కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లోని కళాశాలల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్తో కలిసి వీసీ ప్రతాప్రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈపరీక్షలను గతఏడాది నవంబర్ –డిసెంబర్లో నిర్వహించారు. ఆయా డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మొత్తంగా 55,495మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 14,823 మంది(26.71శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడో సెమిస్టర్ పరీక్షల్లో మొత్తంగా 44,161 మంది పరీక్షలకు హాజరుకాగా 13,774మంది(31.19 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 36,097మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 15,020 మంది విద్యార్థులు (41.61శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, పద్మజ, నాగరాజు, కేయూ పాలకమండలి సభ్యులు సురేష్లాల్, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం ఈనెల 13నుంచి 15రోజుల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు.


