జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ నడిబొడ్డున పట్టపగలు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరె విశ్వనాథ్ (30), ఇదే మండలం వడ్డెరకాలనీకి చెందిన లక్ష్మి ఇద్దరూ కలిసి జగిత్యాల బైపాస్రోడ్లోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్నారు.
కాగా, లక్ష్మీకి గతంలో వడ్డెరకాలనీకి చెందిన గంగాధర్తో వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. 9 నెలల క్రితం లక్ష్మీకి ఇన్స్ట్రాగామ్లో విశ్వనాథ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయారు. పోలీసులు పిలిపించి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి లక్ష్మీని భర్తకు అప్పగించారు. కానీ, లక్ష్మి భర్త వద్ద ఉండకుండా మళ్లీ విశ్వనాథ్తో కలిసి శ్రీరాంనగర్లో ఉంటున్నారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథ్, లక్ష్మి పెంబట్ల కోనాపూర్ దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకుని జగిత్యాలకు వచ్చారు.
బైపాస్రోడ్లో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా గంగాధర్తో పాటు అతడి బంధువులు మరో ఇద్దరు విశ్వనాథ్పై కర్రలతో దాడి చేశారు. తలకు తీవ్రగాయాలు కావడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. లక్ష్మీకి సైతం గాయాలయ్యాయి. ఘటన స్థలాన్ని పట్టణ సీఐ కరుణాకర్ పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి బోరె చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


