పోలీసు బందోబస్తు.. ట్రాఫిక్ ఆంక్షలు
● ఎస్పీ శబరీష్
● నేడు కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం,
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
మహబూబాబాద్ రూరల్ : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో 144 సీఆర్పీసీ (163 బీఎన్ఎస్ఎస్) సెక్షన్ అమలులో ఉంటుందని, అదే విధంగా విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శబరీష్ ఆదివారం తెలిపారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నలుగురు, అంతకంటే ఎక్కువమంది గుంపులుగా తిరగొద్దని, విజయోత్సవ ర్యాలీలు, టపాసులు కాల్చడం నేరంగా పరిగణించడంతోపాటు సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉదయం నుంచి వాహనాల దారి మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఇల్లందు వైపు నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలు వైఎస్సార్ సెంటర్ నుంచి బైపాస్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, ఎఫ్ఆర్ఓ సెంటర్ వైపు వెళ్లాలని సూచించారు. నెహ్రూ సెంటర్ వైపు వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్ బ్రిడ్జి కురవి గేట్ నుంచి వెళ్లాలని, రైల్వే స్టేషన్ నుంచి ఇల్లందు వైపు, నెహ్రూ సెంటర్, కురవి రోడ్ వైపు వెళ్లే వాహనాలు ఎఫ్ఆర్ఓ సెంటర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పేర్కొన్నారు. నెహ్రూ సెంటర్, అండర్ బ్రిడ్జి నుంచి ఎఫ్ఆర్ఓ సెంటర్, వైఎస్సార్ సెంటర్ వైపు వెళ్లే వాహనాలు కురవి గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని తెలిపారు.


