముగ్గురి మధ్య బలమైన పోరుతో గెలుపోటములు చర్చనీయాంశంగా మారాయి.
హోరాహోరీ ప్రచారం..
మునిపల్ ఎన్నికల్లో నర్సంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఎక్కువ ఉంది. అయితే బీజేపీ అభ్యర్థులకు లభించే ఓట్లు వారి గెలుపోటములను తారు మారు చేయనున్నాయి. నర్సంపేట మున్సిపాలిటీ బరిలో బలమైన అభ్యర్థులు ఉండడంతో ప్రచారం హోరాహోరీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్కరే ప్రచారం చేయడంతోపాటు గెలుపు బాధ్యత తన మీద వేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితోపాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. బీజేపీ మున్సిపాలిటీలో బోణి కొట్టాలనే సంకల్పంతో ఆ పార్టీ నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి 30 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్.. అభివృద్ధి మంత్రం
మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న పనులను చూపిస్తూ ఓట్లు అడుగుతూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక దృష్టితో పట్టణంలోని రోడ్లన్నీంటిని పూర్తి చేయించడంతో అత్యధిక వార్డులు గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
కాంగ్రెస్ హామీలు విస్మరించిందని బీఆర్ఎస్ ప్రచారం..
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని విమర్శిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతోందని తెలుపుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. మున్సిపాలిటీలో ఎక్కువ సీట్లు గెలుపొందాలనే ఉద్దేశంతో ఆ పార్టీ సీనియర్ నాయకులను పోటీ చేయించి ప్రచారం కొనసాగించారు.
బోణి కోసం బీజేపీ..
నర్సంపేట నియోజకవర్గంలో ఏ ఎన్నికలైనా ఇప్పటి వరకు రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉండేది. బీజేపీకి రేవూరి ప్రకాశ్రెడ్డి రాజీనామా చేసిన తర్వాత పార్టీ బలోపేతం బాధ్యతను గోగుల రాణాప్రతాప్రెడ్డి తీసుకున్నారు. గ్రామీణ స్థాయిలో కూడా క్యాడర్ను పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో గత సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క చోట బోణి కొట్టింది. దీంతో మున్సిపాలిటీలో సైతం బోణి కొట్టాలనే ఉద్దేశంతో 30 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపి ప్రధాన పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపేలా ప్రచారం నిర్వహించారు.
దొంతి మాధవరెడ్డి
పెద్ది సుదర్శన్రెడ్డి
గోగుల రాణాప్రతాప్రెడ్డి
‘పేట’ పీఠమెవరికో?
‘పేట’ పీఠమెవరికో?
‘పేట’ పీఠమెవరికో?


