మేడారంలో సండే సందడి..
వనదేవతల దర్శనానికి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క,సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సందడితో మేడారం కళకళలాడింది. జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద జల్లు స్నానాలు ఆచరించారు. గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
దారిపొడవునా వాహనాలు..
అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో సమ్మక్క ప్రధాన ద్వారం ద్వారా క్రమ పద్ధతిలో గద్దెలపైకి అనుమతించారు. గంటల తరబడి సమ్మక్క గద్దె వద్ద వేచి ఉండడంతో ఒత్తిడి పెరిగి చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వరకు దారి పొడవునా వాహనాలు బారులుదీరాయి. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 80 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా.
వనభోజనాల సందడి..
మహాజాతర విజయవంతంగా ముగియడంతోపాటు తిరుగువారం పండుగ కూడా పూర్తవడంతో ఆనవాయితీ ప్రకారం పూజారులు, వారి కుటుంబీకులు, గ్రామస్తులు వనభోజనాలకు తరలివెళ్లారు. ముందుగా గ్రామదేవతలకు డప్పుచప్పులతో పూజలు నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలోకి వనభోజనాలకు వెళ్లారు. వనంలో కొత్త పందిరి ఏర్పాటు చేసి మట్టితో తయారు చేసిన గద్దెలను పసుపు, కుంకుమతో అలంకరించి పూజలు నిర్వహించారు. సమ్మక్క,సారలమ్మతో పాటు ఇతర దేవుళ్లకు పూజలు చేసి చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం అడవిలో వంటా వార్పు చేసుకుని సహపంక్తి భోజనం చేశారు.
కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం
అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు
వనభోజనాలకు తరలివెళ్లిన పూజారులు
మేడారంలో సండే సందడి..


