పోరు రసవత్తరం
● పలు వార్డుల్లో గట్టి పోటీ
సాక్షి, మహబూబాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం చేసిన పలు వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లు పోరు రసవత్తరంగా ఉంది. ఇలాంటి వార్డులపై జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆయా కేంద్రాల్లో ఎక్కువ మంది పోలీసులను మోహరించడం, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా మహబూబాబాద్ పట్టణంలోని 2,7,14,16,17,19,20, 29,34 వార్డుల్లో కొన్నిచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉండగా.. మరికొన్నిచోట్ల స్వతంత్రులు, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. కేసముద్రం మున్సిపాలిటీలో 1,5,8,10,13 వార్డుల్లో కొన్నిచోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. డోర్నకల్లో మున్సిపాలిటీలో అయితే సగం కంటే ఎక్కువ వార్డుల్లో గట్టి పోటీ నెలకొంది. ప్రధానంగా 1,2,6,7,9,13,15 వార్డుల్లో ఉత్కంఠ పోటీ నెలకొందని స్థానికులు చెబుతున్నారు. మరిపెడ మున్సిపాలిటీలో 9,12,13 వార్డుల్లో బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో నువ్వా.. నేనా అన్నట్లు పోటీ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో 02, 05, 11, 14, వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య, 15వ వార్డులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొందనే చర్చ జరుగుతోంది.
నేడు యథావిధిగా ప్రాక్టికల్ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం విద్యాసంస్థలకు సెలవు ఇచ్చిందని.. అయితే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డీఐఈఓ సీహెచ్. మదార్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులు విద్యార్థులు తప్పకుండా పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు.


