తల్లి పిండ ప్రదానం చేస్తూ.. కుమారుడు గల్లంతు
● ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయిన న్యాయవాది
● గుండ్లసింగారం వద్ద ఘటన
హసన్పర్తి: తల్లి పిండ ప్రదానం చేయడానికి వెళ్లి కుమారుడు ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతయ్యాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లసింగారం ఎస్సారెస్పీ కాల్వ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కుమార్పల్లికి చెందిన రాజిడి వెంకటరాజా నర్సింహారెడ్డి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తన తల్లి 10 వర్ధంతి సందర్భంగా పిండ ప్రదానం చేయడానికి గుండ్లసింగారంలోని ఎస్సారెస్పీ కాల్వ వద్దకు చేరుకున్నాడు. పిండ ప్రదాన కార్యక్రమం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి నీటిలో పడ్డాడు. ప్రవాహం తీవ్రంగా ఉండడంతో అందులో కొట్టకుపోయారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు కొనసాగాయి. గీసుకొండ రిజర్వాయర్ వద్ద కూడా పోలీసులు గాలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.
ప్రేమ విఫలమై ఉరివేసుకుని
యువకుడి ఆత్మహత్య
కాజీపేట అర్బన్ : ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో ఇందిరమ్మకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. మడికొండ పోలీసుల కథనం ప్రకారం. ఇందిరమ్మకాలనీకి చెందిన ఆవుల ప్రణయ్కుమార్ (24)అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. యువతి తల్లిదండ్రులకు ప్రేమ విషయం తెలియడంతో అమ్మాయిని నల్లగొండలోని మేనమామ ఇంటికి పంపించారు. నల్లగొండనుంచి అమ్మాయి మేనమామ.. ప్రణయ్కుమార్కు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో భయపడిన ప్రణయ్కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నాడు. తల్లి సరోజన ఊరికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి చూడగా కుమారుడు ఉరి వేసుకున్నట్లు ఉండడంతో బోరున విలపించింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతుడి తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


